‘వైఎస్ఆర్ బాటలోనే పాలన’.. రేవంత్ ఏమన్నారంటే..
ఎవరూ రద్దు చేయలేని పథకాలను అమలు చేసిన నేత వైఎస్ఆర్ అన్న సీఎం రేవంత్.;
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి చెరగని ముద్ర వేశారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నో అద్భుతమైన పథకాలను ఆయన అమలు చేశారని, రాష్ట్ర ప్రజలకు ఆయన చేసిన సేవలను అజరామరమని కొనియాడారు. ఆయన స్ఫూర్తితోనే తామూ పాలన కొనసాగిస్తున్నామన్నారు. ఆయన ఆశయాలను రానున్న కాలంలో కూడా కొనసాగిస్తామన్నారు. హోటల్ దస్ప్లాలో వైఎస్ఆర్ మెమోరియల్ అవార్డ్స్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో సుభాష్ పాలేకర్కు ఈ అవార్డును సీఎం రేవంత్ ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ప్రాణహిత-చేవెళ్ల, ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్లను పూర్తి చేసి తీరుతామని, ఆ భరోసా తనదని హామీ ఇచ్చారు.
“వ్యవసాయం దండక కాదు పండుగ చేయాలన్న వైఎస్ ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోంది. తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలని గోదావరి, కృష్ణా నదులపై తలపెట్టిన ప్రాజెక్టులను కచ్చితంగా పూర్తి చేసి తీరుతాం. కాలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు, పేలిపోతున్న మోటార్ల కాలంలో బాధల నుంచి రైతులను కాపాడాలని 2007-08 లో ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుకు వైఎస్సార్ పునరుజ్జీవం కల్పిస్తే తర్వాత ప్రభుత్వంలో రీడిజైనింగ్ పేరుతో తుమ్మిడిహెట్టి నుంచి ఆ ప్రాజెక్టును తప్పించారు’’ అని చెప్పారు.
‘‘రైతాంగానికి మేలు చేయాలని, చేవెళ్ల, వికారాబాద్, తాండూరు, కొంత కొడంగల్ ప్రాంతం చివరి ఆయకట్టు వరకు నీరివ్వాలన్న వైఎస్సార్ ఆశయానికి అనుగుణంగా తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత - చేవెళ్ల కడతాం. ఫ్లోరైడ్ మహమ్మారి నుంచి నల్గొండ ప్రజలను రక్షించాలని సంకల్పించిన ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పూర్తి చేస్తాం. రైతునే రాజును చేయాలన్న ఆలోచనతో వైఎస్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మరుక్షణం రైతాంగానికి ఉచిత విద్యుత్ కు సంబంధించిన ఫైలుపై సంతకం చేయడమే కాకుండా రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేశారు. 1300 కోట్ల రూపాయల మేరకు రైతుల బకాయిలను రద్దు చేశారు. దేశంలో రైతులకు ఉచిత కరెంటు ఇవ్వాలంటే తప్పనిసరిగా వైఎస్సార్ను గుర్తు చేసుకోకతప్పని రీతిలో అందరి మదిలో వారు స్థానం పదిలం చేసుకున్నారు’’ అని గుర్తు చేశారు.
‘‘వైఎస్సార్ గారి ఆలోచనల కొనసాగింపుగా వారు ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్ మెంట్, రాజీవ్ ఆరోగ్యశ్రీలను తమ ప్రభుత్వం కొనసాగిస్తోంది. ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షల రూపాయలు పెంచాం. ఫీజు రీయింబర్స్ మెంట్ కొనసాగిస్తున్నాం. వైఎస్ ఆలోచన, వారి స్ఫూర్తితోనే దేశంలోనే మొట్ట మొదటిసారి రాష్ట్ర వ్యాప్తంగా 3.10 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నాం. రైతు సంక్షేమం కోసం అధికారంలోకి రాగానే 25 లక్షల మంది రైతులకు 20 వేల కోట్ల రూపాయల మేరకు రుణాలను మాఫీ చేసి విముక్తులను చేశాం. వరి వేసుకుంటే ఉరి వేసుకున్నట్టే అన్న రోజుల నుంచి వరి వేసుకోండి, బోనస్ ఇచ్చి మరీ కొనుగోలు చేస్తామని ప్రోత్సహించాం. ఈరోజు దేశంలోనే అత్యధికంగా 2.85 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించి మొదటి స్థానంలో నిలిచాం’’ అని తెలిపారు.
‘‘కేంద్ర ప్రభుత్వం సరిగా సహకరించని కారణంగా రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడి రైతులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు వచ్చాయి. పాలేకర్ గారు సూచించినట్టు మార్గంలో రాష్ట్రంలో వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం అవసరమైన ప్రణాళికలు రచిస్తాం. విద్యార్థి దశ నుంచి వైఎస్కు వెన్నంటి నిలిచిన మిత్రుడి కోసం కేవీపీ రామచంద్ర రావు గారు తన శక్తినంతా ధారపోశారు. వైఎస్ ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న సందర్భంలో కూడా వారి వెంట నిటారుగా నిలబడ్డారు. వైఎస్ మరణించి 16 సంవత్సరాలు పూర్తయినా, వారిపై ఉన్న అభిమానంతో ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం..” అని రేవంత్ రెడ్డి అన్నారు.