బీజేపీపై బనకచర్ల ఎఫెక్ట్ తప్పదా ?

హరీష్ పోరు పడలేకే తెలంగాణ ప్రభుత్వం ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం కూడా నిర్వహించింది;

Update: 2025-06-19 10:08 GMT
Telangana BJP President and Central Minister Gangapuram Kishan Reddy

ముందు నుయ్యి..వెనుక గొయ్యి అనే సామెత తెలుగులో చాలా పాపులర్. ఏపీ-తెలంగాణ తాజా వివాదం బనకచర్ల ప్రాజెక్టు విషయంలో తెలంగాణ బీజేపీ పరిస్ధితి సరిగ్గా అలాగే ఉంది. విషయం ఏమిటంటే ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం విషయంలో దూకుడుమీదుంది. ఏపీ ప్రభుత్వం అంటే టీడీపీ-జనసేన+బీజేపీ కలిసిన ఎన్డీయే ప్రభుత్వం అని అందరికీ తెలిసిందే. ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రంలోని నరేంద్రమోదీ(Narendra Modi) ప్రభుత్వం వేగంగా అనుమతులు ఇస్తోందంటే అందుకు కారణం అధికారంలో బీజేపీ భాగస్వామిగా ఉండటమే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఇదే సమయంలో తెలంగాణలో మంటలు మొదలయ్యాయి. ఏపీ ప్రభుత్వం నిర్మిచబోతున్న బనకచర్ల(Banakacharla Project) వల్ల తెలంగాణకు తీరని నష్టం తప్పదని బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు(Harish Rao) నానా రచ్చచేస్తున్నారు. ప్రతిరోజు హరీష్ ఈప్రాజెక్టు విషయంలో రేవంత్ రెడ్డి, చంద్రబాబునాయుడును టార్గెట్ చేస్తు పదేపదే ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోతున్నారు. హరీష్ పోరు పడలేకే తెలంగాణ ప్రభుత్వం ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం కూడా నిర్వహించింది.

ఆల్ పార్టీ సమావేశం తర్వాత రేవంత్(Revanth) మాట్లాడుతు బనకచర్ల ప్రాజెక్టు పాపం అంతా కేసీఆర్ దే అని మండిపోయాడు. అధికారంలో ఉన్నపుడు రాయలసీమ అభివృద్ధికి, గోదావరి జలాల తరలింపుకు హామీలిచ్చిన ఫలితంగానే ఇపుడు చంద్రబాబు(Chandrababu Naidu) బనకచర్లను కట్టడానికి సిద్ధపడుతున్నట్లు చెప్పాడు. మీడియా సమావేశంలో రేవంత్ కృష్ణా, గోదావరి నీరు, మిగులు, వరదజలాల గురించి చాలానే మాట్లాడాడు. హోలు మొత్తంమీద చెప్పింది ఏమిటంటే అధికారంలో ఉన్నపుడు కేసీఆర్ ఏపీ ప్రయోజనాలపై అంగీకరించటం వల్లే ఇపుడు తెలంగాణకు అన్యాయం జరుగుతోందని. సరే ఈవిషయాన్ని పక్కనపెడితే గమనించాల్సిన మరో ఫ్యాక్టరుంది. అదేమిటంటే రెండు రాష్ట్రాలమధ్య బీజేపీ(Telangana BJP) నలిగిపోతోంది.

ఏపీ నిర్మించబోతున్న బనకచర్లను బీజేపీ ఆమోదించలేందు అలాగని తీవ్రంగ వ్యతిరేకంచనూ లేందు. ఎందుకంటే ఏపీ ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగస్వామే. ఇదేసమయంలో ఈప్రాజెక్టు ద్వారా తెలంగాణకు నిజంగానే అన్యాయం జరుగుతుంటే చూస్తు ఊరుకోలేకపోతోంది. అలాగని ప్రాజెక్టును గట్టిగా వ్యతిరేకిస్తోందా అంటే అదీలేదు. ఎందుకంటే తెలంగాణలో బనకచర్లను వ్యతిరేకిస్తే ఏపీలో దాని ప్రభావం పడుతుందనే భయం వెంటాడుతోంది. అసలే ఏపీలో బీజేపీ పరిస్ధితి అంతంతమాత్రంగానే ఉంది. పోనీ ప్రాజెక్టును చూసీ చూడనట్లు వదిలేద్దామా అంటే తెలంగాణలో కూడా ఇబ్బందులు తప్పేట్లులేదు. ఈప్రాజెక్టుపై పెరిగిపోతున్న మాటలమంటల్లో బీఆర్ఎస్-కాంగ్రెస్ ఆరోపణలు- ప్రత్యారోపణలు, విమర్శలు-ప్రతి విమర్శలతో తెలంగాణ రాజకీయం హీటెక్కిపోతోంది. ఈ మొత్తంలో బీజేపీ నేతల గొంతే వినబడటంలేదు.

ఏపీ ప్రాజెక్టు నిర్మించబోతున్నది అంటేనే కేంద్రం మద్దతు ఉన్నట్లే కదా. కేంద్రం మద్దతిచ్చిన బనకచర్లకు వ్యతిరేకంగా మాట్లాడేందుకు తెలంగాణలో కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి(Kishan Reddy), బండి సంజయ్ తో పాటు మిగిలిన ఎంపీలు, ఎంఎల్ఏలు ధైర్యం చేయలేకపోతున్నారు. అందుకనే ప్రాజెక్టుపై కిషన్ మాట్లాడుతు ‘బనకచర్లకు కేంద్రం ఇంకా అనుమతులు ఇవ్వలేదు, ప్రాజెక్టు వల్ల తెలంగాణకు అన్యాయం జరగనివ్వము’ అంటు సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. అఖిలపక్ష సమావేశంలో బీజేపీతరపున ఎంపీలు డీకే అరుణ, రఘునందనరావు పాల్గొన్నప్పటికీ తర్వాత మీడియాతో ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయారంటేనే అర్ధమవుతోంది బీజేపీ నేతల పరిస్ధితి.

ప్రాజెక్టును వ్యతిరేకిస్తే ఏపీలో సమస్య, మద్దతుగా మాట్లాడితే తెలంగాణలో సమస్యగా మారిపోయింది బీజేపీ పరిస్ధితి. అందుకనే ఏమిచేయాలో దిక్కుతోచక బహిరంగంగా మాట్లాడటానికి కమలంపార్టీ నేతలు ఇష్టపడటంలేదు. బీజేపీ నేతల ప్రస్తుత స్టాండ్ వల్ల దీర్ఘకాలంలో రెండురాష్ట్రాల్లోను పార్టీకి లాభమా లేకపోతే నష్టమా అని కూడా తేల్చుకోలేకపోతున్నారు. మంటలుమండిస్తున్న బనకచర్ల ప్రాజెక్టుపై కిషన్ రెడ్డి ఢిల్లీలో తెరవెనుక పాత్రకే పరిమితమైన విషయం అర్ధమైపోతోంది. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్ తో రేవంత్ భేటీ ముందే కిషన్ వెళ్ళి కలిశారు. అయితే కేంద్రమంత్రి భేటీలో మాట్లాడిన విషయం ఏమిటో కూడా మీడియతో చెప్పలేదంటేనే బీజేపీ నేతలు ఎంతగా నలిగిపోతున్నారో అర్ధమైపోతోంది.

Tags:    

Similar News