వక్ఫ్ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో పిటీషన్లు..
పిటీషనర్లలో నటుడు, టీవీకే చీఫ్ విజయ్ కూడా..;
వక్ఫ్ (సవరణ) బిల్లు - 2025కు పార్లమెంటు ఉభయ సభల్లో మెజార్టీ సభ్యుల ఆమోదం లభించడంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఆమోద ముద్ర వేసేశారు. దాంతో బిల్లు కాస్తా చట్టంగా మారిపోయింది. అయితే ఈ చట్టంపై కొన్ని పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ముస్లిం హక్కులను కాలరాసేలా ఉందంటూ కొన్ని పార్టీల నేతలు సుప్రీం కోర్టులో పిటీషన్లు కూడా వేశారు.
పిటీషనర్లు ఎవరంటే..
వక్ఫ్ (సవరణ) చట్టానికి వ్యతిరేకంగా అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన వారిలో ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ, ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్, అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్, అర్షద్ మదానీ, సమస్తా కేరళ జమియతుల్ ఉలేమా, అంజుమ్ కడారి, తైయ్యబ్ ఖాన్ సల్మానీ, మహ్మద్ షఫీ, మహ్మద్ ఫజులురహీం, జేజేడీ నాయకుడు మనోజ్ దాఖలు పిటిషన్లను దాఖలు చేశారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (AIMPLB), జమియత్ ఉలామా-ఇ-హింద్, DMK, కాంగ్రెస్ ఎంపీలు ఇమ్రాన్ ప్రతాప్గఢి, మొహమ్మద్ జావేద్ ఉన్నారు.
తమిళనాడు డీఎంకే నుంచి రాజా పిటిషన్..
"తీవ్ర వ్యతిరేకత ఉన్నా.. జేపీసీ (జాయింట్ పార్లమెంటరీ కమిటీ) సభ్యుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండానే కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లును ఆమోదించింది. ఈ చట్టాన్ని అమలు చేయడం వల్ల తమిళనాడులోని సుమారు 50 లక్షల మంది ముస్లింలు, దేశంలోని ఇతర ప్రాంతాలలో 20 కోట్ల మంది హక్కులకు భంగం వాటిల్లింది’’ అని పిటీషన్లో పేర్కొన్నారు.
" రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 15, 21, 25, 26, 29, 30 మరియు 300-A" లను ఉల్లంఘిస్తున్నందున, ఈ చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని ఆప్ ఢిల్లీ ఎమ్మెల్యే ఖాన్ కోరారు.
నటుడు, తమిళగ వెట్రీ కజగం (TVK) అధ్యక్షుడు విజయ్ కూడా వక్ఫ్ చట్టాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.
16న విచారణ..
దాఖలయిన పిటీషన్లపై సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. సీజేఐతో పాటు, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కెవి విశ్వనాథన్తో కూడిన ధర్మాసనం ఏప్రిల్ 16న విచారించనుంది.
ఏ సభలో ఎంతమంది ఆమోదించారు?
రాజ్యసభలో వక్ఫ్ బిల్లుకు అనుకూలంగా 128 మంది సభ్యులు, వ్యతిరేకంగా 95 మంది ఓటు వేశారు. అలాగే లోక్సభలో 288 మంది సభ్యులు అనుకూలంగా 232 మంది వ్యతిరేకంగా ఓటువేశారు. మెజార్టీ సభ్యుల ఆమోదంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఆమోదం పొందారు.