చిక్కుకున్న వారి ఆచూకీ ఇంకా తెలీదు.. చెప్పిన సీఎం రేవంత్

ఇది ఒక విపత్తు… మనందరం ఏకతాటిపై నిలబడి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు.;

Update: 2025-03-02 15:23 GMT

శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగ ప్రమాదానికి ముమ్మాటికీ గత ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన ఆదివారం.. ఘటనాస్థలాన్ని పరిశీలించారు. అనంతరం అక్కడ చేపడుతున్న సహాయక చర్యలపై రెస్క్యూ టీమ్స్, అధికారులు, మంత్రులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అధికారుకు కీలక సూచనలు చేశారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా ఉండటానికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్ట్ తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని, అందుకు గత ప్రభుత్మే కారణమని అన్నారు.

 

‘‘గత ప్రభుత్వం టన్నెల్ పనులు చేసే సంస్థకు గత ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. పైగా ఆ సంస్థ విద్యుత్ బకాయిలు చెల్లించలేదని విద్యుత్ నిలిపివేశారు. విద్యుత్ లేకపోవడంతో టన్నెల్ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రతీష్ఠాత్మక ప్రాజెక్టు పనులను పూర్తిచేసేందుకు చర్యలు చేపట్టింది. సంస్థకు బిల్లులు చెల్లించి, సాంకేతిక నిపుణులతో చర్చించి సమస్యలు పరిష్కరించాం. మిషనరీకి సంబంధించి స్పేర్ పార్ట్స్ అమెరికా నుంచి తెప్పించాం. పనులను వేగంగా పూర్తి చేసి నల్లగొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపాలని మేం చిత్తశుద్దితో పనిచేస్తుంటే.. అనుకోకుండా ఈ దుర్ఘటన జరిగింది… ఇది అనుకొని ప్రమాదం’’ అని తెలిపారు.

 

‘‘ఇలాంటి విపత్తులు జరిగినపుడు రాజకీయాలకు అతీతంగా ఏకమై సమస్యను పరిష్కరించుకోవాలి. ప్రభుత్వమైనా, ప్రతిపక్షమైనా… బాధిత కుటుంబాలపై సానుభూతి చూపించి వారిని ఆదుకోవాలి. ఆర్మీ, టన్నెల్ ఎక్స్పర్స్ట్స్ తో సహా 11 డిపార్ట్‌మెంట్స్ సహాయక చర్యల్లో పనిచేస్తున్నాయి. వారిని మనస్పూర్తిగా అభినందిస్తున్నా. టన్నెల్లో చిక్కుకున్న ఎనిమిది మంది ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఇప్పటికీ ఒక అంచనాకు రాలేదు. ఈ సమస్య ఒక కొలిక్కి రావడానికి మరో రెండు, మూడు రోజులు పడుతుందని అధికారులు చెబుతున్నారు. కన్వేయర్ బెల్ట్ పాడవడంతో లోపల మట్టిని బయటకు తరలించడం ఇబ్బందిగా మారింది. రేపటిలోగా కన్వేయర్ బెల్ట్‌ను రిపేర్ చేస్తే లోపల ఉన్న మట్టిని బయటకు తరలించడం సులువు అవుతుంది’’ అని వివరించారు.

‘‘ఆ ఎనిమిది మంది లోపల ఎక్కడ చిక్కుకుపోయారో, ఎక్కడ మిషనరీ పాడైపోయిందో అధికారులు ఇంకా పూర్తిస్థాయి అంచనాకు రాలేదు. ప్రమాదం జరిగిన రోజు నుంచి ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు, ప్రస్తుత పరిస్థితిపై సమీక్ష చేశాం. ఇది ఒక విపత్తు… మనందరం ఏకతాటిపై నిలబడి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేస్తున్నా. గతంలో శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ లో పవర్ జనరేషన్ లో ప్రమాదం జరిగితే ఎవ్వరినీ అక్కడికి వెళ్లనివ్వలేదు. ఆనాడు పీసీసీ అధ్యక్షుడిగా నేను వస్తే నన్ను జైల్లో పెట్టారు’’ అని గుర్తు చేశారు.

 

‘‘దేవాదుల, కాళేశ్వరం ప్రాజెక్టుల్లో ఎక్కడ మరణించినా ఆనాడు ప్రభుత్వం విపక్షాలను అనుమతివ్వలేదు… ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అక్కడకు వెళ్ళలేదు. కానీ ఇవాళ మేం ఘటన జరిగిన వెంటనే ఉత్తమ్ గారిని పంపి, కేంద్రంతో సమన్వయం చేసుకుని అన్ని సంస్థలను ఇక్కడికి రప్పించాం. ప్రపంచంలోనే అతిపెద్ద టన్నెల్ ఇది… మేం మనోధైర్యం కోల్పోలేదు. ప్రమాదంలో చిక్కుకున్న వారి కుటుంబాలను ఆదుకోవడంతో పాటు ప్రాజెక్టును పూర్తి చేస్తాం. ఈ సమస్య పరిష్కరించేందుకు అవసరమైతే రోబోలను ఉపయోగించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించాలనే పట్టుదలతో ఉంది. ఇందుకు మీరంతా సహకరించాలని కోరుతున్నా’’ అని తెలిపారు రేవంత్ రెడ్డి.

 

హరీష్‌కు రేవంత్ కౌంటర్

సీఎంకు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి సమయం ఉంది కానీ.. ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదాన్ని పరిశీలించడానికి, అక్కడి సహాయక చర్యలను పర్యవేక్షించడానికి మాత్రం సమయం లేదంటూ మాజీమంత్రి హరీష్ రావు చేసిన విమర్శలపై రేవంత్ ఘాటుగా స్పందించారు. హరీష్ రావా నన్ను ప్రశ్నించేందంటూ చురకలంటించారు. ‘‘నన్ను ఎన్నికల ప్రచారానికి వెళుతున్నాడని విమర్శిస్తున్న హరీష్ రావు….టన్నెల్ లో ప్రమాదం జరిగినప్పుడు దుబాయ్ లో దావత్ చేసుకోలేదా? హరీష్ రావు పాస్ పోర్టును ఒకసారి బయట పెట్టమనండి. కాదు అంటే ఆ వివరాలను నేను బయటపెడతా. ప్రమాదం తర్వాత రెండు రోజులు అబుదాబిలో దావత్ లో హరీష్ రావు మునిగి తేలాడు’’ అని రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

Tags:    

Similar News