రేవంత్ తల్లినే మార్చేశాడట
ఉద్యమంలో ఒకతల్లి, అధికారంలోకి రాగానే తెలంగాణ తల్లిని మార్చేశారని ఎద్దేవా చేశారు.;
ఎనుముల రేవంత్ రెడ్డి మీద బీఆర్ఎస్ సీనియర్ నేత, సిద్ధిపేట ఎంఎల్ఏ తన్నీరు హరీష్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మార్పు చూపిస్తామని చెప్పి చివరకు తల్లిని మార్చేసినట్లు ఆరోపించారు. ప్రతిపక్షంలో నుండి అధికారంలోకి రాగానే రేవంత్ తెలంగాణ తల్లిని మార్చేసినట్లు చెప్పారు. తెలంగాణ(Telangana) ఉద్యమసమయంలో రూపొందిన తెలంగాణ తల్లిని అధికారంలోకి రాగానే రేవంత్ మార్చేసినట్లు మండిపడ్డారు. ఉద్యమసమయంలో తెలంగాణ తల్లి ఉద్యమకారులకు ఎంతో స్పూర్తిని, ధైర్యాన్ని ఇచ్చిందని, అందరికీ ఆమోదయోగ్యమైన, ఎంతోమంది నుండి పూజలందుకున్న తెలంగాణతల్లి విగ్రహాన్ని రేవంత్(Revanth) సీఎం కాగానే మార్చేసిన విషయాన్ని గుర్తుచేశారు. మార్పు, మార్పంటే ఏమిటో అనుకుంటే ఉద్యమంలో ఒకతల్లి, అధికారంలోకి రాగానే తెలంగాణ తల్లిని మార్చేశారని ఎద్దేవా చేశారు.
జగదేవ్ పూర్ మండలంలోని తీగుల్ గ్రామంలో బీఆర్ఎస్(BRS) కార్యాలయంలో తెలంగాణతల్లి విగ్రహాన్ని హరీష్(Harish Rao) ఆవిష్కరించారు. ఈసందర్భంగా రేవంత్ మీద తనకున్న అక్కసునంతా హరీష్ తీర్చుకున్నారు. ఎలాగంటే హరీష్ చెప్పినట్లు కేసీఆర్(KCR) నిజంగానే తెలంగాణతల్లి నుండి అంతగా స్పూర్తి పొందింది నిజమే అయితే మరి విగ్రహాన్ని సెక్రటేరియట్ ముందు ఎందుకు ఏర్పాటు చేయలేదని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. సచివాలయం ముందు ఉండే తెలంగాణతల్లి విగ్రహాన్ని సెక్రటేరియట్ నూతన భవన నిర్మాణం సందర్భంగా తొలగించారు. సచివాలయం నిర్మాణం అయిపోయిన తర్వాత విగ్రహాన్ని యథాస్ధానంలో ఏర్పాటు చేస్తారని అనుకుంటే అసలా విషయాన్నే కేసీఆర్ పట్టించుకోలేదు.
ఎంతమంది తెలంగాణతల్లి విగ్రహం ఏర్పాటు విషయాన్ని గుర్తుచేసినా, ప్రకటనలు ఇచ్చినా కేసీఆర్ పట్టించుకోలేదు. నూతన భవననిర్మాణం కాగానే తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయం ముందు ఏర్పాటుచేసుంటే రేవంత్ కు అవకాశం దక్కేదికాదు. అధికారంలోఉన్నపుడు తెలంగాణతల్లి విగ్రహాన్ని కేసీఆర్ పట్టించుకోలేదు కాబట్టే రేవంత్ సీఎం కాగానే తనిష్టం వచ్చినట్లు తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించి సచివాలయంలో ఏర్పాటుచేశారు. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు, రూపుమార్పుపై గోలచేసిన, చేస్తున్న కేటీఆర్(KTR), హరీష్ రావు తదితరులు అప్పట్లో కేసీఆర్ ను ఎందుకు నిలదీయలేదు. తొలగించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మళ్ళీ ఏర్పాటుచేయాలని అప్పట్లో కేటీఆర్, హరీష్ పట్టించుకోలేదు కాబట్టే విగ్రహం రూపాన్ని మార్చి తనిష్టంవచ్చిన చోట ఏర్పాటుచేసే అవకాశం రేవంత్ కు దక్కింది. వచ్చిన అవకాశాన్ని రేవంత్ చక్కగా సద్వినియోగంచేసుకున్నారు. ఆ విషయమై ఇపుడు ఎంత గోలచేసినా ఎలాంటి ఉపయోగం ఉండదు.
బీఆర్ఎస్ హయాంలో కరెంటు పోయేదికాదని ఇపుడు కరెంటు కోతలు ఉన్నట్లు మండిపడ్డారు. ఆగస్టు 15వ తేదీలోగా రైతు రుణమాఫీ చేస్తానని యాదాద్రి దేవుడిపై ప్రమాణంచేసి రేవంత్ తప్పినట్లు ఆరోపించాడు. కేసీఆర్ ఇచ్చిన పించన్లు రెట్టింపుచేస్తానని చెప్పి మాట తప్పినట్లు మండిపడ్డాడు. డబ్బులు లేవని చెబుతునే అందాలపోటీలకు రు. 200 కోట్లు ఖర్చుపెట్టినట్లు ఆరోపించారు. అందాలపోటీల్లో ఇంగ్లాండ్ అమ్మాయిని రేవంత్ దోస్తులు ఇబ్బంది పెట్టి పారిపోయేట్లు చేశారని ఆరోపించారు. రైతులకు రేవంత్ ప్రభుత్వం వడ్ల పైసలు కూడా ఇంకా ఇవ్వలేదన్నారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల ముందు చెప్పిన రేవంత్ అధికారంలోకి వచ్చిన తర్వాత 10 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదన్నారు.