కర్ణాటక సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని ఎందుకు బహిష్కరిస్తున్నారు?

‘కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కర్ణాటక నుంచి రాజ్యసభ సభ్యురాలు అయినందున ఆమె రాష్ట్రానికి న్యాయం చేస్తారని ఆశించాం.’ అని సీఎం సిద్ధరామయ్య అన్నారు.

Update: 2024-07-24 07:55 GMT

కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్ర డిమాండ్లను నిర్లక్ష్యం చేసినందుకు నిరసనగా జూలై 27న ప్రధాని మోదీ అధ్యక్షతన నిర్వహించనున్న నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్లు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు.

"కర్ణాటక అవసరాలపై చర్చించేందుకు న్యూఢిల్లీలో అఖిలపక్ష ఎంపీల సమావేశానికి పిలుపునిచ్చేందుకు నేను తీవ్రంగా ప్రయత్నించా. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా కర్ణాటక ప్రజల ఆందోళనలను పట్టించుకోలేదు. బడ్జెట్‌లో మా డిమాండ్లను విస్మరించారు. మేకేదాటు, మహాదాయి ప్రాజెక్టులను ఆమోదించాలన్న రైతుల డిమాండ్లను పక్కన పెట్టారు. మెట్రో, ఇతర ఇన్‌ఫ్రా ప్రాజెక్టులకు నిధులు విడుదల కలగానే మిగిలిపోయాయి. అందుకే నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కావడంలో అర్థం లేదు” అని సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్‌లో పోస్ట్ చేశాడు.

‘‘ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్, బీహార్ తప్ప ఇతర రాష్ట్రాలను చూడలేకపోతున్నారు. ఆయన ఎజెండాను బట్టబయలు చేశారు. న్యాయం కోసం మా పోరాటంలో రాష్ట్ర ప్రజలు మాకు అండగా ఉంటారని ఆశిస్తున్నాం’’ అని సీఎం పేర్కొన్నారు.

‘నిర్మలా సీతారామన్ అన్యాయం చేశారు’

అంతకుముందు రోజు సిద్ధరామయ్య విలేకరులతో మాట్లాడుతూ.. ‘యూనియన్ బడ్జెట్ నిరాశ కలిగించిందన్నారు. నిర్మలా సీతారామన్ కర్ణాటక నుంచి రాజ్యసభ సభ్యురాలు అయినందున ఆమె రాష్ట్రానికి న్యాయం చేస్తారని, ఆమె మా ప్రయోజనాలను కాపాడుతుందని ఆశించాం.అయితే ఆమె నిరాశపరిచారు. కర్ణాటక ప్రజలకు అన్యాయం చేశారు’ అని సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు.

Tags:    

Similar News