దళితబంధు పథకం అమలులో నిధుల దుర్వినియోగం ?

కేసీఆర్ ప్రభుత్వం గతంలో అమలు చేసిన దళితబంధు పథకం నిధులు దుర్వినియోగమయ్యాయి. ఈ పథకం కింద లక్ష్యాలు నెరవేరక పోగా ప్రజాధనం పక్కదారి పట్టింది.;

Update: 2025-05-30 23:35 GMT
దళితబంధు పథకం : నెరవేరని లక్స్యాలు

తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ పాలనలో 2021లో దళితబంధు కార్యక్రమాన్ని అప్పటి సీఎం కేసీఆర్ ఆర్భాటంగా ప్రారంభించారు.ద‌ళిత కుటుంబాల ఆదాయ‌వ‌నరుల‌ను పెంచి వారికి ఉపాధి కల్పించాలని ప్రారంభించిన పథకం ఆశించిన లక్ష్యాలు నెరవేరలేదు. ముందుగా కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా ఆ నియోజకవర్గంలో ఆరంభించిన దళితబంధు పథకాన్ని ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించారు. 118 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అమలు చేసిన ఈ పథకం కింద రూ.3884 కోట్ల ప్ర‌జాధ‌నం వెచ్చించారు.


లబ్దిదారుల ఎంపికలో అక్రమాలు
ఈ పథకం లబ్దిదారుల ఎంపికలో ఎమ్మెల్యేల హవా సాగింది. వారి అనుచరులకే ఈ స్కీం లబ్ధి చేకూర్చారు. కొన్ని నియోజకవర్గాల్లో రూ.10లక్షల పథకంలో రూ.2 నుంచి రూ.3 లక్షలు లంచం తీసుకున్నారు. లబ్ధిదారులకు సాంకేతిక శిక్షణ ఇవ్వకుండా రూ. 10 లక్షలు అప్పనంగా విడుదల చేశారు.దళితబంధు పథకం కింద 10 ల‌క్ష‌ల‌రూపాయల్లో రూ.9.9 ల‌క్ష‌లు లబ్ధిదారుల ఖాతాకు జ‌మ‌చేశారు. ఇందులో రూ.10 వేలు మాత్రం ర‌క్ష‌ణ‌ఫండ్ పేర వేరే ఖాతాలో జ‌మ‌చేశారు. ఈ పథకం అమలులో రాజకీయనేతల ప్రమేయంతో పలు అక్రమాలు జరిగాయని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ దర్యాప్తులో తేలింది.

హుజురాబాద్ ఉప ఎన్నికల కోసమే దళితబంధు ?
అప్పటి మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్ రాజీనామా చేసి బీజేపీ అభ్యర్థిగా హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. దీంతో హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంతో ఆరంభించిన దళితబంధు పథకం కింద ఆ నియోజకవర్గంలో దళితులకు లబ్ధి చేకూర్చారు. ఉప ఎన్నికల కోసమే తాము దళితబంధు పథకాన్ని తీసుకువచ్చామని అప్పట్లో కేసీఆర్ బహిరంగంగానే ప్రకటించారు. దళిత బంధు పథకం మంచిదైనా, దీని అమలులో జరిగిన లోపాలు, అక్రమాల వల్ల అసలు లక్ష్యం నెరవేర లేదు.

దళితబంధు పథకం రెండు విడతలుగా నిధులు విడుదల
తెలంగాణ రాష్ట్రంలో 2021-22 , 2022-23 ఆర్థిక సంవత్సరాల్లో దళిత బంధు పథకం -1 కింద రూ.386095.60 లక్షలను విడుదల చేసినట్లు తెలంగాణ షెడ్యూల్ కులాల సహకార అభివృద్ధి సంస్థ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. దళిత బంధు రెండో విడత 2023-24 ఆర్థిక సంవత్సరంలో 2356.90 లక్షలను ఎస్సీ లబ్ధిదారులకు పంపిణీ చేశామని తెలంగాణ షెడ్యూల్ కులాల సహకార అభివృద్ధి సంస్థ పబ్లిక్ ఇన్ ఫర్ మేషన్ ఆఫీసర్ డి హనుమంతు నాయక్ ఈ ఏడాది మే 12వతేదీన రాసిన లెటర్ నంబరు ఏ1/ 511 /టీజీఎస్సీ/ 2025 ద్వారా ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కు తెలిపారు.

తెలంగాణలో నిలిచిన దళితబంధు
రాష్ట్రంలో ఇంత‌వ‌ర‌కు ద‌ళిత‌బంధు పేరిట రూ.3884 కోట్ల ప్ర‌జాధ‌నం ఖ‌ర్చు చేసినా, పథకం లక్ష్యాలు మాత్రం నెరవేరలేదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు యం పద్మనాభరెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. తెలంగాణలో 118 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఈ స్కీం అమ‌లుచేయటానికి 2022-23 సంవ‌త్స‌రంలో రూ.17,700 కోట్ల బ‌డ్జెట్ కేటాయించారు.మొత్తం ఈ పథకం కింద అయిదు సంవ‌త్స‌రాల్లో రూ.1.7 లక్ష‌ల కోట్ల‌తో అమ‌లుచేయాల‌ని నిర్ణ‌యించినా,ద‌ళిత‌బంధు స్కీం మొద‌టి నుంచి స‌మ‌స్య‌ల్లో చిక్కుకుంది.

కేసీఆర్ ఫాంహౌస్ ఇలాఖా వాసాలమర్రిలో...
ద‌ళిత‌బంధు పథకాన్ని మొదటగా కేసీఆర్ ఫాం హౌస్ సమీపంలోని తుర్కపల్లి మండలం వాసాల‌మ‌ర్రి గ్రామంలో అమ‌లు చేశారు. ఈ గ్రామంలో దళిత బంధు స్కీం అమలుపై ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ ఏవాల్యుయేష‌న్ చేసింది. ఈ పరిశీలనలో పలు అక్రమాలు జరిగాయని తేలింది.వాసాలమర్రి గ్రామంలో 52 ఎస్‌.సి.కుటుంబాలు ఉండ‌గా 73 యూనిట్లు ఇచ్చిన‌ట్లు లెక్క‌లు చెపుతున్నాయి. డ‌బ్బు ఖ‌ర్చు అయినా ఇంకా కొన్ని యూనిట్లు పెండింగులోనే ఉన్నాయి. వాసాలమర్రి గ్రామంలో ఒకరికే ఈ పథకం కింద లబ్ధి కల్పించాల్సి ఉండగా, ఒకే ఇంట్లో తండ్రి, కొడుకులకు కలిపి రూ.30 లక్షలను అందించారు. డ‌బ్బు ఖ‌ర్చు అయినా ఇంకా కొన్ని యూనిట్లు పూర్తి కాక లబ్ధిదారులకు ఆర్థికంగా ఎలాంటి ప్ర‌యోజ‌నం క‌లగ‌లేదు.

నెరవేరని దళితబంధు లక్ష్యం
చిన్న గ్రామాల్లో సైతం టెంటు హౌస్ లు పెడతామంటూ కొంతమంది లబ్ధిదారులు దళితబంధు పథకం కింద రూ.10 లక్షలు తీసుకున్నారు. చిన్న గ్రామాల్లో ఎక్కువ మంది టెంట్ హౌస్ లు పెట్టడంతో అవి సరిగా నడవక మూతపడ్డాయి. దళితబంధు పథకం కింద దళితులకు ఉపాధి కల్పించాలనే అసలు లక్ష్యానికి గండి పడింది. ప్రజాధనం వ్యర్థం కాగా సర్కారు లక్ష్యం కాస్తా పక్కదారి పట్టిందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు యం పద్మనాభరెడ్డి చెప్పారు. ఈ పథకం అమలులో అక్రమాలు జరుగుతున్నాయని అప్పట్లో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అప్పటి కేసీఆర్ సర్కారుకు లేఖ రాసినా పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు.

మూలనపడిన ట్రాక్టర్లు, కార్లు
దళిత బంధు పథకం కింద ఎక్కువ మంది లబ్ధిదారులు కార్లు, ట్రాక్టర్లు కొనుగోలు చేశారు. గ్రామాల్లో ఇప్పటికే ట్రాక్టర్లు ఉండగా, ఈ పథకం కింద లబ్ధిదారులు ట్రాక్టర్లు కొన్నారు. కొన్నాళ్లు నడిపాక ఈ ట్రాక్టర్లు మూలనపడ్డాయి. పాతబడిన ట్రాక్టర్లను లబ్ధిదారులు అమ్ముకున్నారు. కార్లు కూడా సరిగా నడపలేక వాటిని లబ్ధిదారులు విక్రయించారు. ఈ పథకం కింద దళితులకు ఉపాధి కల్పించాలనే ప్రధాన లక్ష్యం నెరవేర లేదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యయనంలో వెల్లడైంది.

ప్రజాధనం దుర్వినియోగం
ఈ పథకం కింద లబ్ధిదారులకు ఆర్థికంగా ఎలాంటి ప్ర‌యోజ‌నం క‌లగ‌లేదు. ఈ పథకం కింద తీసుకున్న కార్లు, ట్రాక్ట‌ర్లు కొన్ని రోజులు న‌డిచి ఆగిపోయాయి.ఉపాధి కల్పించే వాహనాలను త‌క్కువ ధ‌ర‌ల‌కు లబ్ధిదారులు అమ్ముకున్నారు.ద‌ళిత‌బంధు కార్య‌క్ర‌మం రాజ‌కీయ‌ల‌బ్ధి కోసమే ప్ర‌వేశ‌పెడుతున్నాన‌ని స్వ‌యంగా అప్పటి ముఖ్య‌మంత్రి కేసీఆర్ చెప్ప‌డం అంటే ప్ర‌జ‌ల సొమ్ముతో ఎన్నిక‌ల్లో ల‌బ్ధి పొందాలని యత్నించారని తేలింది. ఈ పథకంలో ప్ర‌జాధ‌నం వృధా అవుతుంద‌ని,దీన్ని ప‌రిశీలించాల‌ని ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ అప్పట్లో కేసీఆర్ సర్కారుకు అర్జీ ఇచ్చినా ఏమీ చ‌ర్య‌లు తీసుకోలేదు. ఈ పథకం కింద కొన్న కార్లు, ట్రాక్టర్లను లబ్ధిదారులు త‌క్కువ ధ‌ర‌ల‌కు అమ్ముకున్నారు.దీంతో ప్రజాధనం దుర్వినియోగం అయింది.

దర్యాప్తు జరపాలని సీఎంకు ఫోరం లేఖ
ద‌ళిత‌బంధు కార్య‌క్ర‌మంపై స‌మ‌గ్ర విచార‌ణ జ‌రిపించాలని ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డికి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు యం పద్మనాభరెడ్డి శుక్రవారం లేఖ రాశారు. రూ.3884 కోట్ల ప్ర‌జాధ‌నం దుర్వినియోగం వ్యవహారంలో బాధ్యుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయన ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిని కోరారు.




Tags:    

Similar News