మాధవీలత హిందూత్వ ప్రాయశ్చిత్త తిరుమల ప్రయాణం

బీజేపీ నాయకురాలు కొంపెల్లి మాధవీలత గురువారం హైదరాబాద్ నుంచి హిందూత్వ ప్రాయశ్చిత్త తిరుమల ప్రయాణం చేపట్టారు.వందేభారత్ రైలులో బోగీల్లో తిరుగుతూ భజన చేశారు.

Update: 2024-09-26 09:05 GMT

శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వును కలిపి అపవిత్రం చేసిన నేపథ్యంలో బీజేపీ నాయకురాలు కొంపెల్లి మాధవీలత హిందూత్వ ప్రాయశ్చిత్త తిరుమల ప్రయాణం చేపట్టారు.హైదరాబాద్ నగరానికి చెందిన బీజేపీ నాయకురాలు కొంపెల్లి మాధవీలత తోటి భక్తులతో కలిసి భజన చేస్తూ హైదరాబాద్ నుంచి తిరుపతికి వందే భారత్ రైలులో బయలుదేరారు.రైలులో భజనలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతికి ప్రయాణమయ్యారు.


ఆలయహుండీలో క్షమాపణ లేఖలు
తిరుమల లడ్డూ వివాదం కొనసాగుతున్న తరుణంలో హైదరాబాద్ బీజేపీ మాజీ ఎంపీ అభ్యర్థి మాధవి లత వందేభారత్ రైలులో తిరుపతికి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.ఆలయ హుండీలో ‘క్షమా ప్రార్థన పత్ర’ (క్షమాపణ లేఖ) సమర్పిస్తానని బీజేపీ నాయకురాలు మాధవీలత చెప్పారు.ఇలాంటి లేఖలు రాయడానికి ఇష్టపడే ఇతరులను ఆలయ హుండీలో సమర్పించేందుకు వీలుగా వాటిని తనకు అందజేయాలని ఆమె కోరారు.హైదరాబాద్ నుంచి వందేభారత్ రైలులో తిరుపతికి ప్రయాణిస్తూ గురువారం సాయంత్రం తిరుపతికి చేరుకుంటారు.

ఆలయాల్లో హిందూవేతరులు పనిచేయొద్దు : ఎమ్మెల్యే రాజాసింగ్
దేవాలయాలు, హిందూ మతంలో ప్రాముఖ్యత ఉన్న ఇతర ప్రదేశాల్లో హిందువేతరులు పని చేసేందుకు అనుమతించరాదని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే టి.రాజాసింగ్ డిమాండ్ చేశారు.దేవాలయాల్లో పేర్లు మార్చుకుని పనిచేస్తున్న హిందువేతరులను గుర్తించేందుకు టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడును ఆయన కోరారు.

సనాతన హిందువుగా యాత్ర
దేవాలయం, ప్రసాదాల పవిత్రతను దెబ్బతీసేలా ఇంత దిగజారిపోతారని తాను ఊహించలేదని బీజేపీ నాయకురాలు కొంపెల్లి మాధవీలత చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో భగవంతుని ప్రసాదంలోనే జంతువుల కొవ్వును కలపడం నిష్ణాపూర్వకంగా పూజలు చేసే భక్తులను కలిచి వేసిందని ఆమె పేర్కొన్నారు. ‘‘సన్యాసులు, యోగులు, భక్తులతో కలిసి తాను సనాతన హిందువుగా ప్రాయశ్చిత్తం చేసేందుకు తిరుపతి బయలు దేరాను, మీరు ఆశీర్వదించండి, ప్రసాదాన్ని కలుషితం చేసిన వారిని శిక్షించాలి’’ అని మాధవీలత చెప్పారు.

భజనలతో మార్మోగిన వందేభారత్ రైలు
వందేభారత్ రైలు మాధవీలత, ఇతర భక్తుల భజనలతో మార్మోగింది. ‘‘సనాతన ధర్మాన్ని పరిరక్షకులను వెంట తీసుకొని యాత్ర నారాయణ గోవిందనామాన్ని జపిస్తూ ఏడు కొండలు ఎక్కుతాను, క్షమా ప్రార్థన ప్రాయశ్చిత్త దారిలో ఎన్నో రైల్వే స్టేషన్లలోనూ భక్తులు క్షమా ప్రార్థన లేఖలు ఇస్తే వాటిని శ్రీవారి హుండీలో వేస్తాను’’ అని మాధవీలత చెప్పారు. ‘‘హరే రామ హరే కృష్ణ రామ రామ హరే కృష్ణ ’’అంటూ బోగీల్లో భక్తులు కలియ తిరిగారు. ‘‘గోకుల నందనా గోవింద స్వయంప్రకాష గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య సుభద్రత గోవింద గోవిందా హరి గోవింద ఆనందరూప గోవింద ఇహ పరదాయక గోవిందా’ అంటూ భజనలు కొనసాగించారు.


Tags:    

Similar News