హిడ్మా తాజా ఫొటో ఇదేనా ?

అందరికీ తెలిసిన మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేతల్లో ఒకడైన హిడ్మా ఫొటో 25 ఏళ్ళ క్రితంది.;

Update: 2025-06-07 08:18 GMT
Latest photo of Maoists top leader Hidma

పై ఫొటోలోని వ్యక్తి చాలామందికి తెలిసుండకపోవచ్చు. ఇంతకీ ఆవ్యక్తి ఎవరంటే భద్రతాదళాలు జల్లెడవేసి వెతుకుతున్న మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు అగ్రనేతల్లో ఒకడైన మాడ్వి హిడ్మా. ఛత్తీస్ ఘడ్ సుక్మా జిల్లాలోని పూవర్తి గ్రామానికి చెందిన హిడ్మా పదవ తరగతి చదువుకున్నాడు. ఇపుడు విషయం ఏమిటంటే హిడ్మా(Maoist leader Hidma) ఫొటో ఒకటి ఉత్తరాధి మీడియాలో బాగా వైరలవుతోంది. ఫొటో బయటపెట్టడంలో విశేషం ఏముంది అనుకుంటున్నారా ? అందరికీ తెలిసిన మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేతల్లో ఒకడైన హిడ్మా ఫొటో 25 ఏళ్ళ క్రితంది. అంటే నిన్నటివరకు మీడియా, పోలీసులు, భద్రతాదళల దగ్గరున్న ఫొటో పాతికేళ్ళు కిందటి హిడ్మాదే. ఈపాతికేళ్ళల్లో హిడ్మాలో ఏమైనా మార్పులొచ్చాయా ? ఇపుడు హిడ్మా ఎలాగుంటాడు అన్న విషయం ఎవరికీ తెలీదు.

కాలం గడిచేకొద్దీ రకరకాల పరిస్ధితుల ప్రభావం వల్ల మనుషుల ఆకారాల్లో మార్పులు రావటం చాలా సహజం. అయితే మోస్ట్ వాంటెడ్ కాబట్టి హిడ్మాను ఎలాగైనా పట్టుకోవాలన్న పట్టుదలతో భద్రతాదళాలు, పోలీసులు పాతికేళ్ళ కిందటి ఫొటోనే ఆచూకీకోసం జనాల్లోకి పంపించి హిడ్మా కోసం వెతుకుతున్నారు. ఇపుడు హిడ్మా ఎలాగుంటాడన్న విషయంలో ఎవరికీ సరైన సమాచారం లేదు. ఇలాంటి నేపధ్యంలో ఉత్తరాధిమీడియాలో కనబడుతున్న హిడ్మా తాజా ఫొటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఫొటోలో కుడివైపున్న హిడ్మా పాతికేళ్ళనాటి హిడ్మా. ఎడమవైపున్న ఫొటో హిడ్మా తాజాదని ఉత్తరాధి మీడియా చెబుతోంది. మరా ఫొటో మీడియాకు ఎలా దొరికింది ? భద్రతాదళాలే ఎక్కడైనా తాజా ఫొటో సంపాదించి మీడియాకు రిలీజ్ చేశాయా అన్నది తెలీదు.

ఈమధ్య భద్రతాదళాలు, ఛత్తీస్ ఘడ్ పోలీసుల ముందు చాలామంది మావోయిస్టులు లొండిపోయారు. డజన్ల సంఖ్యలో మావోయిస్టులు ఎన్ కౌంటర్లో చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఆపరేషన్ కగార్(Operation Kagar) పేరుతో మావోయిస్టుల(Maoists) ఏరివేతకు భద్రతాదళాలు దండకారణ్యం అడవులను అణువణువున జల్లెడపడుతున్నాయి. వెతుకులాటలోనో లేకపోతే లొంగిపోయిన మావోయిస్టుల ద్వారానో భద్రతాదళాలు లేదా ఛత్తీస్ ఘడ్ పోలీసులు హిడ్మా తాజా ఫొటోను దొరికిచ్చుకుని ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏదేమైనా హిడ్మా లేటెస్టు ఫోటోను సంపాదించటానికే పోలీసులు, భద్రతాదళాలకు 25 ఏళ్ళుపట్టింది. తాజాగా సర్క్యులేషన్లోకి వచ్చిన ఫొటో ఏఐ జనరేటెడ్ ఫొటో అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

మావోయిస్టు అగ్రనేతలు ఎవరూ ఉనికి బయటపడేట్లుగా జనజీవనస్రవంతిలో ఉండరన్న విషయం తెలిసిందే. దశాబ్దాలుగా అడవుల్లోనో లేకపోతే ఎక్కడో ఒకచోట ఉనికిని దాచుకుని కాలం గడుపుతుంటారు. మావోయిస్టుల్లో టాప్ ర్యాకింగ్ లీడర్లు ఎలాగుంటారో మావోయిస్టుల్లోనే చాలామందికి తెలీదంటే ఆశ్చర్యపోవక్కర్లేదు. టాప్ లీడర్లు తమ గుర్తింపును అంత రహస్యంగా దాచుకుంటారు. ఈమధ్యనే చనిపోయిన మావోయిస్టు కేంద్రకమిటి ప్రధానకార్యదర్శి నంబాల కేశవరరావును స్వగ్రామంలోని జనాలు, చివరకు కుటుంబసభ్యులు కూడా 40 ఏళ్ళుగా చూడలేదంటే ఆశ్చర్యపోవక్కర్లేదు. మావోయిస్టుల అగ్రనేతల్లో చాలామంది తమ గుర్తింపు బాహ్యప్రపంచానికి తెలియటానికి అంగీకరించరు.

తప్పించుకుంటున్న హిడ్మా

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆపరేషన్ కగార్ లో మావోయిస్టుల ఏరివేత చివరిదశకు చేరుకుంటున్న నేపధ్యంలో హిడ్మా తాజా ఫొటో బయటపడటం ఆశ్చర్యంగా ఉంది. హిడ్మా ఇపుడు ఎలాగుంటాడన్న ఫొటో బయటకు వచ్చింది కాబట్టి పోలీసులు, భద్రతాదళాలు ఎదుటపడిన మావోయిస్టుల్లో హిడ్మాను గుర్తుపట్టడం చాలా తేలికవుతుంది. ఆపరేషన్ కగార్ లో భాగంగా వేలాదిమంది సాయుధులతో భద్రతాదళాలు కర్రెగుట్టల అడవుల్లో గాలింపు మొదలుపెట్టిన విషయం తెలిసిందే. హిడ్మాతో పాటు మరికొందరు టాప్ లీడర్లు క్యాంపు వేశారన్న పక్కా సమాచారంతోనే భద్రతాదళాలు 250 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న కర్రెగుట్టల అడవుల గాలింపు మొదలుపెట్టారు. అయితే భద్రతాదళాలు కూంబింగ్ మొదలుపెట్టిన విషయం గ్రహించి మావోయిస్టు అగ్రనేతలు అక్కడినుండి తప్పించుకున్నారు.

హిడ్మా గ్రామం పూర్వాతిలో సోలార్ విద్యుత్, డిష్ యాంటెన్న తో అప్ డేట్ అయ్యింది

కర్రెగుట్టల్లో తలదాచుకున్న మావోయిస్టు అగ్రనేతలు సమీపదూరంలోనే ఉన్న దుర్గంగుట్టల అడవుల్లోకి పారిపోయారు. అందుకని దుర్గంగుట్టలను కూడా భద్రతాదళాలు చుట్టుముట్టాయి. ఈ అడవుల్లోనే మావోయిస్టులు షెల్టర్ తీసుకున్న చాలా బంకర్లను భద్రతాదళాలు గుర్తించాయి. తీవ్రస్ధాయిలో గాలింపుచర్యలు చేస్తున్న భద్రతాదళాలకు ఆటంకాలు ఏర్పడ్డాయి. నిరంతరం కురిసిన వర్షాలు ఒక కారణమైతే ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) కోసమని భద్రతాదళాల్లో చాలామందిని కేంద్రప్రభుత్వం సరిహద్దులకు పంపింది. అందుకనే ఆపరేషన్ కగార్ కు విరామం దొరికింది. ఈవిరామాన్ని అవకాశంగా తీసుకున్న మావోయిస్టు అగ్రనేతల్లో చాలామంది దండకారణ్యంలోకి మకాం మార్చేశారని సమాచారం. వర్షాలు తగ్గి, ఆపరేషన్ సిందూర్ వేడి చల్లారిన వెంటనే మళ్ళీ ఆపరేషన్ కగార్ మొదలైంది.

విరామసమయంలో ఏమి జరిగిందన్న విషయాన్ని గ్రహించిన భద్రతాదళాలు తమ గాలింపును దండకారణ్యంలో మొదలుపెట్టాయి. దండకారణ్యంలో భాగమైన అబూజ్ మడ్ అడవులు, నేషనల్ పార్క్ అడవుల్లో ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఈక్రమంలో జరిగిన ఎన్ కౌంటర్లలోనే నంబాల కేశవరావు, మరో అగ్రనేత సుధాకర్, శుక్రవారం తెలంగాణ రాష్ట్ర కమిటి సభ్యుడు మైలారపు భాస్కర్ అలియాస్ అడెల్లు భాస్కర్ మరణించారు.

టార్గెట్ హిడ్మా

ఇపుడు భద్రతాదళాల టార్గెట్ మొత్తం హిడ్మా మీదే ఉంది. ఈమధ్యనే కోరాపుట్ అడవుల్లో హిడ్మాను భద్రతాదళాలు అరెస్టు చేశారన్న వార్త సంచలనమైంది. అయితే తర్వాత చూస్తే దొరికిన హిడ్మాకు అగ్రనేత హిడ్మాకు సంబంధంలేదని తేలింది. హిడ్మా తలపైన రివార్డ్ సుమారు రు. 5 కోట్ల దాకా ఉందంటేనే ఎంతటి మోస్ట్ వాంటెడ్ నేతో అర్ధమవుతోంది. హిడ్మాపైన(Telangana) తెలంగాణ-ఛత్తీస్ ఘడ్-మహారాష్ట్ర-మధ్యప్రదేశ్-జార్ఖండ్ రాష్ట్రాల్లో అనేక కేసులున్నాయి. ఈ మోస్ట్ వాంటెడ్ నేత పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(పీఎల్జీఏ)కి అగ్రనేత. పీఎల్జీఏ ఆధ్వర్యంలోనే హిడ్మా పోలీసులు, కేంద్ర బలగాలపైన చాలాసార్లు దాడులు చేసి వందలమంది మృతికి కారకుడయ్యాడు. ఇపుడు హిడ్మా నేషనల్ పార్క్ అడవుల్లోనే ఉన్నట్లు కచ్చితమైన సమాచారం అందటంతోనే భద్రతాదళాలు గాలింపును ముమ్మరంచేశాయి. ఇలాంటి పరిస్ధితుల్లో హిడ్మా తాజా ఫొటో దొరకటం భద్రతాదళాలకు చాలా అడ్వాంటేజ్ అన్నవిషయంలో ఎలాంటి అనుమానం లేదు. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News