కాళేశ్వరం కమిషన్ విచారణ సమాప్తం?
కొందరు అధికారులను మళ్ళీ విచారణకు పిలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.;
కాళేశ్వరం ప్రాజెక్ట్లో భారీగా అవకతవకలు జరిగాయన్న అంశంపై సుధీర్ఘ విచారణ జరిగింది. జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో ఈ అంశాలను విచారించడం కోసం 13 మార్చి 2024న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక కమిషన్ను ఏర్పాటు చేసింది. ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించిన కమిషన్.. ప్రాజెక్ట్తో సంబంధం ఉన్న అధికారులు, నేతలను కమిషన్ విచారించింది. ఇప్పటి వరకు దాదాపు 114 మందిని విచారించింది. మే 31తో కమిషన్ విచారణ గడువు ముగియడానికి రావడంతో కమిషన్ విచారణ పూర్తి అయిందని అంతా అనుకున్నారు. ఆ సమయంలోనే ప్రభుత్వం అనూహ్యంగా కమిషన్ విచారణ గడువును మరో రెండు నెలలు పొడిగింది. గడువు పెరిగిన గంటల వ్యవధిలోనే కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్కు కమిషన్ నోటీసులు జారీ చేసింది. విచారణకు రావాలని కోరింది. ఇప్పటికే వీరిలో ఈటల రాజేందర్ జూన్ 6న, హరీష్ రావు జూన్ 9న కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. తాజాగా బుధవారం ఆఖరిగా కేసీఆర్ కూడా విచారణకు హాజరయ్యారు. ఆయన విచారణ కూడా పూర్తయింది. దీంతో కాళేశ్వరం అంశంలో కమిషన్ విచారణ దాదాపు పూర్తయిందనే అనుకోవాలి.
శుభం కార్డు తాత్కాలికమేనా..?
అయితే ఇంతటితో కమిషన్ విచారణ పూర్తయిందని చెప్పడానికి లేదని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పుడు ఈటల, హరీష్ రావు ఇచ్చిన సమాధానాల్లో అధికారులదే తుది నిర్ణయం అని చెప్పారు. కేసీఆర్ ఏం చెప్పారో తెలియదు. కాబట్టి కొందరు అధికారులను మళ్ళీ విచారణకు పిలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈటల, హరీష్ రావు, కేసీఆర్ల సమాధానాల ఆధారంగా కొందరు అధికారులను పునఃవిచారణ జరిపే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయనేది విశ్లేషకులు చెప్తున్న మాట. దానికి తోడు ఈరోజు విచారణకు వెళ్లే సమయంలో కేసీఆర్ తనతో పాటు రెండు ఫైళ్లు తీసుకెళ్లారు., వాటిని కమిషన్కు అప్పగించారు. కమిషన్ అడిగిన పలు ప్రశ్నలకు తాను అందించిన ఫైళ్లలో రాతపూర్వక సమాధానాలు ఉన్నాయని చెప్పారు. దీంతో ఇప్పుడు కమిషన్.. కేసీఆర్ ఇచ్చిన ఫైళ్లను స్టడీ చేస్తుంది. తర్వాత తమకు వచ్చే అనుమానాల ఆధారంగా మరోసారి పలువురు అధికారులు, నేతలను విచారణకు రావాలని కోరే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో కాళేశ్వరం కమిషన్ విచారణకు ఈరోజు తాత్కాలిక శుభం కార్డు మాత్రమే పడిందని అంటున్నారు.
కమిషన్ ఎప్పుడొచ్చింది
కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకంగా చెప్పే మే డిగడ్డ బ్యారేజీ లోని మూడు పిల్లర్లు 2023 అక్టోబర్ 21న కుంగిపోయాయి. బ్యారేజీలోని ఏడో బ్లాక్ 1.5మీటర్ల మేర భూమి లోపలికి కూరుకుపోయింది. దీనిపై అటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ ఏ), ఇటు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ల ఉన్నతాధికారులు విచారణ పూర్తి చేసి నివేదికలు సమర్పించారు. న్యాయపరంగా విచారణ జరిపేందుకు సుప్రీం కోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్ చైర్మన్గా 2024 మార్చి 13న కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ను కాంగ్రెస్ ప్రభుత్వం నియమించింది.
2024 జూన్ 30లోపు విచారణ పూర్తి చేయాలి. అప్పటికి ఇంకా రాజకీయ నాయకుల ఎంక్వైరీ కూడా మొదలుకాలేదు. ప్రాథమిక దశలోనే ఉండడంతో గడువును ఆగస్టు 30 వరకు పొడిగిస్తూ జూన్ 29న తొలిసారి గడువును పొడి గించింది. మళ్లీ విచారణ నత్తనడకే సాగింది. దీంతో రెండోసారి అక్టోబర్ 31 వరకు గడువును పొడిగిస్తూ ఆగస్టు 28న ప్రభు త్వం ఉత్తర్వులు ఇచ్చింది. అసలు విచారణకు ఓపెన్ కోర్టులు నిర్వహించాల్సి ఉండడంతో డిసెంబర్ 31 వరకు గడువును మూడోసారి పొడిగిస్తూ నవంబర్ 12న ఉత్తర్వులు ఇచ్చింది. ఆ తర్వాత నాలుగోసారి 2025 ఫిబ్రవరి 28 వరకు గడువును పొడిగిస్తూ 2024 డిసెంబర్ 21న, ఐదోసారి 2025 ఏప్రిల్ 30 వరకు పొడిగి స్తూ 2025 ఫిబ్రవరి 20న, ఆరోసారి గడువును 2025 మే 31 వరకు పొడిగిస్తూ 2025 ఏప్రిల్ 29న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ఏడోసారి గడువును పొడిగిస్తూ జులై 31 వరకు కమిషన్ రిపోర్టుకు గడువు ఇచ్చింది.