‘దక్షిణాది ఏకమై పోరాడాలి’.. డీలిమిటేషన్‌పై రేవంత్

బీజేపీ అనుస‌రిస్తున్న ఈ విధానానికి వ్య‌తిరేకంగా ద‌క్షిణాది ప్ర‌జ‌లు, పార్టీలు, నాయ‌కులు ఏకం కావాలని రేవంత్ రెడ్డి పిలుపినిచ్చారు.;

Update: 2025-03-22 09:22 GMT

డీలిమిటేషన్‌కు వ్యతికంగా చెన్నైలో జరుగుతున్న జేఏసీ సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ప్రతి విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం అన్యాయమే చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ అంశంపై దక్షిణాది రాష్ట్రాలను ఏకతాటిపైకి తెచ్చిన స్టాలిన్‌కు అభినందనలు తెలిపారు. ప్రతి ఒక్కరూ డీలిమిటేషన్‌పై తమ అభిప్రాయాలను పంచుకోవాలి. ఈ విషయంపై దక్షిణాది రాష్ట్రాలు ఐక్యంగా పోరాడాలని, ఇక్కడ తన అభిప్రాయాలను తాను పంచుకుంటున్నానని అన్నారు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగానే బీజేపీ జనాభా, జరిమానాల విధానాన్ని అనుసరిస్తోందని విమర్శించారు.

‘‘1971లో జ‌నాభాను నియంత్రించాల‌ని దేశం నిర్ణ‌యం తీసుకున్న‌ప్ప‌టి నుంచి ద‌క్షిణాది రాష్ట్రాలు దాన్ని అమ‌లు చేస్తే ఉత్త‌రాదిలోని రాష్ట్రాలు జ‌నాభా నియంత్ర‌ణ‌లో విఫ‌ల‌మ‌య్యాయి. ద‌క్షిణాది రాష్ట్రాల‌న్నీ వేగంగా ఆర్థిక వృద్దిని సాధించాయి.. జీడీపీ, త‌ల‌స‌రి ఆదాయం, వేగంగా ఉద్యోగాల క‌ల్ప‌న‌, మెరుగైన మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌, సుప‌రిపాల‌న‌, సంక్షేమ కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ‌లో మంచి ప్ర‌గ‌తి సాధించాయి. దేశ ఖ‌జానాకు మ‌నం పెద్ద మొత్తంలో నిధులు ఇస్తూ త‌క్కువ మొత్తాన్ని పొందుతున్నాం. త‌మిళ‌నాడు ప‌న్నుల రూపంలో కేంద్రానికి రూపాయి చెల్లిస్తే 29 పైస‌లే వెన‌క్కి వ‌స్తుంటే... ఉత్త‌ర ప్ర‌దేశ్‌కు రూపాయికి రెండు రూపాయ‌ల 73 పైస‌లు వెన‌క్కి వెళుతున్నాయి’’ అని అన్నారు.

‘‘బీహార్‌ రూపాయి చెల్లిస్తే 9 రూపాయ‌ల 22 పైస‌లు వెన‌క్కి తీసుకుంటుంటే క‌ర్ణాట‌క‌కు కేవ‌లం 14 పైస‌లు, తెలంగాణ‌కు 41 పైస‌లు, కేర‌ళ‌కు 62 పైస‌లు మాత్ర‌మే వెన‌క్కి వ‌స్తున్నాయి. అదే స‌మ‌యంలో మ‌ధ్య ప్ర‌దేశ్ రూపాయి ప‌న్ను రూపంలో కేంద్రానికి ఇస్తే వెన‌క్కి రూ.2.79 పైస‌లు వెళుతున్నాయి. ద‌క్షిణాది రాష్ట్రాల‌కు కేంద్రం కేటాయింపులు.. ప‌న్ను చెల్లింపులు క్ర‌మంగా త‌గ్గిస్తోంది.. చివ‌ర‌కు జాతీయ ఆరోగ్య మిష‌న్ కేటాయింపుల్లోనూ ఉత్త‌రాది రాష్ట్రాల‌కే 60 నుంచి 65 శాతం నిధులు ద‌క్కుతున్నాయి. మ‌నది ఒకే దేశం.. మ‌నం దానిని గౌర‌విస్తాం.. కానీ ఈ పున‌ర్విభ‌జ‌న‌ను మ‌నం అంగీక‌రించం.. ఎందుకంటే ఇది దక్షిణాది రాష్ట్రాల రాజ‌కీయ కుదింపు.. మంచి ప్ర‌గ‌తి సాధిస్తున్న రాష్ట్రాల‌ను ఈ ప్ర‌క్రియ శిక్షిస్తోంది. ఈ అస‌మ‌గ్ర‌మైన పున‌ర్విభ‌జ‌న ప్ర‌క్రియ చేప‌ట్ట‌కుండా మ‌నం బీజేపీని అడ్డుకోవాలి. నా మొద‌టి పాయింట్‌... సీట్లు పెంచొద్దు.. ఉన్న సీట్ల‌తోనే పున‌ర్విభ‌జ‌న ప్ర‌క్రియ చేప‌ట్టాలి... 1976లో ఇందిరా గాంధీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వం అలానే పున‌ర్విభ‌జ‌న చేప‌ట్టింది. లేకుంటే రాష్ట్రాల మ‌ధ్య రాజ‌కీయ తేడాలు (అస‌మ‌తౌల్యాలు) వ‌చ్చేవి’’ అని తెలిపారు.

‘‘2001లో ప్ర‌ధాన‌మంత్రి వాజ్‌పేయీ నేతృత్వంలోని ప్ర‌భుత్వం పున‌ర్విభ‌జ‌న ప్ర‌క్రియ‌ను అలానే ప్రారంభించింది. లోక్‌స‌భ సీట్ల‌ను అదే సంఖ్య‌లో ఉంచుతూ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ అదే విధంగా చేయ‌గ‌ల‌రా? నా రెండో పాయింట్‌... జ‌నాభా దామాషా ప్రాతిప‌దిక పున‌ర్విభ‌జ‌ను ద‌క్షిణాది వ్య‌తిరేకిస్తోంది. బీజేపీ ప్ర‌తిపాదిస్తున్న జ‌నాభా దామాషా ప‌ద్ద‌తిలో పున‌ర్విభ‌జ‌న చేప‌డితే ద‌క్షిణాది రాష్ట్రాలైన మ‌నం రాజ‌కీయ గ‌ళం కోల్పోతాం. మ‌న‌ల్ని ఉత్త‌రాది ద్వితీయ శ్రేణి పౌరులుగా త‌గ్గించివేస్తుంది. జ‌నాభా ప్రాతిపదిక‌న పున‌ర్విభ‌జ‌న చేప‌డితే ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, బీహార్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్‌, ఛత్తీస్‌గ‌ఢ్ వంటి రాష్ట్రాలు దేశంపై ఆధిప‌త్యం చ‌లాయిస్తాయ‌ని ఇక్క‌డ ఉన్న ప్ర‌తి ఒక్క‌రూ అంగీకరిస్తారు. ఏ ప‌రిస్థితుల్లోనూ మ‌నం దీనికి అంగీక‌రించ‌కూడ‌దు’’ అని కోరారు.

‘‘బీజేపీ అనుస‌రిస్తున్న ఈ విధానానికి వ్య‌తిరేకంగా ద‌క్షిణాది ప్ర‌జ‌లు, పార్టీలు, నాయ‌కులు ఏకం కావాలి. మూడో పాయింట్‌... ప్రొరేటా విధానాన్ని అంగీక‌రించ‌లేం.. ప్రొరేటా విధానం కూడా ద‌క్షిణాదికి న‌ష్ట‌మే క‌లిగిస్తుంది.. ప్రొరేటా ప్ర‌క్రియ కూడా రాజ‌కీయ అంత‌రాల‌ను పెంచుతుంది. ప్రొరేటా విధానాన్ని పాటిస్తే సీట్ల మ‌ధ్య తేడా కేంద్ర ప్ర‌భుత్వ ఏర్పాటును నిర్ణ‌యిస్తుంది.. ఒక్క సీటు కూడా తేడాను చూపుతుంది. ఒక్క సీటుతో కేంద్ర ప్ర‌భుత్వం ప‌డిపోయిన చ‌రిత్ర మ‌న దేశంలో ఉంది. కాబ‌ట్టి ప్రొరేటా విధానం కూడా ద‌క్షిణాది రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల‌కు భంగం క‌లిగిస్తుంది. మ‌రి మ‌నం అంగీక‌రించే ఆప్ష‌న్లు ఏమిటంటే... నా సింపుల్ విశ్లేష‌ణ ఏమంటే. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ మాజీ ప్ర‌ధాన‌మంత్రి వాజ్‌పేయీ విధానాన్ని పాటించ‌డ‌మే... మ‌రో 25 ఏళ్ల‌పాటు లోక్‌స‌భ సీట్ల‌లో ఎటువంటి మార్పు తీసుకురావ‌ద్దు. సీట్ల సంఖ్య‌లో మార్పు లేకుండా పున‌ర్విభ‌జ‌న ప్ర‌క్రియ చేప‌ట్టాలి’’ అని వివరించారు.

‘‘పున‌ర్విభ‌జ‌న‌కు రాష్ట్రాన్ని యూనిట్ తీసుకొని చేయాలి. రాష్ట్రాల్లోని జ‌నాభా ఆధారంగా పున‌ర్విభ‌జ‌న చేప‌ట్టాలి. రాష్ట్రాల్లోని న‌గ‌రాలు, గ్రామాల్లోని జ‌నాభా ఆధారంగా లోక్‌స‌భ సీట్ల హ‌ద్దుల‌ను మార్పు చేయాలి. తాజా జ‌నాభా లెక్క‌ల ప్ర‌కారం రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీ సీట్ల సంఖ్య పెంచాలి. ప్ర‌తి రాష్ట్రంలో మ‌హిళ‌ల‌కు 33 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాలి. లోక్ స‌భ స్థానాల పెంపును మ‌రో 25 ఏళ్ల‌పాటు వాయిదా వేయాలి. నేను తెలంగాణ‌లోని మ‌ల్కాజిగిరి ఎంపీగా చేశాను.. అది ప్ర‌పంచంలోనే అతి పెద్ద నియోజ‌క‌వ‌ర్గం.. అక్క‌డ మొత్తం జ‌నాభా 45 ల‌క్ష‌లైతే ఓట‌ర్లు 32 లక్ష‌లు.. కాబ‌ట్టి నేను ఈ స‌మ‌స్య‌ను పూర్తిగా అర్ధం చేసుకోగ‌ల‌ను’’ అని అన్నారు.

‘‘పార్ల‌మెంట్ దేశానికి విధాన‌ప‌ర‌మైన శాస‌నాల‌ను రూపొందిస్తుందే త‌ప్ప ప్ర‌జ‌ల‌కు అవ‌స‌ర‌మైన చిన్న చిన్న స‌మ‌స్య‌ల‌పై నిర్ణ‌యాలు చేయ‌దు. ప్ర‌జ‌ల‌కు సంబంధించిన ముఖ్య‌మైన స‌మ‌స్య‌ల‌ను స్థానిక సంస్థ‌లు, రాష్ట్రాలు, శాస‌న‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలోనే ప‌రిష్కారమ‌వుతాయి. నేను చేసే తుది డిమాండ్‌.. చూపించే ప‌రిష్కారం... జ‌నాభా నియంత్ర‌ణ‌కు సంబంధించి ద‌క్షిణాది రాష్ట్రాలను శిక్షించే విధానానికి కేంద్రం స్వ‌స్తి చెప్పాలి... దేశ నిర్మాణంలో 1975 నుంచి 2025 వ‌ర‌కు 50 ఏళ్ల పాటు మ‌నం అందించిన సేవ‌ల‌కు మ‌న‌ల్ని అభినందించాలి. మ‌న‌కు వెన‌క్కి కొంత చెల్లించాలి. జ‌నాభా దామాషా ప్రాతిపదిక‌న చేసే పున‌ర్విభ‌జ‌న చేప‌ట్టొద్ద‌ని ద‌క్షిణాది రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి.. లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించి దేశంలోని ఇత‌ర రాష్ట్రాలతో సంబంధం లేకుండా చిన్న రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సీట్ల‌ను ఏర్పాటు చేసిన‌ట్లే ద‌క్షిణాదికి అవ‌కాశం ఇవ్వాలి’’ అని విజ్ఞప్తి చేశారు.

‘‘మంచి ప్ర‌గ‌తి సాధించిన ద‌క్షిణాది రాష్ట్రాల‌కు పార్ల‌మెంట్ సీట్లలో మంచి వాటా ఇవ్వ‌డం ద్వారా ఇత‌ర రాష్ట్రాలు ఆర్థిక వృద్ది, సుప‌రిపాల‌న‌పై దృష్టి సారించేలా చేయాలి. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ బీజేపీ పున‌ర్విభ‌జ‌న ప్ర‌క్రియ చేప‌ట్టాల‌నుకుంటే నా ప్ర‌ధాన డిమాండ్ ఇదే. 543 సీట్లు ఉన్న లోక్‌స‌భ‌లో ప్ర‌స్తుతం ద‌క్షిణాది రాష్ట్రాల సీట్ల సంఖ్య 130.. ఇది మొత్తం సీట్ల‌లో 24 శాతం.. పున‌ర్విభ‌జ‌న త‌ర్వాత ఏర్ప‌డే నూత‌న లోక్‌స‌భ‌లో మాకు 33 శాతం సీట్లు ఇవ్వాల‌నేది ద‌క్షిణాది రాష్ట్రాలుగా మా డిమాండ్‌. బీజేపీ 50 శాతం సీట్ల‌ను పెంచాల‌నుకుంటే అలా పెరిగే 272 సీట్ల‌తో మొత్తం లోక్ స‌భ సీట్ల సంఖ్య 815 అవుతుంది. ఇందులో ద‌క్షిణాది రాష్ట్రాల‌కు 33 శాతం అంటే 272 సీట్లు ఇవ్వాలి...ఈ సీట్ల‌ను ద‌క్షిణాదిలోని త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌, కేర‌ళ‌, తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, పుదుచ్చేరిల‌కు ఇప్పుడున్న‌ ప్రొరేటా ప్రాతిప‌దిక‌న పంచ‌వ‌చ్చు’’ అని అన్నారు.

‘‘దేశంలో మిగిలిన సీట్ల‌ను ఉత్త‌రాది, ఇత‌ర రాష్ట్రాల‌కు కేంద్రం త‌మ అభిమ‌తం మేర‌కు పంచ‌వ‌చ్చు.. అనుకున్న దానికంటే ద‌క్షిణాది రాష్ట్రాల‌కు సీట్ల సంఖ్య త‌గ్గిస్తే అది దేశ రాజ‌కీయ రంగంపై ప్ర‌తికూల ప్ర‌భావం చూపుతుంది. ద‌క్షిణాదిలోని అన్ని రాష్ట్రాలు, రాజ‌కీయ పార్టీలు మ‌న విభేదాల‌ను విస్మ‌రించి పున‌ర్విభ‌జ‌న‌లో మ‌న వాటా ద‌క్కించుకునేందుకు ఐక్యంగా పోరాడాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నా. పున‌ర్విభ‌జ‌న ప్ర‌క్రియ‌పై మా రాష్ట్ర శాస‌న‌స‌భ‌లో త్వ‌ర‌లోనే తీర్మానం ఆమోదిస్తాం... మేం మా రాష్ట్రంలో ఎలా చేస్తున్నామో మీ మీ రాష్ట్రాల్లోనూ అలానే చేయాల‌ని స‌హ‌చ‌ర ముఖ్య‌మంత్రులు, ఇత‌ర నాయ‌కులకు విజ్ఞ‌ప్తి చేస్తున్నా.. ద‌క్షిణ భార‌త‌దేశ పౌరుల గ‌ళాన‌ని బ‌లంగా, ఐక్యంగా మొత్తం భార‌త దేశానికి వినిపిద్దాం. పున‌ర్విభ‌జ‌న ప్ర‌క్రియ‌పై త‌ర్వాత స‌మావేశాన్ని హైద‌రాబాద్‌లో నిర్వ‌హిస్తాను.. మ‌న పోరాటాన్ని ఏవిధంగా ముందుకు తీసుకెళ‌దామ‌నే విష‌యాన్ని ఆ స‌మావేశంలో చ‌ర్చిద్దాం.... ఈ పోరాటంలో ప్ర‌జ‌ల‌ను భాగ‌స్వామ్యం చేసేందుకు ఒక భారీ బ‌హిరంగ స‌భ‌ను నేను ఏర్పాటు చేస్తాను.. ద‌క్షిణ భార‌త‌దేశానికి చెందిన అన్న‌త‌మ్ముళ్లు.. అక్కా చెల్లెళ్లంతా క‌లిసి వ‌చ్చి.. మ‌న హ‌క్కుల ర‌క్ష‌ణ‌కు క‌లిసి రావాల‌ని నేను విజ్ఞ‌ప్తి చేస్తున్నా’’ అని పేర్కొన్నారు.

Tags:    

Similar News