బిసి రిజర్వేషన్ల కోసం కవిత ‘రైల్ రోకో’
బిసిల ‘సామాజిక న్యాయం’ కోసం కదం తొక్కుతున్న కవిత;
తెలంగాణ లో వెనకబడినకులాలకు 42శాతం రిజర్వేషన్లు అమలుచేయాలని కోరుతూ కేసిఆర్ కూతురు, బిఆర్ ఎస్ రెబెల్ కల్వకుంట్ల కవిత రైల్ రోకో కు పిలుపునిచ్చారు. కేంద్రంపై ఒత్తిడి తెస్తేనే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కల నెరవేరుతుందని చెబుతూ బీసీలకు 42శాతం రిజర్వేషన్ల బిల్లుకు కేంద్రం ఆమోదించే వత్తిడి తీసుకువచ్చేందుకు జూలై 17న రైల్ రోకో నిర్వహిస్తున్నట్లు ఆమె ప్రకటించారు.
బిఆర్ ఎస్ అజెండాలో బిసిలకు పెద్ద స్థానం ఉండేది కాదు. అరోజుల్లో కవిత కూడా అంతంత మాత్రమే బిసిల సంక్షేమం గురించి మాట్లాడే వారు. బిఆర్ ఎస్ నాయకత్వంమీద తిరుగుబాటు ఎగరేశాక ఆమెకు బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు అవసరమని గుర్తించారు. దీనికోసం ఆమె పోరాటం చేసేందుకు సిద్దమవుతున్నారు. "ఢిల్లీ పాలకులకు తెలంగాణ బీసీల పౌరుషాన్ని చాటుతాం.42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా ఎన్నికలు నిర్వహించనివ్వము. 42 రిజర్వేషన్లు ఇవ్వకుండా కాంగ్రెస్ కుట్ర చేస్తుంది. బీసీ విద్యార్థులు, మహిళలు ఈ ఉద్యమంలో పెద్ద ఎత్తున కలిసిరావాలి,"అని కవిత పిలుపు నిచ్చారు.
తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశం మారోసారి తెరపైకి వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఈ అంశం కీలకంగా మారింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఈ విషయం కాస్తా కాంగ్రెస్కు తలపోటుగా మారింది. కాంగ్రెస్ పార్టీ ఏమో పార్టీ పరంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఫిక్స్ అయింది. ఈ క్రమంలో బీసీ రిజర్వేషన్లను ఎలా అమలు చేయాలి? అన్న విషయంపై కాంగ్రెస్ పెద్దలు కూడా తలమున్కలయ్యేలా ఆలోచిస్తున్నారు. ఇదే సమస్యపై క్యాబినెట్తో కూడా చర్చించాలని ఫిక్స్ అయ్యారు. ఇంతలోనే బీసీ రిజర్వేషన్పై బీఆర్ఎస్ రెబెల్ ఎమ్మెల్సీ కవిత మెదక్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా
‘‘అన్ని బీసీ సంఘాల నాయకులను కలుపుకొని రైల్ రోకో చేస్తాం. ఢిల్లీ పాలకులకు తెలంగాణ బీసీల పౌరుషాన్ని చాటుతాం. ఢిల్లీ పాలనలకు సెగ తాకేలా రైల్ రోకో ఉంటుంది. 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా ఎన్నికలు నిర్వహించనివ్వబోవం. 42 రిజర్వేషన్లు ఇవ్వకుండా కాంగ్రెస్ కుట్ర చేస్తుంది. బీసీ విద్యార్థులు, మహిళలు ఈ ఉద్యమంలో పెద్ద ఎత్తున కలిసిరావాలి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకు తెలంగాణ జాగృతి పోరాటం చేస్తోంది. తెలంగాణ జాగృతి, యూపీఎఫ్ ఒత్తిడితోనూ అసెంబ్లీలో ప్రభుత్వం మూడు బీసీ బిల్లులు పెట్టింది. వార్డు మెంబర్, సర్పంచ్ లు కాని అనేక కులాలు బీసీల్లో ఉన్నాయి. అసెంబ్లీ గడప తొక్కని అనేక కులాలు ఉన్నాయి. రాజకీయ అవకాశాల్లో బీసీ మహిళల పరిస్థితి మరింత దారుణంగా ఉంది’’ అని తెలిపారు.
‘‘మహిళా రిజర్వేషన్లలో బీసీలకు ఉప కోటా ఉండాలి. ఇది రాజకీయ వేదిక కాదు... ఇది మానవ హక్కులు, సామాజిక హక్కులు వేదిక. సమాజంలో 56 శాతం జనాభాకు సంబంధించి హక్కులు కోరుతుంటే అవి మానవ హక్కులు కావా ? ఇప్పుడు మాట్లాడాల్సిన సందర్భం వచ్చింది... కాబట్టి అందరూ కలిసికట్టుగా హక్కల కోసం పోరాటం చేయాలి. సరైన సమయంలో జాగృతి మాట్లాడింది కాబట్టి అసెంబ్లీలో మూడు బిల్లులు వచ్చాయి. అదే స్పూర్తితో బీసీ బిల్లులను కేంద్రం ఆమోదించేలా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఢిల్లీకి బిల్లు పంపించి కాంగ్రెస్ ప్రభుత్వం చేతులుదులుపుకుంది. మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు బీసీ బిల్లు గురించి ఒక్క రోజు కూడా మాట్లాడలేదు’’ అని పేర్కొన్నారు.
‘‘రఘునందన్ రావు బీసీల కోసం ఎందుకు మాట్లాడడం లేదు ? కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీ బిల్లును ఎందుకు ఆమోదించడం లేదని ప్రతీ ఒక్కరు రఘునందన్ రావును ప్రశ్నించాలి. కులగణన వివరాలను కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీల వారీగా ప్రకటించాలి. రౌండ్ టేబుల్ సమావేశానికి రానివ్వకుండా బీసీ నాయకులను మెదక్ లొ కొంత మంది బెదిరించే ప్రయత్నం చేశారు. దీన్న బట్టే వాళ్లు భయపడుతున్నారని అర్థమవుతోంది’’ అని వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి అత్యంత అణగదొక్కబడిన వారు ఎవరైనా ఉన్నారంటే వారు బీసీలేనని కవిత పేర్కొన్నారు. బీఆర్ఎస్ మినహా మరే ఇతర ప్రభుత్వం కూడా బీసీల అభ్యున్నతి కోరుకోవడం లేదని అన్నారు.