కాళేశ్వరం కమిషన్ ఏం అడిగింది.. హరీష్ రావ్ ఏం చెప్పారు..?
ఆధారాలతో సమాధానాలను కమిషన్కు అందించడం జరిగింది. కమిషన్ విచారణకు హాజరై రాజకీయాలు మాట్లాడటం సరికాదు.;
కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్ట్లో అవకతవకలు జరిగాయా లేదా? అన్న అంశాలపై పీసీ ఘోష్ నేతృత్వంలోని కాళేశ్వరం కమిషన్ విచారణ ఇంకా కొనసాగుతోంది. ఇందులో భాగంగానే సోమవారం అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి, ప్రస్తుతం సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావును కమిషన్ విచారించింది. 40 నిమిషాల పాటు జరిగిన ఈ విచారణలో మాజీ మంత్రిని జస్టిస్ పీసీ ఘోష్ పలు కీలక ప్రశ్నలు అడిగారు. అసలు మంత్రివర్గ కమిటీని ఎందుకు ఏర్పాటు చేశారు? కాళేశ్వరం కార్పొరేషన్ ఎందుకు? బ్యారేజీల్లో నీళ్లు నింపారా లేదా? ప్రాజెక్ట రీడిజైన్ ఎందుకు? ఇలా అనేక అంశాలపై ప్రశ్నించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల గురించి కూడా కమిషన్ ప్రశ్నించింది. అన్ని ఆనకట్టల నిర్మాణానికి మంత్రి వర్గం ఆమోదం తెలిపిందని, కేబినెట్ నుంచి ఆమోద ముద్ర పడిన తర్వాతనే పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు హరీష్ రావు. ఇంజినీర్ల సూచన మేరకే అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మార్పు జరిగిందన్నారు. స్థలాల మార్పు గతంలోనూ కొన్ని ప్రాజెక్టుల విషయంలో జరిగిందని గుర్తు చేశారు.
‘‘ఈరోజు కాళేశ్వరం కమిషన్ విచారణలో భాగంగా పిలవడం జరిగింది. కమిషన్ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడం జరిగింది. ఆధారాలతో సమాధానాలను కమిషన్కు అందించడం జరిగింది. కమిషన్ విచారణకు హాజరై రాజకీయాలు మాట్లాడటం సరికాదు. రాజకీయాలు ఏమైనా ఉంటే రేపు మాట్లాడుకుందాం. లోపట ఒకటి చెప్పి బయట ఒకటి చెప్పడం తప్పు అవుతుంది’’ అని అన్నారు.
కమిషన్ ప్రశ్నలు-హరీష్ రావు సమాధానాలు
1. మొట్టమొదలు తమ్మిడి హట్టి నుండి మేడిగడ్డకు బ్యారేజ్ ను ఎందుకు మార్చారు అనేదానిపై చాలాసేపు డిస్కషన్ జరిగింది.
‘‘దానికి నేను కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం తమ్మిడి హట్టి దగ్గరే ప్రాజెక్టు కట్టడానికి అన్ని రకాల ప్రయత్నం చేసాము. ఇరిగేషన్ మంత్రిగా రివ్యూ చేసినప్పుడు ప్రాణాహిత ప్రాజెక్టు 7 ప్యాకేజీలు 27 భాగాలుగా టెండర్లను పిలిచింది గత కాంగ్రెస్ ప్రభుత్వం. తల పనులు స్టార్ట్ చేయకుండా తోక పనులను కాంగ్రెస్ ప్రభుత్వం తవ్వింది. మహారాష్ట్ర కాంగ్రెస్ ఇరిగేషన్ మంత్రి హసన్ ముష్రఫ్ గారిని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన నెలకే వెళ్లి కలవడం జరిగింది. తమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతి ఇవ్వండని అప్పటి మహారాష్ట్ర కాంగ్రెస్ మంత్రి హసన్ ముష్రఫ్ గారిని కోరడం జరిగింది. ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి హాసన్ ముష్రఫ్ గారు.. చాలా రోజులుగా ముంపు గ్రామాల ప్రజలు మా ప్రభుత్వంపై నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మేము ప్రాజెక్టు 152 మీటర్ల ఎత్తులో నిర్మాణానికి ఒప్పుకోమని తేల్చి చెప్పారు’’ అని పేర్కొన్నారు.
‘‘ఇదే విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చౌహాన్ గారు అప్పటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఈ ప్రాజెక్టు 152 మీటర్ల ఎత్తులో నిర్మించడానికి ఒప్పుకోమని తేల్చి చెప్పారని చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని కూడా కమిషన్ దృష్టికి తీసుకు వెళ్ళాము. మహారాష్ట్ర, తెలంగాణ మధ్య తమ్మిడి హట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి ఐదారు మీటింగ్లు జరిగాయి. మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం పోయి బీజేపీ ప్రభుత్వం వచ్చినాక నీటిపారుదల మంత్రిని కలిసి మళ్లీ తమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించాలని, తెలంగాణకు నీటి అవసరం ఉందని కోరడం జరిగింది. స్వయంగా కేసీఆర్.. మహారాష్ట్ర వచ్చి అప్పటి గవర్నర్ విద్యాసాగర్ గారి సమక్షంలో బిజెపి ముఖ్యమంత్రి ఫడ్నవీస్ని కలిశారు’’ అని తెలిపారు.
‘‘అనేక విధాలుగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారిని కెసిఆర్ గారు విజ్ఞప్తి చేశారు. ఏడేండ్లు మాకంటే ముందు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బిజెపి పార్టీ తరఫున ఈ ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకిస్తూ అనేక పోరాటాలు చేసింది తానేనని ఇప్పుడు ఆ ప్రాజెక్టుకు పర్మిషన్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వలేమని పడ్నవీస్ గారు తేల్చి చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్, మహారాష్ట్రలో కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ఏడు సంవత్సరాలు అధికారంలో ఉంటే ఒక్క అనుమతి కూడా సాధించలేదు. ఒక్క అంతర్రాష్ట్ర ఒప్పందం చేసుకోలేదు. ఒక గుంట భూమిని కూడా సేకరించలేదు. తమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. తెలంగాణ ప్రాంతం నుంచి మంత్రులుగా ఉన్న కోమటిరెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి గారు పట్టించుకోలేదు. సెంట్రల్ వాటర్ కమిషన్ తమ్మిడి హట్టి వద్ద నీటి లభ్యత లేదు అని ప్రాజెక్టు నిర్మాణానికి ప్రత్యామ్నాయం చూసుకోవాలని లేఖ రాసింది’’ అని గుర్తు చేశారు.
‘‘అదేవిధంగా CWC తమ్మిడిహట్టి ప్రాజెక్టులో ప్రతిపాదించిన రిజర్వాయర్ల సామర్థ్యం కూడా సరిపోదని సామర్థ్యానికి సరిపోయే రిజర్వాయర్లను పెంచుకోవాలని ఉత్తరం రాసింది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ ని బ్యారేజ్ నిర్మాణ స్థల ఎంపిక చేయాలని కేసీఆర్ గారు కోరడం జరిగింది. కేంద్ర సంస్థ వాప్కోస్ లాడార్ సర్వే చేసి, ఎగ్జామిన్ చేసి మేడిగడ్డ వద్ద నీటి లభ్యత ఉంది అక్కడ ప్రాజెక్టు నిర్మాణం చేసుకోవచ్చని తెలిపింది. వాప్కోస్, సెంట్రల్ వాటర్ కమిషన్, ఇంజనీర్ల సూచన మేరకు మేడిగడ్డ వద్ద ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడేండ్లుగా పొరుగు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించలేదు. అదేవిధంగా మహారాష్ట్రలో ముంపుకు గురవుతున్న చోట చాప్రాల్ వైల్డ్ లైఫ్ ఉంది. వైల్డ్ లైఫ్ అనుమతులు లభించాలంటే కనీసం 10 సంవత్సరాలు సుప్రీంకోర్టులో కొట్లాడాల్సి వస్తుంది. నీళ్లు లేనిచోట కాంగ్రెస్ ప్రాజెక్ట్ ప్రతిపాదిస్తే నీళ్లు ఉన్నచోట ప్రాజెక్టును బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించడం జరిగింది. అన్ని రకాల ఆధారాలు మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాసిన ఉత్తరాలు, జీవోలు అన్నీ కమిషన్కు సమర్పించడం జరిగింది’’ అని చెప్పారు.
2. కాళేశ్వరం కార్పొరేషన్ కి అనుమతి ఉందా అని అడిగారు.
కాళేశ్వరం కమిషన్కు స్పష్టంగా అనుమతి ఉన్న విషయాన్ని అన్ని ఆధారాలతో సమర్పించడం జరిగింది.
3. అన్నారం, సుందిళ్ల బ్యారేజీ లోకేషన్ మార్పుల గురించి అడిగారు.
అది పూర్తిగా టెక్నికల్ నిర్ణయం. ఇంజనీర్ల డీటెయిల్ సర్వే ఆధారంగా బ్యారేజ్ లొకేషన్ మారింది. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకునే నిర్ణయమని చెప్పాను. దేశంలో ఇలా అనేక ప్రాజెక్టుల నిర్మాణ విషయంలో జరుగుతుంది వాటికి సంబంధించిన ఆధారాలు కూడా కమిషన్ కి సమర్పించడం జరిగింది.
4. ఈ ప్రాజెక్టులో రిజర్వాయర్లకు కెపాసిటీ ఎంత అని అడిగారు.
141 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించామని చెప్పడం జరిగింది. కాళేశ్వరంపై పిచ్చికూతలు కూస్తూ కూలేశ్వరం అని మాట్లాడుతున్నారు. కాళేశ్వరంలో 100 భాగాలు ఉన్నాయి. అన్ని ఇంటెక్ట్ ఉన్నాయి.
కాలేశ్వరం ప్రాజెక్టులో...
3 బ్యారేజీలు
15 రిజర్వాయర్లు
19 సబ్ స్టేషన్లు
21 పంప్ హౌజులు
203 కిలోమీటర్ల సొరంగాలు
1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్
98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్
141 టిఎంసీల స్టోరేజ్ కెపాసిటీ
530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్
240 టిఎంసీల నీటి వినియోగం...
పూర్తిగా ఇవన్నీ ఇంటాక్ట్ ఉన్నాయి..
‘‘ముఖ్యమంత్రి గంధమల్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టుకు నీళ్లు మల్లన్న సాగర్ నుంచి పోతాయి. మల్లన్న సాగర్ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగం. హైదరాబాద్ మూసీ సుందరీకరణకు మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తరలిస్తామంటున్నారు. ఆ మల్లన్న సాగర్ కాళేశ్వరంలో అంతర్భాగం. అదేవిధంగా హైదరాబాద్ కు తాగునీటిని మల్లన్న సాగర్ నుంచి ఇస్తామంటున్నారు అది కాళేశ్వరంలో భాగం కాదా. మల్లన్న సాగర్ పై ఆధారపడ్డ గంధమల్లకు టెండర్లు పిలిచి శంకుస్థాపన చేస్తారు. మరో పక్క కాళేశ్వరం కూలింది అని దుష్ప్రచారం చేస్తారు. కాళేశ్వరం ఎప్పటికైనా తెలంగాణకు జీవధార. ఈ విషయం తెలంగాణ ప్రజలకు అర్థమైంది. కాళేశ్వరం కమిషన్ ముందు ఏదీ నోటి మాటగా చెప్పలేదు. అన్నీ సాక్ష్యాధారాలతో సహా సమర్పించడం జరిగింది. క్యాబినెట్ నిర్ణయాలు, వాప్కోస్ రిపోర్టులు, సీడబ్ల్యూసీ లేఖలు అన్నీ సమర్పించడం జరిగింది’’ అని తెలిపారు.
5) కాళేశ్వరం కార్పొరేషన్ ఎందుకు ఏర్పాటు చేశారు? అని అడిగారు.
ప్రాజెక్ట్ నిర్మాణానికి కావాల్సిన లోన్స్ కోసం అని చెప్పాను.
6) తీసుకున్న లోన్స్ను తిరిగి ఎలా కట్టాలనుకున్నారు?
నిల్వ చేసిన నీళ్లను అమ్మి లోన్స్ కట్టాలని ఆలోచించామని చెప్పా.
7) కార్పొరేషన్ ద్వారా రెవెన్యూ వచ్చిందా?
కరోనా కారణంగా రెండు సంవత్సరాలు ఆలస్యమైంది. అప్పటికే మెదక్లో కోకకోలా సంస్థ లాంటివి నీటి కోసం అప్రోచ్ అయ్యాయి.
8) బ్యారేజీలలో నీళ్లను స్టోరేజ్ చేశారా?
టెక్నికల్ అంశాలు మా దృష్టిలో ఉండవు.
9) కాళేశ్వరం ద్వారా ఎన్ని నీళ్లలో స్టోరేజీ చేశారు ?
రిజర్వాయర్ల ద్వారా 141 టీఎంసీల నీళ్లను స్టోరేజ్ చేశాం.
10) బ్యారేజీలలో ఫుల్ లెవెల్ ట్యాంక్ వరకు నీళ్లను స్టోర్ చేశారా ?
టెక్నికల్ అంశాలు అధికారులు మాత్రమే చూసుకుంటారు.
11) బ్యారేజీలలో నీళ్లను నింపమని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందా?
బ్యారేజీలలో నీళ్లను నింపమని ఎవరు ఆదేశించలేదు.