దశాబ్ది వేడుకలకు ముస్తాబవనున్న ట్యాంక్ బండ్

తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలకు వేడుకలకు ట్యాంక్ బండ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ట్యాంక్ బండ్ ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది.

Update: 2024-05-30 14:14 GMT

తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలకు వేడుకలకు ట్యాంక్ బండ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ట్యాంక్ బండ్ ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశాలతో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు మొదలుపెట్టారు. జూన్ 2 సాయంత్రం ట్యాంక్ బండ్ పై పండుగ వాతవరణాన్ని తలపించేలా ముస్తాబు చేస్తున్నారు. ట్యాంక్ బండ్ పరిసరాలను రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించనున్నారు.

సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్న నేపథ్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అవతరణ వేడుకలలో సామాన్య ప్రజలు కూడా ఉత్సాహంగా తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని ఆనందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. సందర్శకులను ఆకట్టుకునే ప్రదర్శనలు, ఆట వస్తువులు, ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు పై అధికారులు ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నారు.  రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన పలు సాంస్కృతిక కళా బృందాలచే కార్నివాల్ ప్రదర్శనలు జరిపేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

ప్రధాన వేదిక పై పలు శాస్త్రీయ, జానపద, దక్కనీ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతం 'జయ జయహే తెలంగాణ' పై పోలీసు సిబ్బంది తో ప్రదర్శన నిర్వహించనున్నారు. బాణాసంచాలు పేలుస్తూ ఉత్సవ వాతవరణాన్ని అణుభూతి పొందేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ట్యాంక్ బండ్ పై దాదాపు 80 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో రాష్ట్రంలోని హస్త కళలలు, స్వయం సహాయక బృందాలు తయారు చేసే వస్తువులు, చేనేత ఉత్పత్తులు, నగరం లోని పలు ప్రముఖ హోటళ్ళచే ఫుడ్ కోర్టులు ఉండనున్నాయి.

ట్యాంక్ బండ్ ఏర్పాట్లు సమీక్షించిన ఉన్నతాధికారులు..

ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లను పలు విభాగాల ఉన్నతాధికారులు ట్యాంక్ బండ్ వేదిక వద్ద పరిశీలించారు. వేదిక అలంకరణ, వేడుకలకు హాజరయ్యే అతిధిలకు, పాల్గొనే ప్రజలకు సీటింగ్ , బ్యారికేడింగ్, పార్కింగ్, త్రాగు నీటి సరఫరా, విద్యుత్ సరఫరా, పోలీస్ బందోబస్తూ తదితర ఏర్పాట్లపై సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రజాప్రతినిధులకు, ఉన్నతాధికారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని క్షేత్ర స్థాయి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. సభా ప్రాంగణంలో ప్రత్యేక మెడికల్ క్యాంపులు, మోబైల్ టాయిలెట్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఎల్ఈడీ స్క్రీన్ లతో, కార్యక్రమ లైవ్ ప్రసారానికి ఏర్పాట్లు చేస్తున్నారు.


Tags:    

Similar News