సీఎం రేవంత్ రెడ్డికి కొప్పుల ఈశ్వర్ ఛాలెంజ్

రేవంత్ రెడ్డి.. బిల్లా, రంగాల స్థాయిని ఎప్పుడో దాటేశారని విమర్శించారు.;

Update: 2025-05-16 12:38 GMT

బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మనేలా పరిస్థితులు ఉన్నాయి. ప్రతి అంశంలో కూడా ఈ రెండు పార్టీల నేతలు తీవ్ర విమర్శాప్రతివిమర్శలు గుప్పించుకుంటున్నారు. ఇటీవల హరీష్ రావును ఉద్దేశించి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేత కొప్పుల ఈశ్వర్ తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ నేతలను బిల్లా, రంగా అంటూ కాంగ్రెస్ నేతలు అనడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. అది సరైన పద్దతికాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతల తీరు సీఎం రేవంత్ రెడ్డి పదవి స్థాయిని తగ్గించేలా ఉన్నాయని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి.. బిల్లా, రంగాల స్థాయిని ఎప్పుడో దాటేశారని విమర్శించారు. రేవంత్ ముందు చార్లెస్ శోభరాజ్ కూడా దిగదుడుపే అంటూ అంటూ ఎద్దేవా చేశారు. పాలన చేతగాక పనికిరాని మాటలు మాట్లాడటం రేవంత్ మానుకోవాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

‘‘రాజకీయ పార్టీల నాయకత్వం అనేది వాటి అంతర్గత వ్యవహారం. మహేష్ కుమార్ గౌడ్ ని పీసీసీ అధ్యక్షుడిగా మమ్మల్ని అడిగి చేశారా? ఆయన్ను ఎందుకు పెట్టారు దళితుడికి ఎందుకు ఇవ్వలేదని మేము అడిగామా? బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా పని చేసే పార్టీ. ఎవరైతే తెలంగాణ ప్రజలకు ఎక్కువ మేలు జరుగుతుందో వారినే బీఆర్ఎస్ ఎంచుకుంటుంది. దళిత ముఖ్యమంత్రి అన్నది 2014 కి ముందు. మేము అధికారంలోకి రాలేదు విజయ రామారావును బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ గా నియమించాం. వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్నిఅభివృద్ధి చేసే విజన్ ను సిద్దం చేసుకున్న కేసీఆర్ సీఎం అయితేనే మంచిది అనుకుని పార్టీ తెలంగాణ ముక్త కంఠంతో నిర్ణయం తీసుకుంది అందుకే దళితుడు సీఎం కాలేదు. తెలంగాణ రాష్ట్రం కొత్తగా వచ్చిన రాష్ట్రం కనుక కేసీఆర్ తప్ప ఎవ్వరు సీఎం అయినా రాష్ట్రానికి నష్టం జరిగేది’’ అని అన్నారు.

‘‘రేవంత్ రెడ్డి సీఎం అయినంక చూస్తున్నాం రాష్ట్రం పరిస్థితి ఏమయిందో. ఖర్గే ఏఐసీసీ డమ్మీ అధ్యక్షుడు. నడిపేదంతా రాహుల్ అని జనానికి తెలియదా? సోనియా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ జపం తప్ప కాంగ్రెస్ లో ఏమైనా ఉందా. రాహుల్, ప్రియాంకలకు ఏ హోదా ఉన్నదని రేవంత్ గత ఎన్నికల్లో డిక్లరేషన్లు ప్రకటింప జేశారు. హామీల అమలుకు తమది గ్యారంటీ అని వాళ్ళు ఎలా చెప్పారు? బీఆర్ఏస్ పగ్గాలు దళితునికి ఇవ్వాలంటున్న రేవంత్ రెడ్డి, ఖర్గేను పీఎం చేస్తామని ఎందుకు అనడం లేదు? రాహుల్ ని పీఎం చేస్తామని ఎందుకు అంటున్నారు? రాహుల్ నాయకత్వంలో పని చేద్దామని రేవంత్ అంటారే తప్ప ఖర్గే నాయకత్వం గురించి మాట్లాడతారా? కులగణన రాహుల్ చెప్తే చేశాం అంటాడు తప్ప ఖర్గే సూచనలతో అని ఎపుడైనా రేవంత్ అన్నాడా? 50 సంవత్సరాలు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు కుల గణన ఎందుకు నిర్వహించలేదు?’’ అని ప్రశ్నించారు.

‘‘దళితుల పట్ల కాంగ్రెస్ ది, రేవంత్ ది మొసలి కన్నీరే.. పదవుల మీద ప్రేమ తప్ప దళితులకు పదవులిచ్చే ప్రేమకాదు. మల్లిఖార్జున ఖర్గేను పార్టీ అధ్యక్షుడిగా చేశారు అంటున్నారు. 1985 నుండి ఇప్పటి వరకు ఎంతమంది దళితులను ప్రెసిడెంట్ గా చేశారు? 98 మంది ప్రెసిడెంట్లలో కనీసం నలుగురు దళితులు లేరు. గాంధీ కుటుంబానికి తప్ప వేరే ఎవరికైనా ప్రధాని పదవిని ఇచ్చారా? పీవీని కనీసం పోగు పోయనివ్వలేదు. మన్మోహన్ సింగ్ ను ప్రధానిని చేసి, చైర్మన్ గా సోనియా గాంధీ అసలు అధికారం వెలగబెట్టింది. మోతిలాల్ నెహ్రూ రెండేళ్లు, జవహర్లాల్ నెహ్రూ 9 ఏండ్లు, ఇందిరాగాంధీ ఆరేళ్లు, రాజీవ్ గాంధీ ఆరేండ్లు, సోనియా గాంధీ 21 ఏళ్లు, రాహుల్ గాంధీ రెండేళ్లు మొత్తం కుటుంబం కాంగ్రెస్ కు 46 ఏళ్ళు అధ్యక్ష స్థాయిలో ఉన్నారు. ఇదేనా మీ సామాజిక న్యాయం?’’ అని నిలదీశారు.

‘‘దళితుల్లో దామోదర సంజీవయ్య, జగ్జీవన్ రామ్, ఖర్గేలు మాత్రమే AICC అధ్యక్షులుగా ఉన్నారు. వీరి పదవి కాలం ముష్టి మూడేళ్లు మాత్రమే. జనం మార్పు కోరుకున్నారు కాబట్టి మీరు అధికారంలోకి వచ్చారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే దామోదర రాజనరసింహను లేదా వివేక్ వెంకటస్వామిలను ముఖ్యమంత్రిని చేయండి. కేసీఆర్ క్యాబినెట్ లో నేను చీఫ్ విప్ గా, మంత్రిగా పని చేసిన విషయం రేవంత్ రెడ్డి మరిచిపోయారనుకుoట. మా నాయకుడు కేసీఆర్ అడుగు జాడల్లో మేం నడుస్తాం. కాంగ్రెస్ పార్టీలో నిర్ణయం తీసుకోవాలన్న ఢిల్లీకి వెళ్లి లాబీయింగ్ చేయాల్సిందే. కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు? రేవంత్ రెడ్డి ఇప్పుడున్న పరిస్థితుల్లో మంత్రివర్గ విస్తరణ చేస్తే, తన ముఖ్యమంత్రి పదవికి ఎసరు వస్తుందని భయపడుతున్నాడు. బిల్లా రంగా అని మా నేతలను సంబోధించడం ద్వారా రేవంత్ సీఎం పదవి స్థాయిని తగ్గించారు. బిల్లా రంగాల చేష్టలు రేవంత్ వే. బిల్లా రంగాల స్థాయి రేవంత్ ఎపుడో దాటి పోయారు చార్లెస్ శోభరాజ్ ను మించిపోయారు. పాలన చేత కాక పనికి రాని మాటలు మాట్లాడుతున్నారు’’ అని మండిపడ్డారు.

‘‘అంబేడ్కర్ ను ఓడించి జగ్జీవన్ రామ్ ను అవమానించిన కాంగ్రెస్ పార్టీ, మాకు నీతులు చెప్పే అర్హత ఉందా? దళితులకు రెండు సార్లు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చిన ఘనత బీఆర్ఎస్‌ది. రేవంత్ కు దళితుల పట్ల ప్రేమ ఉంటే ఓ దళితుణ్ణి సీఎం చేయండి. బీఆర్ఎస్ ఎప్పుడేమి చేయాలో కూడా రేవంత్ రెడ్డి చెబితే మేము ఎందుకు? బీఆర్ఎస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం తగ్గించి పాలన మీద దృష్టి పెట్టు రేవంత్. సీఎం పదవి లో ఉంటూ వేరే వాళ్ళను సీఎం అనే స్థాయికి రేవంత్ వెళ్లాడంటే ఆయన మతి భ్రమించింది అనుకోక తప్పదు. ముందు కాంగ్రెస్ పార్టీ చెప్పిన చేవెళ్ల దళిత డిక్లరేషన్ అమలు గురించి రేవంత్ ఆలోచించాలి. బీఆర్ఎస్ నాయకత్వం గురించి తర్వాత ఆలోచించవచ్చు’’ అని అన్నారు.

Tags:    

Similar News