బీఆర్ఎస్ పై కవిత సంచలన వ్యాఖ్యలు
కవిత తాజా వ్యాఖ్యలతో కుటుంబంలో వివాదాలు ఏ స్ధాయికి చేరుకున్నాయో అర్ధమైపోతోంది;
ఆరురోజుల వివాదం తర్వాత గురువారం కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈరోజు మీడియాతో మాట్లాడుతు సోదరుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) పేరు ప్రస్తావించకుండా చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలు సంచలనంగా మారాయి. ఆమె ఏమన్నారంటే తాను కేసీఆర్(KCR) నాయకత్వాన్ని తప్ప మరొకరి నాయకత్వాన్ని అంగీకరించేదిలేదని స్పష్టంగా ప్రకటించారు. అంటే కేటీఆర్ నాయకత్వాన్ని కవిత అంగీకరించేందుకు ఇష్టపడటంలేదన్న విషయం అర్ధమైపోతోంది. కవిత తాజా వ్యాఖ్యలతో కుటుంబంలో వివాదాలు ఏ స్ధాయికి చేరుకున్నాయో అర్ధమైపోతోంది. అలాగే బీఆర్ఎస్(BRS) పార్టీ తనదే అన్నారు. అంటే తాను పార్టీలోనే కంటిన్యు అవుతున్నట్లు చెప్పకనేచెప్పారు. కాబట్టి కవిత సొంతపార్టీ పెట్టబోతున్నారనే ప్రచారానికి తెరపడినట్లే అనుకోవాలి.
అలాగే బీఆర్ఎస్ ను బీజేపీ(BJP)లో విలీనంచేసే కుట్ర జరుగుతోందన్నారు. తాను జైలులో ఉన్నపుడే విలీనం ప్రయత్నాలు మొదలైందన్నారు. కేసీఆర్ కు కాళేశ్వరం విచారణ కమిషన్ నోటీసులు ఇస్తే పార్టీలో నేతలు ఎవరూ స్పందించలేదని నిష్టూరాలాడారు. అదే మరో నేతకు(కేటీఆర్)కు నోటీసులు ఇస్తేమాత్రం పార్టీనేతలు రెచ్చిపోయిన విషయాన్ని గుర్తుచేశారు. తనపైన పార్టీలోని నేతలు, క్యాడరే దుష్ప్రచారం చేస్తున్నట్లు చెప్పారు. విదేశాల నుండి తనపైన దుర్మార్గంగా సోషల్ మీడియాలో రాతలు రాసినట్లు మండిపడ్డారు. ఇంటి ఆడబిడ్డపై పెయిడ్ ఆర్టిస్టులతోనే వ్యతిరేక ప్రచారం చేయిస్తారా అని నిలదీశారు. కేసీఆర్ ను తామే నడిపిస్తున్నామని చెప్పుకునే నాయకులు అంతటి గొప్ప నాయకులా అని ఎవరిని అడిగారో తెలీకుండా నిలదీశారు.
తన తండ్రికి తాను రాసిన లేఖను లీక్ చేసింది ఎవరో తేలాల్సిందే అన్నారు. పార్టీ చేయాల్సిన పనులను జాగృతి తరపున తాను చేస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే పార్టీ అన్నారు. ఆ పార్టీతో తాను మాట్లాడి ఎన్నో సంవత్సరాలవుతోందన్నారు. పార్టీకి తనను దూరంచేస్తే ఎవరికి లాభమో అందరు ఆలోచించాలన్నారు. విలీనం కుట్రగురించి మాట్లాడుతు బీజేపీకి దగ్గరగా ఉన్న బీఆర్ఎస్ నేత ఎవరో తేలాలన్నారు. బీజేపీ నేతలకు సంబంధించిన ఆసుపత్రులను ప్రారంభించిన బీఆర్ఎస్ నేత ఎవరో అందరికీ తెలుసన్నారు. తనజోలికి వస్తే పరిణామాలు మామూలుగా ఉండవని తీవ్రంగా హెచ్చరించారు. లీకువీరులను పట్టుకోమంటే గ్రీకువీరులు తనపైన దండెత్తటం ఏమిటని మండిపోయారు.
కవిత మాట్లాడిన మాటల్లో కొన్ని విషయాలు అర్ధమవుతున్నాయి. అవేమిటంటే ఒకవైపు తనతండ్రే పార్టీలో సుప్రిం అని చెబుతునే సోదరుడు కేటీఆర్ నాయకత్వాన్ని అంగీకరించేది లేదన్నారు. ఆమె మాట్లాడిందంతా కేటీఆర్ ను టార్గెట్ చేస్తునే మాట్లాడారు. పార్టీ తరపున తనతో మాట్లాడిన ఎంపీ దామోదర్ రావు, గండ్ర మోహన్ రావును కేసీఆర్ పంపలేదన్నారు. ఇద్దరిని కేసీఆర్ పంపకపోతే కవితతో రాయబారానికి ఇంకెవరు పంపారో అందరు అర్ధంచేసుకోవాలన్నారు. అలాగే కేసీఆర్ కు తెలీకుండానే బీజేపీలో విలీనం ప్రపోజల్ తీసుకొచ్చిందెవరనే చర్చ ఒక్కసారిగా పెరిగిపోయింది. తనను కేసీఆర్ కు దూరంచేసే కుట్ర జరుగుతోందనే ఆరోపణ కూడా కీలకమే. ఎందుకంటే తండ్రి-కూతురు మధ్య గ్యాప్ పెంచాల్సినంత అవసరం ఎవరికి ఉంది ? తండ్రి, కూతుర్ల మధ్య గ్యాప్ పెంచాలనే సాహసం ఎవరు చేస్తారు ? అన్నదే ఆశ్చర్యంగా ఉంది. తాజాగా కవిత లేవనెత్తిన ప్రశ్నలకు, ఆరోపణలకు ఎవరు సమాధానం చెబుతారో చూడాలి.