కేసీఆర్కు లేని బాధ కవితకెందుకు..?
నిరసనతో తనకు ఉన్న బలాన్ని నిరూపించుకోవాలని కవిత భావిస్తుందా?;
‘కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకో’ అని ఒక సామెత ఉంది. ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ నోటీసుల విషయంలో కేసీఆర్, కవిత విషయం కూడా అంతే ఉంది. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చింది. జూన్ 5న విచారణకు రావాలని తెలిపింది. అందుకు కేసీఆర్ కూడా సిద్ధమవుతున్నారు. తాజాగా కాళేశ్వరం కమిషన్ నోటీసులపై కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ను రాజకీయంగా దెబ్బతీసే దమ్ము లేకనే ఇలా నోటీసులు అంటూ ఇరకాటంలో పడేయాలని చూస్తున్నారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసులకు వ్యతిరేకంగా జూన్ 4న భారీ నిరసన నిర్వహించాలని ఫిక్స్ అయ్యారు. ఇందులో తెలంగాణ జాగృతి నేతలంతా పాల్గొని నిరసనను విజయవంతం చేయాలని కోరారు.
అయితే కాళేశ్వరం కమిషన్ నోటీసుల విషయంలో కేసీఆర్కు లేని బాధ కవిత ఎందుకో? అన్న చర్చ రాష్ట్రవ్యాప్తంగా మొదలైంది. అంతేకాకుండా జూన్ 5న కేసీఆర్ విచాణకు హాజరుకావాల్సి ఉంటే.. నాలుగో తేదీని నిరసన చేయయడం ఏంటని, అప్పటి వరకు ఎందుకు ఆగుతున్నట్లు అని కూడా మరికొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కమిషన్ నోటీసులను వ్యతిరేకించడం, ప్రభుత్వాన్ని నిలదీయడమే ఈ నిరసన ఉద్దేశం అయితే ఇప్పటి నుంచే ఎందుకు చేయట్లేదు? అని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో కవిత కావాలనే ఇలా వ్యవహరిస్తున్నారన్న చర్చ కూడా జరుగుతోంది.
నివేదిక ఇవ్వడానికి కేసీఆర్ రెడీ..
అయితే విచారణకు హాజరవడానికి కేసీఆర్ రెడీ అయ్యారు. అందుకోసమే అప్పటి మంత్రి, ఇంజినీర్లతో సమావేశమవుతూ పక్కా నివేదిక ఒకటి సిద్ధం చేసుకుంటున్నారు. దానిని జూన్ 5న జరిగే విచారణలో కమిషన్కు అందించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఈ సమయంలో విచారణకు వెళ్లాలని కేసీఆర్ డిసైడ్ అయిన తర్వాత కూడా కవిత ఇలా నిరసన బాట ఎందుకు పడుతున్నారు? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
తనను తాను కాపాడుకోవడం కోసమేనా..!
కవిత లేఖాస్త్రం తెలంగాణ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారింది. బీఆర్ఎస్లో భారీ బాంబ్లా మారింది. ఆమె లేఖతో పార్టీలో విభేధాలు బట్టబయలు అయ్యాయి. కల్వకుంట్ల కుటుంబంలో పదవి కోసం గొడవలు జరుగుతున్నాయని స్పష్టమైంది. ఈ క్రమంలో కేసీఆర్ను చూసే అందరూ ఆగుతున్నారు. ఒకవేళ గతంలో తనను విచారణ పేరుతో తీసుకెళ్లి అరెస్ట్ చేసినట్లు కేసీఆర్ను కూడా చేస్తే.. ఇక్కడ పార్టీలో తనపై మూకుమ్మడి దాడి జరిగే అవకాశం ఉందని ఊహించే కవిత.. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ నోటీసులపై నిరసన బాట పడుతున్నారని కొందరు విశ్లేషకులు చెప్తున్న మాట.
బల ప్రదర్శన కోసమేనా..!
దాంతో పాటుగా జూన్ 4న చేయదలచిన నిరసనతో తనకు ఉన్న బలాన్ని నిరూపించుకోవాలని కవిత భావిస్తుందా? అన్న అనుమానం కూడా కలుగుతోంది. ‘‘కవిత కొత్త పార్టీ పెట్టనున్నారు. వేరే పార్టీలో చేరనున్నారు’ అని వార్తలు వస్తున్న క్రమంలో చాలా మంది కవితకు అంత చరీష్మా లేదు, ఆమె కేసీఆర్ బిడ్డగానే సుపరిచితం తప్ప సొంత ఇమేజ్ ఏమీ లేదని చాలా మంది తమతమ అభిప్రాయాలు చెప్తున్నారు. బీఆర్ఎస్ నేతల్లో కూడా చాలా మంది ఇదే భావనతో ఉన్నారని, వారిలో కొందరు కీలక నేతలు కూడా ఉన్నారని సమాచారం. అయితే ఇప్పుడు జూన్ 4న తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టి తన సత్తా నిరూపించుకోవాలని కవిత ప్లాన్ చేస్తోందన్న వాదన కూడా బలంగా వినిపిస్తోంది.