క్యాబినెట్ లో కోటా పెంచి రేవంత్ బీసీల మనుసుదోచుకుంటాడా ?
అన్నీ పార్టీలు ఇపుడు బీసీ సామాజికవర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు పోటీలు పడుతున్న విషయం అందరికీ తెలిసిందే;
రెండు మూడురోజుల్లో తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఖాయమన్న సంకేతాలు కనబడుతున్నాయి. ఎప్పటినుండో ఊరిస్తున్న విస్తరణ కసరత్తు ఇపుడు క్లైమ్యాక్సుకు వచ్చేసినట్లు పార్టీవర్గాల సమాచారం. ఇందులో భాగంగానే మంత్రివర్గంలో చోటు దక్కించుకునేందుకు వివిధ సామాజికవర్గాలకు చెందిన ఎంఎల్ఏలు ఒక్కసారిగా యాక్టివ్ అయిపోయారు. ఇక్కడ ఎనుమల రేవంత్ రెడ్డితో Revanth) ను వ్యక్తిగతంగా కలవటంతో పాటు ఢిల్లీకి వెళ్ళి అధిష్ఠానంను కలుస్తున్నారు. తెలంగాణ క్యాబినెట్లో రేవంత్ తో కలిపి 18మందికి అవకాశముంది. ఇపుడు రేవంత్ తో కలిపి మంత్రులు 12మందే ఉన్నారు. అంటే మరో ఆరుగురికి అవకాశముంది. అయితే ప్రస్తుతానికి నలుగురు కొత్తవారిని తీసుకుని క్యాబినెట్ ను విస్తరించాలని కొంతకాలం అయిన తర్వాత మిగిలిన ఇద్దరికి చోటు కల్పించాలని అధిష్ఠానం ఆలోచిస్తున్నట్లు సమాచారం. సామాజికవర్గాల మధ్య సమతూకం సాధ్యంకాకపోతే మరొకరిని అదనంగా తీసుకునే అవకాశాన్ని కూడా ఆలోచిస్తున్నది అధిష్ఠానం.
పార్టీవర్గాల సమాచారం ప్రచారం నలుగురు కొత్తవాళ్ళని తీసుకుంటే ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ మరొక ఇతర సామాజికవర్గాలనుండి తీసుకోవాలని ఆలోచిస్తున్నది అధిష్ఠానం. ఎస్సీల్లో సమస్య ఎక్కడొచ్చిందంటే మాల, మాదిగ ఉపకులాలు రెండూ మంత్రివర్గంలో చోటుకోసం పట్టుబడుతున్నాయి. మంత్రివర్గంతో పాటు ఎంపీలుగా కూడా మాలలకు ఎక్కువ అవకాశం ఇచ్చారు కాబట్టి విస్తరణలో తమకు కచ్చితంగా అవకాశం ఇచ్చితీరాలని మాదిగ ఎంఎల్ఏలు మందుల సామ్యూల్, కవ్వంపల్లి సత్యనారాయణ, అడ్లూరి లక్ష్మణ్, తోట లక్ష్మీకాంతరావు పట్టుబడుతున్నారు. ఈ మేరకు ఢిల్లీకి వెళ్ళి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధి,(Rahul Gandhi) ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, తెలంగాణ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) కలిశారు.
ఇక మాల సామాజికవర్గానికి చెందిన చెన్నూరు ఎంఎల్ఏ గడ్డం వివేక్ వెంకటస్వామి(మాల) కూడా మంత్రిపదవి కోసం పట్టుబడుతున్నారు. 2023 ఎన్నికల సమయంలో మంత్రిపదవి హామీతోనే తాను కాంగ్రెస్ లో చేరిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. అప్పట్లో మంత్రివర్గంలో చోటు కల్పిస్తానని రేవంత్ తో పాటు ఢిల్లీ పెద్దలు తనకు హామీ ఇచ్చిన విషయాన్ని వివేక్ గుర్తుచేస్తు ఇచ్చిన హామీని నిలుపుకోవాలని ఒత్తిడిపెతున్నారు. ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే తనకు కూడా మంత్రిపదవి హామీ ఇచ్చారని మునుగోడు ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి(Komatireddy) గుర్తుచేస్తున్నారు. ఇచ్చిన హామీ మేరకు తనకు మంత్రివర్గంలో చోటుకల్పించాల్సిందే అని పట్టుబడుతున్నారు. అయితే ఈయన అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే మంత్రివర్గంలో ఉన్నారు. ఏకకాలంలో అన్న,తమ్ములిద్దరికీ మంత్రివర్గంలో చోటు కల్పించేందుకు అధిష్ఠానం ఒప్పుకుంటుందా అన్నదే పాయింట్.
ఇక ఎస్సీల నుండి (మాల)ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క(Bhatti Vikramarka), దామోదర రాజనర్సింహ(మాదిగ) ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రెడ్లలో రేవంత్ కాకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. 18 మంది మంత్రుల్లో ఇప్పటికే నలుగురున్నారు కాబట్టి రెడ్డి సామాజికవర్గానికి మరో చోటు అనుమానమే. దుద్దిళ్ళ శ్రీధర్ బాబు(బ్రాహ్మణ), ఎస్టీల్లో ఆదివాసీల నుండి ధనసరి అనుసూయ అలియాస్ సీతక్క(Seethakka) ప్రాధాన్యత వహిస్తున్నారు. కమ్మ సామాజికవర్గం నుండి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. వెలమ సామాజికవర్గం నుండి జూపల్లి కృష్ణారావు మంత్రిగా ఉన్నారు.
బీసీలకు ప్రాధాన్యత తప్పదా ?
బీసీ సామాజికవర్గానికి మంత్రివర్గ విస్తరణలో ప్రాధాన్యత తప్పట్లేలేదు. ఇప్పటికే బీసీ కోటాలో గౌడ ఉపకులానికి చెందిన పొన్నం ప్రభాకర్, పద్మశాలి నుండి కొండా సురేఖ(Konda Surekha) ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిణామలను దృష్టిలో పెట్టుకుంటే బీసీలకు ప్రాధాన్యత ఇవ్వక తప్పేట్లులేదు. ఎందుకంటే అన్నీ పార్టీలు ఇపుడు బీసీ సామాజికవర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు పోటీలు పడుతున్న విషయం అందరికీ తెలిసిందే. 2023 ఎన్నికలకు ముందు స్ధానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుచేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. దానికి తగ్గట్లుగానే కులగణన చేయించి బీసీల జనాభా ఎంతో తేల్చి అందుకు అనుగుణంగానే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని క్యాబినెట్లో తీర్మానం చేయించారు. ఆ తర్వాత బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుచేయాలని అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి తీర్మానం కూడా చేయించి గవర్నర్ ఆమోదం తీసుకున్నారు.
అసెంబ్లీ తీర్మానానికి రాజ్యాంగబద్దత కోసం గవర్నర్ ఆమోదంపొందిన బిల్లును రేవంత్ ప్రభుత్వం రాష్ట్రపతికి పంపి షెడ్యూల్ 9లో చేర్చాలని రిక్వెస్టు చేసింది. ఎప్పుడైతే షెడ్యూల్ 9లో చేర్చాలని ప్రభుత్వం రిక్వెస్టుచేసిందో సదరు బిల్లుపై పార్లమెంటులో చర్చజరిగి, ఆమోదంపొంది రాజ్యంగ సవరణ జరిగిన తర్వాత కాని అసెంబ్లీ తీర్మానానికి చట్టబద్దత రాదు. తర్వాత కాని తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు సాధ్యంకాదు. ఇదంతా జరుగుతుందనే నమ్మకం చాలామందిలో లేదు. మరి అసెంబ్లీ ఎన్నికలసమయంలో బీసీలకు ఇచ్చినహామీని నిలుపుకోవాలంటే మార్గం ఏమిటి ? ఏమిటంటే పార్టీపరంగా బీసీలకు 42 శాతం టికెట్లు కేటాయించటమే. అంతకన్నా ముందు మంత్రివర్గ విస్తరణలో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చి తమ చిత్తశుద్దిని నిరూపించుకున్నట్లు అవుతుందని రేవంత్ రెడ్డి ఇప్పటికే అధిష్ఠానంతో చెప్పినట్లు పార్టీవర్గాల సమాచారం.
బీసీల్లో నమ్మకం కోసమే
తొందరలో జరగబోయే స్ధానికసంస్ధల ఎన్నికల్లో బీసీ సామాజికవర్గాలు కాంగ్రెస్ ను గెలిపించాలంటే ముందు మంత్రివర్గ విస్తరణలో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని అధిష్ఠానంతో రేవంత్ ఇప్పటికే చాలాసార్లు చెప్పినట్లు పార్టీవర్గాల సమాచారం. కాబట్టి విస్తరణలో నలుగురికా లేకపోతే ఐదుగురికి అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా అందులో బీసీలకు పెద్దపీట వేసే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అవసరమైతే మంత్రివర్గంలో అత్యంత వివాదాస్పదంగా తయారైన కొండాసురేఖను తప్పించి అదే సామాజికవర్గం నుండి మరో ఎంఎల్ఏను తీసుకోవటంతో పాటు మరో ఇద్దరు బీసీలను కూడా చేర్చే అవకాశాన్ని అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
బీసీల్లో గౌడ్లు, పద్మశాలీలతో పాటు మున్నూరుకాపులు, యాదవ, ముదిరాజ్ ఉపకులాల జనాభా చాలా ఎక్కువగా ఉంది. బీసీల్లో అత్యధిక జనాభా కలిగిన ఉపకులాలను తీసుకుంటే మొదటిస్ధానంలో ముదిరాజ్ తర్వాత యాదవ, గౌడ్, మన్నూరుకాపు, పద్మశాలీలు వస్తారు. ముదిరాజ్ జనాభా 26.36 లక్షలు, యాదవులు 20.17 లక్షలు, గౌడ్ లు 16.27 లక్షలు, మున్నూరుకాపులు 13.71 లక్షలు ఫైనల్ గా పద్మశాలీలు 11.79 లక్షలమందున్నారు. జనాభా ప్రాతిపదకనే తమకు మంత్రిపదవుల్లో చోటు కల్పంచాల్సిందే అని ముదిరాజ్, యాదవ్, మన్నూరుకాపు ఎంఎల్ఏలు డిమాండ్ చేస్తున్నారు. మరి చివరకు అధిష్ఠానం, రేవంత్ ఏమిచేస్తారో చూడాల్సిందే.