చేతులు కలిపిన బీఆర్ఎస్, కాంగ్రెస్..!

బనకచర్లపై టార్గెట్ బీజేపీనే. మంత్రులు ఏం చేస్తున్నారంటూ నిలదీత.;

Update: 2025-06-06 11:41 GMT

తెలంగాణ రాజకీయ సమీకరణాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. శత్రువుకు శత్రువు మిత్రువు అన్న దాన్ని బీఆర్ఎస్, కాంగ్రెస్ తూచా తప్పకుండా ఆచరిస్తున్నాయి. రెండు పార్టీలు చేతులు కలిపినట్లు.. బీజేపీ టార్గెట్‌ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ టార్గెట్ బీజేపీగానే ఉంది. కోడిపిల్లను గద్ద తన్నుకుపోయినట్లు తెలంగాణ నీటిని ఏపీ తన్నుకుపోతుంటే తెలంగాణ బీజేపీ నేతలు, కేంద్రంలోని బీజేపీ మంత్రులు ఏం చేస్తున్నారని నిలదీశారు. తాజాగా ఈ అంశంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు, కాంగ్రెస్ నేత, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. నీటి విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయానికి బీజేపీ నేతల చేతకానితనమే కారణమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు బీజేపీ నేతలకు పట్టవా? అని హరీష్ రావు నిలదీశారు. అదే విధంగా ఇటీవల ఢిల్లీ వేదికగా నిర్వహించిన నీతి అయోగ్ సమావేశంలో బనకచర్ల అంశంపై ప్రధాని మోదీని ఎందుకు ప్రశ్నించలేదని హరీష్ రావు నిలదీశారు. అదే విధంగా ఈ విషయంపై ఉన్నతస్థాయి కమిటీ సమావేశం ఎందుకు నిర్వహించడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు గోదావరి-బనకచర్ల ప్రాజెక్ట్‌పై తెలంగాణ బీజేపీ నేతలు ఎందుకు మౌనముద్ర దాల్చారో అర్థం కావట్లేదని, వాళ్లే స్పష్టత ఇవ్వాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు.

ట్రిబ్యునల్‌కు వ్యతిరేకంగా ప్రాజెక్ట్: ఉత్తమ్

‘‘ట్రిబ్యునల్ అవార్డులకు విరుద్ధంగా ఏపీ సర్కార్.. గోదావరి-బనచర్ల ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. బనకచర్ల తో తెలంగాణ కు అన్యాయం జరుగుతుంది. grmb, cwc ,అపెక్స్ కౌన్సిల్ నిబంధనలకు బనకచర్ల విరుద్దం. అంతర్రాష్ట్ర జలవిధానానికి విరుద్ధంగా బనకచర్ల. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ అంగీకరించదు. నిర్మల సీతారామన్ కు లేఖద్వారా వివరించాము. జనవరి 22 న జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ కు లేఖ రాశాను. మాకు ఏపి నుండి ఎలాంటి ప్రతిపాదన రాలేదని.. వస్తే అన్ని నిబంధనలను పరిశీలిస్తామని.. మే నెలలో తెలంగాణకు పాటిల్ లేఖ రాశారు. చట్టప్రకారం ముందుకు వెళతామని పాటిల్ మాకు హామీ ఇచ్చారు. ఏపీ ఉల్లంఘనలను పూర్తిగా లేఖల్లో సవివరంగా వివరించాం’’ అని తెలిపారు.

‘‘కేంద్రం .. చట్ట విరుద్ధంగా.. ఏపీకి సహకరిస్తుందని అనుకోవడం లేదు. తెలంగాణ కు అన్యాయం జరిగితే.. ఎంత వరకైనా పోరాడుతాం. తెలంగాణ నీటి హక్కులకోసం రాజీలేని పోరాటం చేస్తాం.. వెనక్కి తగ్గేదేలే. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి లు కేంద్రాన్ని ఒప్పించాలి. కృష్ణాలో అన్యాయం జరుగుతుంటే పదేళ్లు బి ఆర్ ఎస్ సహకరించింది. ఉమ్మడి ఏపీలో తెలంగాణ వాటా 724tmc … ఏపీకి వెళితే.. బీఆర్ఎస్ హయాంలో 1254 టీఎంసీ లు కృష్ణా నీళ్లు తరలించారు. కాళేశ్వరంలో జరిగిన వృధా ఖర్చును చేయకుంటే.. కృష్ణా ప్రాజెక్టులు అన్ని పూర్తి అయ్యేవి. తొమ్మిది హట్టి దగ్గర కాకుండా..మేడిగడ్డ వద్ద కట్టడం ద్వారా 68 వేల కోట్లు కాళేశ్వరం అదనపు ఖర్చు అయ్యింది. కృష్ణా లో తెలంగాణకు అన్యాయం చేసింది బీఆర్‌ఎస్. 512 tmc ఏపీకి.. తెలంగాణకు 299 tmc చాలు అని సంతకం పెట్టింది బి ఆర్ ఎస్ ప్రభుత్వం కదా..? అప్పుడు మోసం చేసి.. ఇప్పుడు నాటకాలు ఆడుతున్నారు బిఆరెస్ నేతలు’’ అని మండిపడ్డారు.

బనకచర్లను ఆపుతాం: హరీష్ రావు

‘‘ఏపీ ప్రభుత్వం చేపట్టాలనుకుంటున్న బనకచర్ల ప్రాజెక్ట్‌ను సుప్రీంకోర్టుకు వెళ్లయినా అడ్డుకుంటాం. ఎలాంటి అనుమతులు లేకపోయినా ఏపీకి కేంద్రం నిధులిస్తోంది. మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి కొన్ని లేఖలు రాసి చేతులు దులిపేసుకున్నారు. శ్రీశైలం కుడి కాల్వ లైనింగ్ పనులు జరుగుతున్నా.. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకొని వెళ్లమన్నా స్పందించట్లేదు. శ్రీశైలం కుడి కాల్వ లైనింగ్ పనులను వెంటనే ఆపేయాలి. బనకచర్లపై రాష్ట్ర బీజేపీ నేతలు ఎందుకు నోరు మెదపట్లేదు? గోదావరి జలాలపై తెలంగాణ శాశ్వతంగా హక్కు కోల్పోయే ప్రమాదం ఉంది. శ్రీశైలం కుడి కాల్వ లైనింగ్ పనులు పూర్తయితే రోజుకు 90వేల క్యూసెక్కుల నీటిని ఏపీకి తీసుకెళ్తారు. అదే జరిగితే హైదరాబాద్‌కు తాగడానికి చుక్క నీరు కూడా ఉండదు. కేఆర్ఎంబీ కళ్లు మూసుకుని ఏపీకి దాసోహమంటోంది’’ అని విమర్శలు గుప్పించారు.

తూతూ మంత్రంగా విమర్శలు

అయితే బీజేపీ టార్గెట్‌ ఉత్తమ్, హరీష్ ఇద్దరూ విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే ఉత్తమ్ కుమార్.. బీఆర్ఎస్‌పై, హరీష్ రావు కాంగ్రెస్, ఉత్తమ్‌పై విమర్శలు చేశారు. కానీ అవి నామమాత్రంగానే ఉండటం గమనార్హం. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోకపోతే బాగోదు అన్న మొహమాటానికే వాళ్లు విమర్శలు చేసుకున్నట్లు ఉందని కొందరు విశ్లేషకులు అంటున్నారు. బీజేపీని చేసినంత టార్గెట్.. ఒకరిని ఒకరు చేసుకోలేదని చెప్తున్నారు. దీనిని చూస్తుంటే కాంగ్రెస్, బీఆర్ఎస్‌ చేతులు కలిపేశాయని కొందరు విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇదొక మంచి పరిణామం..!

కాగా మరికొందరు మాత్రం బనకచర్ల విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు కలిసినట్లు బీజేపీపై విమర్శలు గుప్పించడం ఒక మంచి పరిణామం అని అంటున్న విశ్లేషకులు కూడా ఉన్నారు. దేశ రాజకీయాల్లో తమిళనాడుకు చాలా ప్రత్యేక స్థానం ఉంది. అందుకు కారణం వాళ్లు రాష్ట్రంలో ఎంత కొట్టుకున్నా.. రాష్ట్ర సమస్య అంటే అంతా ఒక్కటవుతారు. అదే విధంగా ఇప్పుడు బనకచర్ల ప్రాజెక్ట్ అనేది తెలంగాణకు సమస్య కావొచ్చు. ఈ విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ తమ మధ్య సిద్దాంత పరమైన, రాజకీయ విభేదాలను పక్కనబెట్టి రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడటం మంచి పరిణామమే అని కొందరు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News