తెలంగాణలో కల్తీ ఆహారం కేసుల్లో దోషులపై చర్యలేవి?

తెలంగాణలో పోలీసులు నమోదు చేసిన ఆహార కల్తీ కేసులు కోర్టుల్లో వీగిపోతున్నాయి.ఆహార కల్తీ చేసినా వారిపై చర్యలు తీసుకోవడం లేదు.;

Update: 2025-06-24 12:34 GMT
కల్తీ పాల విక్రయంపై పోలీసుల కేసు (ఫైల్ ఫొటో)

తెలంగాణలో ఆహార కల్తీపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నా నిందితులపై చర్యలు తీసుకోవడం లేదు. ఆహార కల్తీ కేసులను వాపసు తీసుకోవడంతో నామమాత్రపు జరిమానాలతో సరిపెడుతున్నారు. మొదట కేసులు నమోదు చేసి, ఆపై పోలీసులతో కుమ్మక్కై కేసును వాపసు తీసుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో హైదరాబాద్ నగరంలో ఆహార కల్తీకి తెరపడటం లేదు.


ఆహార కల్తీ నిరోధానికి చట్టాలు...
తెలంగాణ రాష్ట్రంలో ఆహార‌క‌ల్తీ ప్ర‌జ‌ల‌కు పెద్ద ఆరోగ్య‌ స‌మ‌స్య‌గా త‌యారైంది. క‌ల్తీని అరిక‌ట్ట‌డానికి కేంద్రం ఆహార‌భ‌ద్ర‌తా చ‌ట్టాన్ని తీసుకువచ్చారు.అదీకాక భార‌త న్యాయ స‌న్నిహిత 2023 చ‌ట్టంలో కూడా ఆహార‌క‌ల్తీపై చ‌ర్య‌ల‌కు వీలుంది.సెక్ష‌న్ 59 (iii) ఆహార‌క‌ల్తీ చ‌ట్టం ప్ర‌కారం క‌ల్తీ చేసిన వారికి ఆరు సంవ‌త్స‌రాల జైలు శిక్ష, ఐదు ల‌క్ష‌ల రూపాయల వ‌ర‌కు జ‌రిమానా విధించవ‌చ్చు. ఇక ఐ.పి.సి సెక్ష‌న్‌లు 420, 272, 273 ప్ర‌కారం ఆరు నెల‌ల నుంచి ఏడు సంవ‌త్స‌రాల వ‌ర‌కు జైలు శిక్ష విధించవ‌చ్చు.

ఆహార కల్తీపై పోలీసుల దాడులు
తెలంగాణ రాష్ట్ర పోలీసులు కూడా ఫుడ్ ఇన్ స్పెక్ట‌ర్లు మాదిరిగా త‌ర‌చుగా దాడులు జ‌రిపి కేసులు బుక్‌ చేస్తున్నారు. ఈ విష‌యాన్ని ప్ర‌సార మాధ్య‌మాల్లో పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌ర‌గ‌డంతో ప్ర‌జ‌లు ఆహార క‌ల్తీపై క‌ట్ట‌డి జ‌రుగుతుంద‌ని భావిస్తున్నారు. అయితే జ‌రుగుతున్న‌ది అంత ఆశాజ‌న‌కంగా లేదు.ఆహార కల్తీ చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం లేదని ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ ప‌రిశీల‌నలో వెల్లడైంది.

వీగిపోతున్నఆహార కల్తీ కేసులు
రాష్ట్రంలో న‌మోదైన కేసుల ప‌రిస్థితిని ప‌రిశీలించ‌గా ఆందోళ‌న‌క‌ర‌మైన విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. ఆహార కల్తీపై న‌మోదైన కేసుల్లో కొన్ని త‌ప్పుగా కేసు జ‌రిగింద‌ని వాప‌సు తీసుకోవ‌డం లేదా కోర్టులో వీగిపోవ‌డం జరిగింది.ఇంకా కొన్ని సంద‌ర్భాల్లో కోర్టులో కేసు న‌డుస్తుండ‌గా ఆపివేయ‌డం లేదా అతి మామూలు శిక్ష వేయ‌డం జ‌రుగుతుంది.

ఆహార కల్తీలో నిందితులపై చర్యలేవి?
- హైదరాబాద్ నగరంలో మ‌హ్మ‌ద్ అర్ష‌ద్ అనే వ్య‌క్తి ఆహార‌క‌ల్తీ జ‌రిపినందుకు 420, 272,273 తో పోలీసులు కేసు నంబరు (184/2017) సైఫాబాద్ టౌన్‌లో కేసు న‌మోదు చేశారు.అయితే కొంత‌కాలం త‌రువాత కేసు త‌ప్పుగా న‌మోదు జ‌రిగింద‌ని కేసు మూసివేశారు.
- ముషీరాబాద్ ఠాణాలో క్రైమ్ నంబ‌రు 100/2016 ద్వారా సెక్ష‌న్ 420, 272,273 ఐ.పి.సి. ల కింద ఆహార కల్తీపై కేసు న‌మోదై ఆరు సంవ‌త్స‌రాలల త‌రువాత 2022వ సంవత్సరంలో కేసును కోర్టు కొట్టివేసింది.
- ముషీరాబాద్ ఠాణాలో సెక్ష‌న్ 272,273, 336 ఐ.పి.సి., సెక్ష‌న్ 59 ఆహార‌భ‌ద్ర‌తా చ‌ట్టం కింద కేసు న‌మోదు చేశారు. త‌ర్వాత కేవలం వందరూపాయల జ‌రిమానాతో స‌రిపుచ్చారు.
-ముషీరాబాద్ ఠాణాలో 420, 272, 273 ఐ.పి.సి. సెక్షన్ల కింద కేసు న‌మోదు చేసి 2 రోజుల జైలు శిక్ష, 500 రూపాయల జ‌రిమానాతో స‌రిపుచ్చారు.

పోలీసులు కేసులు నమోదు చేసినా...
పోలీసులు ఆరంభంలో ఆర్భాటంగా ఆహార కల్తీపై చాలా కేసులు న‌మోదు చేయ‌డం, త‌రువాత వ‌ద‌లి పెట్ట‌డం లేదా చిన్న‌పాటి శిక్ష‌తో స‌రిపుచ్చ‌డం జ‌రుగుతుంది. పోలీసుఅధికారులు క‌ల్తీ నేర‌స్థుల‌తో కుమ్మ‌క్కైనార‌నే ఆరోపణలు వ‌స్తున్నాయి.ఆహార‌క‌ల్తీతో ప్ర‌జ‌ల ఆరోగ్యం పై చాలా ప్ర‌భావం ప‌డుతుంది.

ఆహార కల్తీ కేసుల్లో దోషులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోండి
ఆహార కల్తీ కేసుల్లో దోషులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ అధ్య‌క్షులు యం ప‌ద్మ‌నాభ‌రెడ్డి ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డిని కోరారు. ఈ మేరకు ఆయన సీఎంకు మంగళవారం లేఖ రాశారు. ముఖ్య‌మంత్రి న‌మోదైన ఆహార కల్తీ కేసుల ప‌రిశీల‌న చేసి, ప్రాసిక్యూటింగ్ అధికారులు శ్ర‌ద్ధ తీసుకొని దోషుల‌కు శిక్ష ప‌డేట‌ట్లు చూడాల‌ని పద్మనాభరెడ్డి కోరారు.అలాగే ఆహార కల్తీ కేసులు త్వ‌రితగ‌తిన విచారణ చేసేలా ఆహారక‌ల్తీ కేసుల‌ కోసం ఒక ప్ర‌త్యేక న్యాయ‌స్థానాన్ని నియ‌మించాల‌ని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సీఎంకు విన్నవించింది.

Tags:    

Similar News