బీఆర్ఎస్ అగ్రనేతల్లో విచారణల టెన్షన్ పెరిగిపోతోందా ?

ప్రభుత్వంపై ఎదురుదాడులు చేయటంతోనే కారుపార్టీలోని నేతల్లో పెరిగిపోతున్న టెన్షన్ కు ఉదాహరణగా చెప్పుకోవచ్చు;

Update: 2025-06-14 07:07 GMT
KCR, KTR and Harish Rao

బీఆర్ఎస్ పార్టీలో విచారణల టెన్షన్ పెరిగిపోతోంది. కారణం ఏమిటంటే 16వ తేదీన విచారణకు హాజరవ్వాలని ఏసీబీ కేటీఆర్ కు నోటీసులు జారీచేసింది. బీఆర్ఎస్ నేతల్లో టెన్షన్ పెరిగిపోతోందనటానికి చాలా ఉదాహరణలున్నాయి. అవేమిటంటే ఎనుమల రేవంత్ రెడ్డి(Revanth Reddy)ని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. తమపై ఉన్న ఆరోపణలు ఏవిధంగా తప్పనే విషయాన్ని రుజువుచేసుకోకుండా ప్రభుత్వంపై ఎదురుదాడులు చేయటంతోనే కారుపార్టీలోని నేతల్లో పెరిగిపోతున్న టెన్షన్ కు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. తాను ఏతప్పు చేయలేదని లైడిటెక్టర్ టెస్టుకు రెడీగా ఉన్నానని, ‘ఓటుకునోటు’లో ఏ తప్పూ చేయలేదని లైడిటెక్టర్ టెస్టుకు రేవంత్ సిద్ధమా అని కేటీఆర్ ఛాలెంజ్ చేయటమే విచిత్రం.

రేవంత్ తగులుకున్న ఓటుకునోటు కేసు ఇపుడు కోర్టు విచారణలో ఉంది. కోర్టు విచారణలో ఉన్న కేసుపై రేవంత్ లైడిటెక్టర్ టెస్టుకు ఎలాగ ఒప్పుకుంటాడని కేటీఆర్(KTR) అనుకున్నాడు ? ఒప్పుకోడని కేటీఆర్ కు బాగా తెలుసు. తెలిసే కావాలనే కేటీఆర్ లైడిటెక్టర్ టెస్ట్ ఛాలెంజ్ చేసినట్లు అర్ధమైపోతోంది. అర్ధంపర్ధంలేని సవాళ్ళు చేయటంతోనే కేటీఆర్ లోని అక్కసంతా బయటపడుతోంది. ఫార్ములారేసు నిర్వహణలో జరిగిన అవినీతి ఏమిటన్నది ఏసీబీ(Telangana ACB) బయటపెడుతుంది. అయితే అధికారదుర్వినియోగం జరిగిందన్నది మాత్రం స్పష్టంగా తెలిసిపోతోంది. దాన్నికూడా కేటీఆర్ అంగీకరించటంలేదు.

ఇపుడు విషయం ఏమిటంటే మొన్న 11వ తేదీనే కాళేశ్వరం అవినీతి, అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణకు కేసీఆర్(KCR) హాజరైన విషయం తెలిసిందే. కాళేశ్వరంలో ఎలాంటి అవినీతి జరగలేదని తండ్రి, కొడుకులు ఎంతైనా వాదించవచ్చు. అయితే జరిగిన అవినీతి, అవకతవకలు అందరికీ కళ్ళకు కట్టినట్లు కనబడుతోంది. ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి అవినీతి జరగకపోతే నిర్మాణాలు అంత నాసిరకంగా ఎందుకుంటాయి. వేలకోట్లరూపాయల ప్రజాధనంతో నిర్మించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు మూడేళ్ళకే ఎందుకు వినియోగానికి పనికిరాకుండా పోతాయి ? కాబట్టి తండ్రి, కొడుకులు ఎంత అడ్డంగా వాదించినా విచారణ పూర్తిచేసిన కమిషన్ ఛైర్మన్ ఘోష్ రిపోర్టులో ఏముంటుందో చూడాలి.

ఇక ఫార్ములా ఈకార్ రేసు అవినీతిపై కేటీఆర్ ను ఇప్పటికే ఏసీబీ, ఈడీలు రెండుసార్లు విచారించాయి. ఈనెల 16వ తేదీన మరోసారి కేటీఆర్ విచారణకు రమ్మని ఏసీబీ నోటీసిచ్చింది. కార్ రేసులో కూడా ఎలాంటి అవినీతి, అవకతవకలు జరగలేదని కేటీఆర్ చాలారోజులుగా వాదిస్తున్నారు. అవినీతి సంగతిని పక్కనపెట్టేస్తే అధికార దుర్వినియోగం జరిగిందన్న విషయం కళ్ళకు కట్టినట్లు కనబడుతోంది. క్యాబినెట్ అనుమతి లేకుండా, ఆర్బీఐ అనుమతి లేకుండానే కేటీఆర్ ఆధ్వర్యంలోని మున్సిపల్ శాఖ నుండి రు. 47 కోట్లు బ్రిటీష్ కంపెనీకి చెల్లింపులు జరపటమే అధికార దుర్వినియోగానికి ఉదాహరణ. అదికూడా 2023 అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నపుడు కేంద్ర ఎన్నికల కమీషన్ అనుమతి లేకుండానే. ఇక తనఅనుమతి లేకుండా బ్రిటీష్ కంపెనీకి పౌండ్లలో రు. 47 కోట్లు చెల్లించినందుకు రిజర్వ్ బ్యాంకు విధించిన రు. 8 కోట్ల జరిమానాను తెలంగాణ ప్రభుత్వం చెల్లించింది. జరిమానా చెల్లించిందంటేనే ప్రభుత్వం తప్పుచేసిందని అంగీకరించినట్లే అని అర్ధమవుతోంది. చెల్లింపులకు క్యాబినెట్ అనుమతి కూడా లేదు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇన్నిరకాల అధికార దుర్వినియోగం కళ్ళకు కనబడుతున్నా కేటీఆర్ మాత్రం తాను ఏ తప్పుచేయలేదని అడ్డంగా వాదిస్తున్నారు. అంటే తండ్రి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అవకతవకల బాధ్యత అంతా ఇరిగేషన్, ఇంజనీరింగ్ ఉన్నతాధికారులదే అని తోసేసినట్లు ఫార్ములా కార్ రేసులో జరిగిన అధికార దుర్వినియోగానికి బాధ్యతంతా ఉన్నతాధికారులదే అని తోసేయటానికి సిద్ధంగా ఉన్నట్లు అర్ధమవుతోంది. కాబోయే ముఖ్యమంత్రిగా ప్రొజెక్టు చేసుకుని, మూడోసారి అధికారంలోకి వచ్చేయబోతున్నట్లు ఉన్నతాధికారులను మాయచేసి, భ్రమల్లో ముంచి నోటిమాట ద్వారా కోట్ల రూపాయలను బ్రిటన్ కంపెనీకి బదిలీచేయించుకోవటం కేటీఆర్ కు తప్పనిపించకపోవటమే ఆశ్చర్యంగా ఉంది. ఫార్ములా నిర్వహణలో ఎలాంటి తప్పు జరగకపోతే రిజర్వ్ బ్యాంకు తెలంగాణ ప్రభుత్వానికి ఎందుకు జరిమానా విధించింది ? తెలంగాణ ప్రభుత్వం జరిమానాను ఎందుకు చెల్లించింది ?

ఇలాంటి అనేక విషయాలపై ఏసీబీ ఉన్నతాధికారులు కేటీఆర్ ను గట్టిగా ప్రశ్నించబోతున్నారని సమాచారం. అందుకనే ఒకవైపు తండ్రి, ఇంకోవైపు కొడుకు ఇద్దరు విచారణల్లో తగులుకోవటం ఖాయమనే ప్రచారం పెరిగిపోతోంది. అందుకనే పార్టీ నేతల్లో విచారణల టెన్షన్ పెరిగిపోతోంది. ఇప్పటికే కల్వకుంట్ల కవిత(Kavitha) లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుని ఈడీ, సీబీఐ కేసుల దర్యాప్తును, కోర్టులో విచారణను ఎదుర్కొంటున్నారు. ఆరుమాసాలు తీహార్ జైలులో ఉండి బెయిల్ పైన బయటతిరుగుతున్నారు. కాళేశ్వరం అవినీతి కేసు విచారణలోనే ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు(Harish Rao) కూడా తగులుకునే అవకాశాలున్నాయి. అందుకనే కాళేశ్వరం, ఫార్ములా కేసుల్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ ముగ్గురూ తగులుకుంటే పార్టీ భవిష్యత్తు ఏమవుతుందో అనే టెన్షన్ నెతల్లో పెరిగిపోతోంది.

Tags:    

Similar News