డీజీపీ ముందు ముగ్గురు మావోల లొంగుబాటు
ప్రభుత్వం ఇచ్చిన పిలుపు అందుకుని మారాలని నిర్ణయించుకుని లొంగిపోయారన్న డీజీపీ.
మావోయిస్టు కీలక నేతలు ముగ్గురు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ముందు శుక్రవారం లొంగిపోయారు. జనజీవన స్రవంతిలో కలవడానికే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ విషయాన్ని శివధర్ రెడ్డి ప్రకటించారు. వారికి ఆర్థిక సహాయం అందించినట్లు చెప్పారు. కుంకటి వెంకటయ్య అలియాస్ వికాస్, మొగిలిచర్ల వెంకట్రాజు అలియాస్ చందు, తోడెం గంగ అలియాస్ సోనీ(ఛత్తీస్గఢ్) లొంగిపోయారని, వారు జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారని శివధర్ రెడ్డి వివరించారు. వీరు ముగ్గురూ మావోయిస్ట్ రాష్ట్ర కమిటీ నాయకులని తెలిపారు. ‘‘సిద్దిపేటకు చెందిన కుంకటి వెంకటయ్య 1990లో పీడబ్ల్యూడీ ఏర్పాటు చేసిన రైతు కూలీ సభలకు హాజరై.. అదే ఏడాది అజ్ఞాతంలోకి వెళ్లారు. పిడబ్ల్యూడీ కమాండర్ బాలన్న ఆధ్వర్యంలో దళంలో చేరారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి 35 ఏళ్లుగా వివిధ హోదాల్లో పనిచేశారు. ప్రభుత్వం ఇచ్చిన పిలుపు అందుకుని మారాలని నిర్ణయించుకుని లొంగిపోయారు’’ అని వివరించారు.
‘‘హనుమకొండ జిల్లా ధర్మసాగరం మండలం తాటికాయల గ్రామానికి చెందిన మొగిలిచర్ల వెంకటరాజు.. 11 ఏళ్ల వయసులో విప్లవగీతాలకు ఆకర్షితుడై మావోయిస్ట్ ఉద్యమంలో చేరారు. 1993లో సర్సంపేట దళంలో రిక్రూట్ అయి రాష్ట్రస్థాయి కమిటీలో వివిధ హోదాల్లో పనిచేశారు. మావోయిస్టులతో వచ్చిన సైద్దాంతిక విభేదాల కారణంగా, పోలీసులు ఇచ్చిన పిలిపు మేరకు అతని భార్య తోడెం గంగతో కలిసి పోలీసుల ఎదుట లొంొగిపోయారు’’ అని చెప్పారు. ఇటీవల కాలంలో దాదాపు 403 మంది మావోలు పోలీసుల ముందు లొంగిపోయినట్లు తెలిపారు.