2029 కల్లా నియోజకవర్గాల పునర్ విభజన:రేవంత్ రెడ్డి

పిజెఆర్ ప్లై ఓవర్ బ్రిడ్జి ప్రారంభోత్సవంలో...;

Update: 2025-06-28 14:28 GMT

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం పునర్ విభజనపై కీలక వ్యాఖ్యలు చేశారు.వచ్చే ఎన్నికల్లోపు నియోజకవర్గాలు పునర్ విభజన చెందనున్నాయన్నారు. పిజెఆర్ ప్లై ఓవర్ బ్రిడ్జి ప్రారంభోత్సవంలో ఈ వ్యాఖ్యలు చేశారు. 

తెలంగాణలో ఫ్యూచర్ సిటీ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. దేశంలోనే ఆదర్శ నగరంగా ఫ్యూచర్ సిటీ నగరం రూపుదిద్దుకోబోతుందన్నారు. ప్రపంచ దిగ్గజ కంపెనీలు హైద్రాబాద్ వైపు చూస్తున్నాయన్నారు.శేర్ లింగంపల్లిలో కాంగ్రెస్ మాజీ శాసనసభాపక్ష నేత పి. జనార్ధన్ రెడ్డి పేరిట నిర్మించిన ప్లై ఓవర్ ప్రారంభోత్సంవంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

హైదరాబాద్ అభివృద్దిని కొన్ని రాజకీయ పార్టీలు అడ్డుకుంటున్నాయన్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు హైదరాబాద్ అభివృద్దిపై దృష్టి పెట్టడం లేదన్నారు. మూడు పర్యాయాలు కేంద్రంలో బిజెపి అధికారంలో ఉన్నప్పటికీ హైదరాబాద్ అభివృద్ది కాలేదన్నారు.

హైడ్రా ద్వారా ఆక్రమణలు తొలగిస్తున్నామని రేవంత్ రెడ్డి అన్నారు. హైడ్రా చేపడుతున్న ఆక్రమణ తొలగింపు పలువురికి స్పూర్తినిచ్చిందన్నారు. ఎన్ కన్వెన్షన్ రెండు ఎకరాల భూమిని సినీ నటుడు నాగార్జున స్వచ్చందంగా ప్రభుత్వానికి అప్పగించారని రేవంత్ రెడ్డి అన్నారు. హైడ్రా ద్వారా ఆక్రమణ భూములు స్వాధీనమవుతున్నాయన్నారు.నగరంలో అన్ని నాలాలు, చెరువులు కబ్జాలకు గురయ్యాయి అని రేవంత్ రెడ్డి అన్నారు.

చంద్రబాబును ప్రశంసించిన ముఖ్యమంత్రి

ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే పి జెఆర్ వల్లే హైటెక్ సిటీకి పునాది పడిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పిజెఆర్ పునాది వేస్తే చంద్రబాబు నెక్స్ట్ లెవెల్ లో అభివృద్ది చేశారన్నారు. చంద్రబాబును రేవంత్ రెడ్డి ప్రశంసలతో ముంచెత్తారు.పిజెఆర్ ఇల్లు ఒకప్పుడు జనతా గ్యారెజ్ మాదిరిగా ఉండేదన్నారు. జంటనగరాల అభివృద్దికి ఆయన కృషి చేశారన్నారు. ఆయన కృషి వల్లే జంటనగరాలకు గోదావరి, కృష్ణా జలాలు వచ్చాయన్నారు.పిజెఆర్ ప్లై ఓవర్ బ్రిడ్జిని రూ 182. 75 కోట్లతో నిర్మించామన్నారు. ఆరు లేన్లతో 1.2 కిలో మీటర్ల  ప్లై ఓవర్ బ్రిడ్జివల్ల గచ్చిబౌలి చౌరస్తా వద్ద ట్రాఫిక్ సమస్య తగ్గనుందని రేవంత్ రెడ్డి చెప్పారు.

కంచగచ్చి బౌలిలో వివిధ కంపెనీలు రావడం వల్ల కొత్తగా ఐదు లక్షల ఉద్యోగాలు రానున్నాయని రేవంత్ రెడ్డి తెలిపారు. కంచగచ్చి బౌలిలో ఆటంకాలు తాత్కాలికమేనన్నారు. కంచెగచ్చి బౌలిలో అభివృద్ది చేసి చూపిస్తామన్నారు.

కాలుష్యం కారణంగా ఢిల్లీ అతలాకుతులం అవుతుందని ,పాలకులకు ప్రణాళిక లేకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తిందన్నారు. హైద్రాబాద్ ను కాలుష్య రహిత నగరంగా తీర్చి దిద్దుతామన్నారు.

నాలుగుముక్కలవబోతున్న శేర్ లింగంపల్లి 

2029 ఎన్నికల్లో శేరిలింగంపల్లి నాలుగు నియోజకవర్గాలుగా రూపుదిద్దుకోబోతుందని రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు.

డీ లిమిటేషన్ జరగనుందన్నారు. రంగా రెడ్డి జిల్లాలోని శేర్ లింగంపల్లి లో అభివృద్ది శర వేగంగా సాగుతోందన్నారు. హైటెక్ సిటీ శేర్ లింగం పల్లిలో భాగమన్నారు. ఇక్కడి  ఐటీ కంపెనీలు, పరిశ్రమలు అభివృద్ది చెందడానికి వైఎస్ రాజశేఖరెడ్డి కారణమన్నారు. తెలంగాణ అభివృద్ది కోసం అన్ని రాజకీయ పార్టీలు దృష్టి సారించాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రస్తుతం శేర్ లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ రెండు పర్యాయాలు గెలిచి నియోజకవర్గ అభివృద్దికి దోహదపడ్డారన్నారు. నియోజకవర్గ విస్తీర్ణం ఎక్కువ కావడంతో నాలుగు భాగాలుగా విడిపోనుందని రేవంత్ రెడ్డి చెప్పారు.

Tags:    

Similar News