కబుర్ల దేవత' పుస్తకానికి కేంద్ర సాహిత్య అవార్డు
మైరావణ ' ను వరించిన యువ పురస్కారం;
తెలుగులో గంగిశెట్టి శివకుమార్ రాసిన 'కబుర్ల దేవత' పుస్తకాన్ని కేంద్ర సాహిత్య అవార్డు వరించింది. ప్రసాద్ సూరి రాసిన 'మైరావణ' సాహిత్య యువ అవార్డుకు ఎంపికైంది.
యువ, బాల సాహిత్య అవార్డులను బుధవారం కేంద్ర సాహిత్య అకాడమీ (The National Sahitya Akademi) అవార్డ్స్ ప్రకటించింది. యువ పురస్కారాల జాబితాలో 23 మంది యువ రచయితల పేర్లను ప్రకటించింది. ఇందులో ఇంగ్లీషు రచయిత అద్వైత్ కొట్టారి, హిందీ కవయిత్రి పార్వతి తిర్కీ కూడా ఉన్నారు. ఈ పురస్కారాలు 23 భాషల రచయితలకు అందనుండగా, డోగ్రీ భాషకు ఈ సంవత్సరం యువ పురస్కారం ఇవ్వడం లేదని అకాడమీ తెలిపింది.
అకాడమీ అధ్యక్షుడు మాధవ్ కౌశిక్ నేతృత్వంలోని కార్యనిర్వాహక మండలి, జ్యూరీ సిఫార్సుల ఆధారంగా రచయితల ఎంపిక జరిగినట్లు సాహిత్య అకాడమీ పేర్కొంది.
ఇక బాల సాహిత్య పురస్కారాల విషయానికి వస్తే 24 రచయితల పేర్లను అకాడమి వెల్లడించింది. ఇందులో ఇంగ్లీషులో నితిన్ కుశలప్ప MP రచించిన 'దక్షిణ్: సౌత్ ఇండియన్ మిత్స్ అండ్ ఫాబ్లెస్ రీటోల్డ్' , హిందీలో సుశీల్ శుక్లా రచించిన 'ఏక్ బేటీ బారా' ఎంపికయ్యాయి. విజేతలకు ఒక తామ్రపత్రంతో పాటు రూ.50,000 నగదును అందజేయనున్నారు.