‘కేసీఆర్ చేసిన తప్పేంటి..’

తెలంగాణను అభివృద్ధిలో నెంబర్ వన్ గా నిలబెట్టడం తప్పా ?;

Update: 2025-06-04 07:01 GMT

కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత భారీ నిరసన ర్యాలీ చేట్టారు. ఇందిరా పార్క్ దగ్గ ఆమె మహాధర్న చేస్తున్నారు. ఇందులో భాగంగానే అసలు కేసీఆర్ చేసిన తప్పేంటి? అని ప్రశ్నించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు కావాలనే కేసీఆర్‌ను టార్గెట్ చేశాయని ఆరోపించారు. నెర్రెలు వారిన తెలంగాణను గోదావరి నీటిని ఒడిసి పట్టి సస్యశ్యామలంగా మార్చినందుకా ఈ నోటీసులు? అని చురకలంటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగానే కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చిందని ఆరోపించారు. ‘‘రాజకీయ దురుద్దేశంతో కేసీఆర్‌కి నోటీసులు జారీ చేశారు. కేసీఆర్ ఏం తప్పు చేశారని నోటీసులు ఇచ్చా రు ? కేసీఆర్‌కి నోటీసులు ఇచ్చారంటే... మొత్తం తెలంగాణకు నోటీసులు ఇచ్చినట్లే. తెలంగాణ భూములకు నీళ్లు ఇవ్వడం కేసీఆర్ చేసిన తప్పా ?’’ అని నిలదీశారు.

‘‘తెలంగాణను అభివృద్ధిలో నెంబర్ వన్ గా నిలబెట్టడం తప్పా ? కాళేశ్వరం కమిషన్ కాదు... అది కాంగ్రెస్ కమిషన్, రాజకీయ కమిషన్. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే కేవలం మూడు బ్యారేజీలే కాదు. ఆ ప్రాజెక్టులో 21 పంప్ హౌజ్ లు, 15 రిజర్వాయర్లు, 200 కీమీ మేర టన్నెల్ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో 1500 కిలోమీటర్ల మేర కాలువలు ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎత్తిపోసిన మట్టితో దాదాపు 300 పిరమిడ్లు కట్టవచ్చు. కాళేశ్వరంలో వాడిన స్టీల్ తో 100 ఐఫిల్ టవర్లు కట్టవచ్చు. కాళేశ్వరంలో పోసిన కాంక్రీట్ తో 50 బూర్జు ఖలీఫాలు కట్టవచ్చు. అంత పెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం... ప్రాజెక్టు పూర్తయితే 35 శాతం తెలంగాణ భూభాగానికి నీళ్లు అందిస్తుంది. 40 టీఎంసీలతో హైదరాబాద్ కు శాశ్వతంగా నీళ్లు ఇచ్చే ప్రాజెక్టు కాళేశ్వరం. మన పరిశ్రమలకు 16 టీఎంసీల నీళ్లు అందించే ప్రాజెక్టు కాళేశ్వరం’’ అని తెలిపారు.

‘‘90 మీటర్ల అడుగున ఉండే నీళ్లను 600 మీటర్లపైకి ఎత్తిపోసే ప్రాజెక్టు. కేసీఆర్‌ది గట్టి గుండే కాబట్టి అంత పెద్ద ప్రాజెక్టును నిర్మించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు కలలో కూడా అంతపెద్ద ప్రాజెక్టును కట్టాలన్న ఆలోచన రాదు. తెలంగాణ సస్యశ్యామలం కావాలని కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం. దాదాపు 40 లక్షల ఎకరాలకు నీళ్లు అందించే ప్రాజెక్టుపై కుట్ర చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. కేసీఆర్‌ని బద్నాం చేయడానికి మాత్రమే కాళేశ్వరం కమిషన్ వేశారు. గతంలో కాంగ్రెస్ హయాంలో జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేస్తూ 90 శాతం పనులను మెఘా కృష్ణా రెడ్డి కంపెనీకి ఇచ్చారు. మేడిగడ్డకు చిన్న చిన్న మరమ్మత్తులు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పొలాలను ఎండబెడుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో 15 పంప్ హౌజ్ పనులు చేసిన మెఘా కృష్ణా రెడ్డిని కమిషన్ ముందుకు పిలిచే ధైర్యం రేవంత్ రెడ్డికి లేకపోవడం సిగ్గుచేటు’’ అని ఎద్దేవా చేశారు.

‘‘కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్ల కోసం, కాంట్రాక్టర్ల కోసం మాత్రమే పనిచేస్తోంది. 90 శాతం పంప్ హౌజ్ ల పనులు చేసిన కాంట్రాక్టర్ ను ఎందుకు వదిలేశారో ప్రజలకు చెప్పాలి. తెలంగాణ పౌరుషాన్ని చూపించాల్సిన సమయం వచ్చింది. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు వ్యతిరేకించడం లేదు ? తెలంగాణ నీళ్లను ఏపీకి తరలించుకుపోతుంటే రేవంత్ రెడ్డి ఎందుకు కేంద్రానికి ఫిర్యాదు చేయడం లేదు. గోదావరి ‌ - పెన్నా అనుసంధానం పేరిట నీళ్లు తరలింపును తక్షణమే అడ్డుకోవాలి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయాలని డిమాండ్ చేస్తున్నాను. చంద్రబాబు ఎన్డీఏలో ఉన్నందున జలదోపిడి చేసినా రాష్ట్ర బీజేపీ నాయకులు ప్రశ్నించడం లేదు’’ అని విమర్శించారు.

‘‘8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నా రాష్ట్రానికి కేంద్రం నుంచి ఏమీ తేవడం లేదు. బీజేపీలో ఉన్న ఒకే ఒక తెలంగాణ బిడ్డ ఈటల రాజేందర్ కూడా మాట్లడకపోవడం శోచనీయం. బకనచర్ల ప్రాజెక్టును ఆపే ప్రయత్నం చేసే బాధ్యతను ఈటల రాజేందర్ తీసుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకొచ్చే బాధ్యతను కూడా ఈటల రాజేందర్ తీసుకోవాలి. గోదావరి నీటిలో వెయ్యి టీఎంసీల హక్కును సాధించే వరకు తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుంది. మంచిర్యాల, రామగుండం ప్రాంతంలో ధర్నాకు వస్తున్న జాగృతి కార్యకర్తలను అరెస్టు చేశారు. ప్రభుత్వం ఎందుకు ఇంత భయపడుతున్నది ? ధర్నాను అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఊరుకోబోము. హైదరాబాద్ లో ధర్నా చేయనివ్వకపోతే జిల్లాల్లో, గల్లీల్లో ధర్నా చేస్తాం’’ అని వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News