మంత్రి సురేఖపై వరంగల్ కాంగ్రెస్ నేతల తిరుగుబాటు ?
ఆదివారం తెలంగాణ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ను(Meenakshi Natarajan) కీలక నేతలు కలిసి మంత్రిపై ఫిర్యాదుచేశారు.;
దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు వ్యతిరేకంగా వరంగల్ జిల్లాలోని కీలక నేతలు కొందరు తిరుగుబాటు లేవదీశారు. కొంతకాలంగా మంత్రికి జిల్లాలోని కొందరు కీలక నేతలకు ఏమాత్రం పడటంలేదు. దాంతో ఆదివారం తెలంగాణ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ను(Meenakshi Natarajan) కీలక నేతలు కలిసి మంత్రిపై ఫిర్యాదుచేశారు. మంత్రితో పాటు ఆమె భర్త కొండా మురళిపై కీలకనేతలు చాలా ఆరోపణలు చేసినట్లు పార్టీవర్గాల సమాచారం. స్టేషన్ ఘన్ పూర్ ఎంఎల్ఏ కడియం శ్రీహరి, వరంగల్ వెస్ట్ ఎంఎల్ఏ నాయిని రాజేంద్రనాధ్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, ఎంఎల్సీ బస్వరాజ్ సారయ్య, కొందరు కార్పొరేషన్ ఛైర్మన్లు మీనాక్షితో సమావేశమయ్యారు. మంత్రికి, వ్యతిరేకవర్గానికి మధ్య విభేదాలు తారస్ధాయికి చేరుకున్నాయి అనేందుకు భద్రకాళి అమ్మవారి బోనాలు వాయిదాపడటమే తాజాఉదాహరణ. దీనికి అదనంగా చాలాకాలంగా జిల్లా మొత్తంమీద మంత్రి ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్నట్లు ఆరోపణలు పెరిగిపోతున్నాయి.
నాలుగురోజుల క్రితం మంత్రి భర్త కొండామురళి మాట్లాడుతు కడియం శ్రీహరి, రేవూరి తదితరులపై తీవ్రమైన ఆరోపణలు చేయటమే కాకుండా వ్యక్తిగతంగా కూడా దూషించారు. దాంతో మరుసటిరోజే నాయిని ఆధ్వర్యంలో కడియం తదితర నేతలంతా సమావేశమై మంత్రితో పాటు మురళిపైన విరుచుకుపడ్డారు. ఆదివారం భద్రకాళి బోనాల సమయంలో జంతుబలులు ఇవ్వాలని కొందరు అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతున్నది అన్నారు. అందుకు తాము అంగీకరించేదిలేదని కూడా చెప్పారు. అమ్మవారి బోనాల్లో జంతుబలిని తాము అంగీకరించేదిలేదని కూడా హెచ్చరించారు. అలాగే మద్యం సేవించి గుడిలోకి వస్తే బాగుండదని వార్నింగ్ ఇచ్చారు. నాయిని ఎందుకు మాట్లాడారంటే అమ్మవారి ఆలయం తన నియోజకవర్గంలోనే ఉందికాబట్టి.
నాయిని హెచ్చరికలకు మంత్రి స్పందించి పరోక్షంగా తప్పుపట్టారు. అలాగే అమ్మవారి బోనాల తేదీని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఆదివారం బోనాలను మంత్రి దంపతుల సమక్షంలో జరిపించేందుకు దేవాదాయ శాఖ పెద్దఎత్తున ఏర్పాట్లుచేసింది. అయితే నాయిని హెచ్చరికలో లేకపోతే ఇంకేదైనా కారణమో సరిగ్గా తెలీదుకాని చివరి నిముషంలో బోనాలు వాయిదా వేస్తున్నట్లు మంత్రి స్వయంగా ప్రకటించారు. బోనాలు వాయిదాపడినట్లు మంత్రయితే ప్రకటించారు కాని వాయిదాపడటాన్ని మాత్రం జీర్ణించుకోలేకపోయారు. బోనాలు వాయిదాపడటానికి తన వ్యతిరేక గ్రూపే కారణమనే మంట మంత్రిలో బాగా పెరిగిపోయింది. అసలే నాయిని, కడియం అంటే ఏమాత్రం పడని మంత్రి మీడియాతో మాట్లాడుతు తాను మంత్రిగా ఉన్నాను కాబట్టి తనముందు కూర్చోవటానికి కొందరు నామోషీగా ఫీలవుతున్నట్లు ఆరోపించారు. మంత్రి ఎవరి పేరును ప్రస్తావించకపోయినా ఎవరికి తగలాలో ఆరోపణలు వారికే తగిలాయి.
దాంతో ఇక లాభంలేదని మంత్రి వ్యతిరేక గ్రూపు ముందు పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్(PCC President Bomma Maheshkumar goud) కు ఫిర్యాదు చేశారు. పంచాయితి పరిష్కారానికి బొమ్మ కూడా కొంత ప్రయత్నంచేశారు. మంత్రితో విభేదాలు బొమ్మ స్ధాయిలో పరిష్కారం అయ్యేదికాదని అర్ధమైన తర్వాత ఈరోజు ఎంఎల్ఏ క్వార్టర్స్ లో ఉన్న ఇన్చార్జి మీనాక్షిని కలిసి మంత్రితో పాటు ఆమె భర్తపైన ఫిర్యాదుచేశారు. నిజానికి మంత్రి వ్యతిరేక గ్రూపులో ఇంతటి ఐకమత్యం గతంలో ఎప్పుడూ లేదు. నాయిని, కడియం, బస్వరాజ్ లాంటి నేతలు ఎవరి దారిలో వాళ్ళు వెళుతున్నారు. అయితే మంత్రి సురేఖ(Konda Surekha) వ్యతిరేకులను అందరినీ కట్టగట్టి కొండా మురళి ఎప్పుడైతే తీవ్రంగా దూషించారో అప్పుడే ఎవరికి వారుగా ఉన్న నేతలంతా మంత్రి దంపతులకు వ్యతిరేకంగా ఏకమయ్యారు. వరంగల్ పంచాయితీపై నేతలతో మాట్లాడి రిపోర్టు తయారుచేసిన పీసీసీ అధ్యక్షుడు బొమ్మ ఇప్పటికే మీనాక్షికి అందించినట్లు సమాచారం. పీసీసీ అధ్యక్షుడు ఇచ్చిన రిపోర్టు, వ్యతిరేక గ్రూపు చేసిన ఫిర్యాదులు, ఆరోపణలపై మీనాక్షి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనో ఆసక్తి పార్టీలో పెరిగిపోతోంది. చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.
మీనాక్షి భరోసా
తనను కలిసి ఫిర్యాదుచేసిన మంత్రి కొండాసురేఖ వ్యతిరేక నేతలకు మీనాక్షి భరోసా ఇచ్చినట్లు సమాచారం. వ్యతిరేక వర్గంనేతలు మీనాక్షితో జరిగిన భేటీలో మంత్రి దంపతులపై ఆరోపణలు చేయటమే కాకుండా కాకుండా తమపై మంత్రి భర్త మురళి చేసిన ఆరోపణలు, వ్యాఖ్యల మీడియా క్లిప్పింగులను ఆధారాలుగా చూపించినట్లు తెలిసింది. మీడియా క్లిప్పింగులను పరిశీలించిన తర్వాత వరంగల్ పంచాయితీపై తాను విచారణ చేయిస్తానని, బాధ్యులపై చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు పార్టీవర్గాల సమాచారం.