హైదరాబాద్ చేరుకున్న రాహుల్.. కీలక సూచనలు చేసిన కేటీఆర్, కవిత
దారి తప్పి తెలంగాణకు వస్తున్న ఎన్నికల గాంధీకి స్వాగతం అంటూ కవిత తన ఎక్స్(ట్విట్టర్) వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.;
హైదరాబాద్ వేదికగా జరుగుతున్న భారత్ సమ్మిట్లో పాల్గొనడం కోసం కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ఎంపీ రాహుల్ గాంధీ హైదరాబాద్కు చేరుకున్నారు. భారత్ సమ్మిట్లో ఆయన పలు కీలక అంశాలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ క్రమంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్ గాంధీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి రాహుల్ నేరుగా భారత్ సమ్మిట్ వేదికకు బయలుదేరారు. మరికాసేపట్లో ఆయన సదస్సులో పాల్గొననున్నారు. అయితే రాహుల్ గాంధీ.. హైదరాబాద్ వచ్చిన నేపథ్యంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. రాహుల్ గాంధీకి పలు కీలక సూచనలు చేశారు. దారి తప్పి తెలంగాణకు వస్తున్న ఎన్నికల గాంధీకి స్వాగతం అంటూ కవిత తన ఎక్స్(ట్విట్టర్) వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఆ ప్రాంతాల్లో పర్యటించండి రాహుల్ జీ: కేటీఆర్
తెలంగాణలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ.. హైదరాబాద్లోనే కాకుండా పలు ఇతర ప్రాంతాల్లో కూడా కలియతిరగాలని సూచించారు. ఈ మేరకు కేటీఆర్ ఎక్స్(ట్విట్టర్) వేదికగా పోస్ట్ పెట్టారు. అంతేకాకుండా తన పోస్ట్కు #CongressFailedTelangana హ్యాష్ట్యాగ్ జోడించారు. ‘‘
‘‘– లగచర్ల గ్రామం
– సుంకిశాల
– హైడ్రా కూల్చేసిన ఏ ప్రాంతమైనా
– మూసీ కూల్చివేసిన ప్రాంతాలు
– హెచ్సీయూ కంచ గచ్చిబౌలి
– ఫుడ్ పాయిజన్తో చనిపోయిన 100 మంది గురుకుల విద్యార్థుల కుటుంబాల్లో ఏదైనా
– ఆత్మహత్య చేసుకున్న 500కి పైగా రైతు కుటుంబాల్లో ఏదైనా
– ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిన ప్రాంతం
– ఫోర్త్ సిటీ (ఫోర్ బ్రదర్ సిటీ)
– అశోక్ నగర్( అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని మీరు హామీ ఇచ్చిన ప్రాంతానికి)
ఈ ప్రాంతాల్లో పర్యటించడం ద్వారా మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఎంత నష్టం చేసిందో మీకు బాగా అర్థమవుతుంది. ఈ పర్యటనలో మీకు మీ ప్రభుత్వం చేస్తున్న నష్టాన్ని చూసుకునే సమయం లభిస్తుందని ఆశిస్తున్నా’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
ముంచిన రాహుల్ గాంధీకి స్వాగతం: కవిత
‘‘దారితప్పి తెలంగాణకు వస్తున్న ఎన్నికల గాంధీ గారికి స్వాగతం.. ! మోసపూరిత హామీలు.. అబద్ధపు వాగ్దానాలతో తెలంగాణ ప్రజలను నిండా ముంచేసి హైదరాబాద్ కు వస్తున్న రాహుల్ గాంధీకి సుస్వాగతం..!! రాహుల్ గాంధీ.. మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 16 నెలల పాలనలో ప్రజలను రాచిరంపాన పెట్టింది.. హైడ్రా, మూసీ పేరుతో పేద ప్రజల మీదికి బుల్డోజర్లు పంపింది. లగచర్ల బంజారా ఆడబిడ్డలపై అర్ధరాత్రి వేళ అఘాయిత్యాలకు ఒడిగట్టింది.. సర్కారు దుశ్చర్యకు అడ్డంకిగా ఉన్నారని బంజారా యువతపై థర్డ్ డిగ్రీ ప్రయోగించింది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సాగించిన ఈ రాక్షసకాండను జాతీయ మానవ హక్కుల కమిషన్ నిర్దారించింది. కరెంట్ పోయిందని సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే అరెస్టులు.. వేధింపులు.. బెదిరింపులు. పచ్చని అడవిని సర్వనాశనం చేస్తున్నారని సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు నిరసనకు దిగితే వారిపై లాఠీల మోతలు.. అక్రమ కేసులు.. అరెస్టులు.
ఈ హైదరాబాద్ పర్యటనలో మీరు హెచ్సీయూను సందర్శించి లాఠీ దెబ్బలు తిన్న, వేధింపులకు గురైన విద్యార్థులను పరామర్శించండి. తెలంగాణ ప్రజలు శ్రీమతి సోనియాగాంధీ గారిని, మీ సోదరి శ్రీమతి ప్రియాంకా గాంధీ గారిని.. మిమ్మల్ని నమ్మి అధికారమిస్తే ఉమ్మడి రాష్ట్రంలో కన్నా తీవ్ర నిర్బంధం, అణచివేతను బహుమతిగా ఇచ్చారు. బిహార్ లో విద్యార్థుల గోడు వినాలని వారి పక్షాన గళమెత్తిన మీరు.. తెలంగాణలో గ్రూప్ -1 అభ్యర్థుల ఆందోళనలపై ఎందుకు మౌనంగా ఉన్నారు? మీరు, సోనియా గాంధీ ఇచ్చిన ఆరు గ్యారంటీల పరిస్థితి ఏమిటి ? డిసెంబర్ 9 , 2023 న రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీని సగానికే పరిమితం చేశారు.. దేశానికి ఆదర్శంగా నిలిచిన రైతుబంధు పథకానికి తూట్లు పొడిచి ఆ పథకాన్ని నిర్వీర్యం చేశారు.. అయినా మీ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిలదీయరెందుకు? కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఏమైంది? మహిళలకు నెలకు రూ.2500 ఏమయ్యాయి? 18 ఏళ్లు నిండిన ఆడపిల్లలకు స్కూటీలు ఎప్పుడు ఇస్తారు.. ఆరు గ్యారంటీలు, 420 హామీలను ఎప్పుడు అమలు చేస్తారు? ఎర్ర బుక్కు పట్టుకుని రాజ్యాంగాన్ని రక్షించాలంటూ దేశమంతా తిరిగే మీరు తెలంగాణలో మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మానవ హక్కులను మంటకలుపుతూ.. దమనకాండ కొనసాగిస్తూ.. ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు.. మీ మౌనం దేనికి సంకేతం?’’ అని ప్రశ్నించారు.