‘బనకచర్ల తప్పంతా కేసీఆర్దే’
గోదావరి జలాలలను రాయలసీమకు తరలించాలని కెసిఆర్, జగన్ ప్రగతి భవన్ లో నాలుగుసార్లు సమావేశమయి నిర్ణయం తీసుకున్నారు.;
ఆంధ్రప్రదేశ్ చేపట్టాలనుకుంటున్న బనకచర్ల ప్రాజెక్ట్ అంశంపై తెలంగాణ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశం బీఆర్ఎస్ నేతలు బాయ్కాట్ చేశారు. కాగా అసలు బనకచర్ల సమస్యకు అంకురార్పన జరిగింది కేసీఆర్ హాయంలోనేనంటూ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వానికి రాజకీయ లబ్ధి కన్నా తెలంగాణ రైతాంగ ప్రయోజనాలే ముఖ్యమన్నారు. ‘‘రాజకీయాలకు అతీతంగా రైతుల ప్రయోజనాలు ఎజెండాగా మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా మనందరం కలిసి పనిచేయాలి. రాజకీయ లబ్ది కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయలేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఈ సమావేశం ఏర్పాటు చేశాం. తెలంగాణ ఏర్పడిన తరువాత కేంద్రప్రభుత్వం 21-9-2016 అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసింది. ఆ సమావేశంలో మొట్టమొదట గోదావరిపై 3 వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని ఆనాటి సీఎం కెసీఆర్ ప్రతిపాదన ఇచ్చారు. ఆ సమావేశంలో హరీష్ రావు కూడా పాల్గొన్నారు’’ అని అన్నారు.
‘‘మళ్లీ 13 ఆగస్టు 2019 లో రాయలసీమను రతనాల సీమ చేస్తామని ఆనాటి తెలంగాణ సీఎం కెసీఆర్ ప్రకటించారు. గోదావరి జలాలలను రాయలసీమకు తరలించాలని కెసిఆర్, జగన్ ప్రగతి భవన్ లో నాలుగుసార్లు సమావేశమయి నిర్ణయం తీసుకున్నారు. ఇరు రాష్ట్రాల సిఎంల భేటీ వివరాలను ఆనాటి మంత్రులు ఈటెల రాజేందర్ , బుగ్గన రాజేంద్ర ప్రసాద్ ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించారు. ఈ మీటింగ్ మినిట్స్ ను రిఫరెన్స్ గా చూపి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు బనకచర్లను గుదిబండగా మార్చే ప్రయత్నం చేస్తోంది. ఇందుకు సమబంధించి అఫీషియల్ డాక్యుమెంట్స్ మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. బనకచర్ల అంశంపై పార్లమెంట్ సమావేశాల్లో ప్రధానితో సహా అందరి అపాయింట్మెంట్ తీసుకుని కలిసి తెలంగాణ సమస్యలను వివరిస్తాం. పొలిటికల్ ఫైట్ లో న్యాయం జరగకపోతే లీగల్ ఫైట్ చేద్దాం. ఈ విషయంలో మనందరం కలిసికట్టుగా ముందుకు వెళతాం’’ అని తెలిపారు.
‘‘ఏ అంశం వచ్చినా.. ఏ విషయం ప్రస్తావనకు వచ్చినా బీఆరెస్ నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడారు.. కోల్పోయాక ఎలా మాట్లాడుతున్నారో వివరించదలచుకున్నా. వాళ్లు సెంటిమెంట్ తో మళ్లీ పార్టీని బ్రతికించుకునే ప్రయత్నం చేస్తున్నారు. రైతాంగాన్ని కష్టాల నుంచి బయటపడేసేందుకు ఆనాడు కాంగ్రెస్ హయాంలో సాగునీటి ప్రాజెక్టులు నిర్మించాం. కెసీఆర్, హరీష్ సంపూర్ణ అవగాహనతో ప్రభుత్వానికి సహకరించినా, సూచనలు చేసినా స్వీకరిస్తాం. కానీ దురుద్దేశంతో రాజకీయ ప్రయోజనాల కోసం మాపై విమర్శలు చేస్తున్నారు. 21-9-2016 న ఢిల్లీ శ్రమ శక్తి భవన్ లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఆనాటి సాగునీరు మంత్రి హరీష్ రావు, ఆనాటి ముఖ్యమంత్రి కెసిఆర్ పాల్గొన్నారు. 8 పేజీల మీటింగ్ మినిట్స్ రికార్డు చేశారు. ఆ సమావేశంలో 3 వేల టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నాయని కెసీఆర్ ప్రతిపాదన పెట్టారు’’ అని గుర్తు చేశారు.
‘‘రాయలసీమకు నీళ్లు ఇవ్వాలని ఆ సమావేశంలోనే పునాది పడింది. ఈ మీటింగ్ మినిట్స్ హరీష్ రావు గారికి పంపిస్తా. 2019 వరకు ఇది రకరకాల కారణాలతో వాయిదాపడుతూ వచ్చింది. 2019 లో ఆనాటి ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో నాలుగుసార్లు సమావేశమై కెసీఆర్ రాయలసీమకు నీటి తరలిపునకు నిర్ణయం తీసుకున్నారు. ఆ సమావేశం వివరాలను ఆనాటిమంత్రులు ఈటెల రాజేందర్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి వివరించారు. రాయలసీమను రతనాల సీమగా మారుస్తామని ఆనాడు కెసిఆర్ మాట్లాడారు. గోదావరి- బనకచర్ల విషయంలో 2016 లో కెసీఆర్, చంద్రబాబు మాట్లాడుకున్న అంశాల సాకుతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముందుకువెళుతోంది. బేసిన్లు లేవు, భేషజాలు లేవు అని కెసీఆర్ ఆనాడు మాట్లాడారు. ఏపీ చేపట్టేది 200 టీఎంసీ ప్రాజెక్టు కాదు 300 టీఎంసీల కోసం ఆనాడు కెసీఆర్ 400 టీఎంసీలు తీసుకోవచ్చని అంగీకరించారు. మేం వాదనలకు వెళ్లదలచుకోలేదు.. అందుకే తెలంగాణకు నష్టం జరగొద్దని జలశక్తి మంత్రిత్వశాఖకు పిర్యాదు చేశాం’’ అని చెప్పారు.
‘‘మా ప్రభుత్వం ఎక్కడా నిర్లక్ష్యం వహించలేదు. ఉన్నఫలంగా హరీష్ బకెట్లో బురద తీసుకుని మాపై చల్లాలని ప్రయత్నిస్తున్నారు. హరీష్ గారు.. ఈ పాపానికి కారకుడు మీ మామనే. పాపాల భైరవులు మీరు. కాంట్రాక్టర్ పెట్టిన సమావేశంలో కమీషన్లకు కక్కుర్తి పడి కుట్రలు చేశారు. ఇప్పుడు వాళ్ళు అధికారంలో లేరని ఆ బురద మాపై చల్లాలని చూస్తున్నారు. వీళ్ళు ఏనాడు తెలంగాణ ప్రయోజనాల కోసం పాటుపడలేదు. పాలమూరు జిల్లాల్లో మొదలైన ఏ ప్రాజెక్టును వీళ్లు పూర్తిచేయలేదు. పదేళ్లలో పెండింగ్ లోనున్న ఏ ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేదు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టుతో గ్రావిటీతో సాగునీరు అందేది. కమిషన్ల కక్కుర్తితో లక్షకోట్లు పెట్టి కట్టిన ప్రాజెక్టుతో లక్ష ఎకరాలకు కూడా సాగు నీరు అందివ్వలేదు. పదేళ్లు 2 లక్షల కోట్లు ఖర్చు చేస్తే తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టులను గాలికి వదిలేశారు’’ అని విమర్శించారు.
‘‘వాళ్ల ఇల్లు నింపుకునేందుకు రాష్ట్రాన్ని దోచుకున్నారు. కానీ పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు మేం ప్రయత్నం చేస్తున్నాం. మేం కష్టపడి ఎస్ఎల్బీసీ పనులు ప్రారంభిస్తే మనుషులు చనిపోతే వాళ్ళు పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఎక్కడ ఎవరు చనిపోయినా వాళ్ళ ముఖాల్లో పైశాచిక ఆనందం కనిపిస్తోంది. హరీష్ రావు హుందాగా వ్యవహరించాలి.. అబద్ధాలతో కాలం వెళ్లదీయొద్దు. ఇవాళ మేం నిజాలు బయటపెట్టాం.. తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు? సాగునీటి ప్రాజెక్టులు, మెట్రో విస్తరణ, రీజనల్ రింగురోడ్డు, మూసీ ప్రక్షాళన అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కలవొద్దా? మీరు నిధులు ఇస్తామంటే చెప్పండి మేం మీ ఫామ్ హౌస్ కే వస్తాం.. 50 వేల కోట్లు ఇవ్వండి.. ప్రభుత్వం తరపున బాండ్లు సమర్పిస్తాం.. అబద్ధాలతో బతుకు సాగదీయొద్దు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం’’ అని పేర్కొన్నారు.
‘‘ఈ విషయంలో మాకు ఎలాంటి శష-భిషలు లేవు.. సామ,దాన, దండోపాయాల్లో మొదటి దశలో ఉన్నాం. అందరినీ కలిసి సమస్యలను వివరిస్తాం.. అయినా న్యాయం జరగకపోతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. తెలంగాణ ప్రభుత్వం అన్ని ప్రక్రియలను అనుసరిస్తూ కేంద్రానికి సమస్యలను వివరిస్తోంది. చంద్రబాబు నాయుడి గారికి సూచన చేస్తున్నా.. కేంద్రంలో పలుకుబడి ఉందని ప్రాజెక్టులు పూర్తవుతాయనుకుంటే మీ భ్రమ. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకునేందుకు మా ప్రణాళిక మాకుంది. చంద్రబాబు… కెసీఆర్ చెప్పారని కాదు.. గోదావరి బేసిన్ లో 3వేల టీఎంసీలు మిగులు జలాలు ఉన్నాయని మీరు నమ్మితే 968 టీఎంసీలు వాడుకునేందుకు తెలంగాణకు సంపూర్ణ అనుమతులు ఇచ్చాక మీరు మిగులు జలాలు తీసుకోండి. కెసీఆర్ తెలంగాణకు చేసిన తీరని ద్రోహం వల్లే ఏపీకి నీళ్లు వెళుతున్నాయి. మేడిగడ్డ గుండెకాయ లాంటిది.. అది లేకపోతే ఆ ప్రాజెక్టు ఉన్నా ప్రయోజనం లేదు. పదేళ్లలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే తెలంగాణకు ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు’’ అని అన్నారు.
‘‘కృష్ణానది జలాలు జూరాలలో తెలంగాణకు వస్తాయి. ఆ నీటిని వాడుకుంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. దీనికి కారణం కేసీఆర్ కాదా? రాయలసీమ ప్రాజెక్టులకు మీరే కదా ఒప్పుకున్నది. భగవంతుడికి భక్తుడికి అనుసంధానం అన్నట్టు మోదీకి చంద్రబాబు అవసరం ఉంది.. చంద్రబాబుకి గోదావరి జలాల అవసరం ఉంది. చంద్రబాబు గారు.. దూరం పెంచుకుంటే సమస్య పరిష్కారం కాదు.. మోదీ దగ్గర అనుమతులు తెచ్చుకున్నంత మాత్రాన మీ ప్రాజెక్టులు పూర్తికావు. కృష్ణా, గోదావరి బేసిన్ లపై మా తెలంగాణ ప్రాజెక్టులకు మీరు ఎన్ఓసీ ఇవ్వండి మిగిలిన నీరును మీరు ఎలాగైనా వాడుకోండి. రేపు కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ ను కలిసి బనకచర్లపై మా అభ్యంతరాలను వివరిస్తాం. ఇందుకోసం రాజకీయాలకు అతీతంగా తెలంగాణ ప్రయోజనాల కోసం అందరూ కలిసిరావాలని కోరుతున్నా. అఖిలపక్ష భేటీకి రాకుండా కిషన్ రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రిని కలవడంలో ఆంతర్యం ఏంటి? రేపు మేం వెళ్లి కలుస్తామని తెలిసి ఇవాళ వెళ్లి కలవడం వెనక ఏం కుట్ర దాగుంది?’’ అని ఆరోపించారు.