హరీష్ రావు మౌనం దేనికి సంకేతం ?

కేసీఆర్ కు లేఖ రాసేముందు హరీష్ తో కవిత(Kavitha) భేటీ అయ్యిందనే ప్రచారం అందరికీ తెలిసిందే;

Update: 2025-05-29 09:05 GMT
Harish Rao

బీఆర్ఎస్ పార్టీలో నాలుగు పిల్లర్లుగా పాపురైన వారిలో తన్నీర్ హరీష్ రావు కూడా ఒకడు. మిగిలిన మూడు పిల్లర్లలో కేసీఆర్-కవిత-కేటీఆర్ మధ్య విభేదాలు రోడ్డునపడ్డాయి. నిజానికి ఈ ముగ్గరిమధ్య వివాదం కుటుంబకలహలుగానే చాలామంది చూస్తున్నారు. కుటుంబంలో కలహమే అయినా దాని ప్రభావం పార్టీపైన తీవ్రంగా పడటం మాత్రం ఖాయం. ఇలాంటి సమయంలో ‘ట్రబుల్ షూటర్’ (Trouble Shooter) గా పేరున్న హరీష్(Harish Rao) ఆరురోజులుగా మౌనంగా ఉంటున్నారు. ప్రతిరోజు మీడియాతో క్రమం తప్పకుండా మాట్లాడే హరీష్ ఇపుడు దూరంగా ఉంటున్నారు. కల్వకుంట్ల కుటుంబ వివాదంలో తనకు ఏమిటి సంబంధం అని దూరంగా ఉంటున్నారా ? అని అనుకునేందుకు కూడా లేదు. ఎందుకంటే కేసీఆర్(KCR) కు స్వయంగా హరీష్ మేనల్లుడు అవుతాడు కాబట్టి రక్తసంబంధం ఉన్నట్లే. అయినా ప్రస్తుత వివాదం తనకేమీ పట్టనట్లు హరీష్ ఉండటం వెనుక ఉద్దేశ్యం ఏమిటో ఎవరికీ అంతుపట్టడంలేదు.

పార్టీలో ఎక్కడ ఏ సమస్య తలెత్తినా దాన్ని చక్కదిద్దేందుకు కేసీఆర్ వెంటనే హరీష్ నే పంపుతారు. హరీష్ కూడా కేసీఆర్ ఆలోచనల ప్రకారమే సమస్య వచ్చిన జిల్లాలకు వెళ్ళి నేతలతో మాట్లాడి సర్దుబాటు చేసేవారు. అందుకనే పార్టీలో హరీష్ కు ట్రబుల్ షూటర్ అనే పేరుంది. అలాంటి వ్యక్తి పార్టీలో మూలస్ధంబాలైన కేసీఆర్ కొడుకు కేటీఆర్-కూతురు కవిత మధ్య వివాదం తలెత్తితే ఎందుకు మౌనంగా ఉన్నట్లు ? కేటీఆర్, కవిత మధ్య మొదలైన వివాదం బహుశా హరీష్ ఈపాటికే కేసీఆర్ తో మాట్లాడే ఉంటారన్న చర్చ పార్టీలో జరుగుతోంది. అయితే ఇద్దరి మధ్య చర్చల సారాంశం ఏమిటన్నది మాత్రం మూడో వ్యక్తికి తెలీదు. అందుకనే పార్టీ నేతల్లో హరీష్ మౌనంపై అనేక అనుమానాలు పెరిగిపోతున్నాయి. మేథావుల మౌనం సమాజానికి చాలా ప్రమాధకరమని పెద్దలు చెబుతుంటారు. అలాగే హరీష్ మౌనం పార్టీకి దెబ్బనే అనుకోవాలి.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కేసీఆర్ కు లేఖ రాసేముందు హరీష్ తో కవిత(Kavitha) భేటీ అయ్యిందనే ప్రచారం అందరికీ తెలిసిందే. తనతో చేతులు కలపమని హరీష్ రావును కవిత రిక్వెస్టు చేస్తే కుదరదుపొమ్మని చెప్పాడని ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమెంతో అబద్ధమెంతో తెలీదు కాని ప్రచారమైతే బాగా జరుగుతోంది. రాజకీయాల్లో జరిగే ప్రచారానికి చాలావాటికి ముందు కన్ఫర్మేషన్ దొరకదు. ఇపుడు తాజా వివాదమే తీసుకుంటే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అయిపోతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధి(Rahul Gandhi), రేవంత్ రెడ్డి(Revanth)తో పాటు మంత్రులు చాలా నెలల క్రితం ఆరోపించారు. అయితే అందుకు అవకాశంలేదని చాలామంది అనుకున్నారు. బీఆర్ఎస్ నేతలైతే రాహుల్, రేవంత్ పై మండిపడ్డారు. ఇదేసమయంలో బీజేపీ నేతలు కూడా రాహుల్, రేవంత్ ఆరోపణలు అబద్ధమని తేల్చేశారు. అయితే ఇపుడు కవిత ఏమిచెప్పింది. బీఆర్ఎస్-బీజేపీ విలీన ప్రయత్నాలు జరిగింది నిజమే అని కవిత చెప్పటం ఇపుడు సంచలనంగా మారింది. తాను జైలులో ఉన్నపుడే బీజేపీలో బీఆర్ఎస్ ను విలీనంచేయాలన్న మాటలు జరిగాయని చెప్పారు.

ఇపుడు విషయం ఏమిటంటే అన్నా, చెల్లెళ్ళ మధ్య పంచాయితీ సర్ధుబాటుకు హరీష్ కాకుండా ఎంపీ దామోదరరావు, గండ్ర మోహన్ రావును కవిత దగ్గరకు ఎవరు పంపించారు ? పై ఇద్దరు కవితతో చాలాసేపు రాయబారం నడిపారు కాబట్టి అందరు అధినేత కేసీఆరే పంపారని అనుకున్నారు. అయితే కవిత మాట్లాడుతు తనతో మాట్లాడిన వాళ్ళిద్దరినీ కేసీఆర్ పంపలేదని చెప్పటంతో అందరు ఆశ్చర్యపోయారు. కేసీఆర్ పంపకపోతే తమంతట తాముగా వాళ్ళిద్దరు కవితతో రాయబారం నడిపేంత సీనుందా అన్నదే ఆశ్చర్యంగా ఉంది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే హరీష్ తొందరలో తనవర్గంలోని ఎంఎల్ఏలతో కాంగ్రెస్ లో చేరిపోతారని బీజేపీ నేతలు పదేపదే చాలాకాలంగా చెబుతున్నారు. అందులో నిజమెంతుందో ఎవరికీ తెలీదుకాని కేసీఆర్ తో హరీష్ కు గ్యాప్ వస్తోందన్న మాట మాత్రం వాస్తవం. ఈ విషయాన్ని కేసీఆర్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన ఎంఎల్సీ దేశపతి శ్రీనివాస్ ఓపెన్ గానే టీవీ చర్చల్లో అంగీకరించారు. అలాగే కేటీఆర్(KTR) నాయకత్వంలో పనిచేయటానికి తాను సిద్ధంగా ఉన్నట్లు హరీష్ పదేపదే ప్రకటిస్తున్నారు. కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని ఇన్నిసార్లు ప్రకటిస్తున్నారంటేనే ఈ ఇద్దరి మధ్య ఏదో జరుగుతోందనే ప్రచారం పెరిగిపోయింది. దానికి తగ్గట్లే హరీష్ ఇంటికి మూడురోజులు వరుసగా కేటీఆర్ వెళ్ళి భేటీ అవటంతో చాలామందిలో అనుమానాలు పెరిగిపోయాయి.

జరుగుతున్న ప్రచారం ప్రకారం ఏదోరోజు పార్టీకి హరీష్ కు మధ్య గ్యాప్ వచ్చేస్తుందా ? అని అందరు అనుమానిస్తున్న నేపధ్యంలో ఊహించని రీతిలో కవిత-కేటీఆర్ మధ్య గ్యాప్ బయటపడింది. కవిత కేంద్రంగా బీఆర్ఎస్, తెలంగాణ రాజకీయాలు హటు హాటుగా నడుస్తున్నాయి. కల్వకుంట ఫ్యామిలిలో మొదలైన వివాదం బాగా రాజుకుంటున్నా హరీష్ రావు మాత్రం మౌనంగా అన్నింటినీ గమనిస్తున్నట్లుగా ఉండిపోయారు. ఎందుకింత మౌనంగా ఉండిపోయారు అన్న విషయమే ఎవరికీ అర్ధంకావటంలేదు. కవిత వైపునుండి వివాదం మొదలవ్వబోతోందని హరీష్ కు ముందే తెలుసా ? అన్న అనుమానాలు కూడా పెరిగిపోతున్నాయి.

ఇపుడు విషయం ఏమిటంటే పార్టీ అధినేత కేసీఆర్ పూర్తిగా ఫామ్ హౌస్ కే పరిమితమైపోయారు. కేసీఆర్ ఫామ్ హౌస్ వదిలి బయటకు రావటంలేదు, నేతలు ఎవరినీ తన దగ్గరకు రానీయటంలేదు. ఇక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అమెరికా టూరులో ఉన్నారు. కవితేమో పరోక్షంగా కేటీఆర్ పై యుద్ధం ప్రకటించి పార్టీలో మంటలు మండిస్తున్నారు. హరీష్ ఏమో మౌనంగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నారు. అందుకనే హరీష్ మౌనం దేనికి సంకేతమో తెలీక చాలామంది హాశ్చర్యపోతున్నారు.

Tags:    

Similar News