మక్కా హజ్ యాత్రలో విషాదం..కుప్పకూలిన లిఫ్ట్, ఇద్దరి మృతి

సౌదీ అరేబియా దేశంలో సాగుతున్న హజ్ యాత్రలో విషాదం రాజుకుంది. మక్కాలో ప్రమాదవశాత్తూ లిఫ్ట్ కుప్పకూలి పోవడంతో ఇద్దరు భారతీయ హాజీలు మృత్యువాత పడ్డారు.

Update: 2024-06-07 14:18 GMT
మక్కాలో లిఫ్ట్ కూలి మరణించిన హాజీలు


Heading

Content Area

సౌదీ అరేబియా దేశంలో సాగుతున్న పవిత్ర హజ్ యాత్రలో విషాదం చోటుచేసుకుంది.జామియా బిన్ మెహఫూజ్ ఎదురుగా ఉన్న అజీజియా వద్ద భవనం నంబర్ 145లో లిఫ్ట్ కూలిపోవడంతో పలువురు భారతీయ హజ్ యాత్రికులు గాయపడినట్లు హైదరాబాద్ నగరానికి చెందిన పలువురు ప్రత్యక్ష సాక్షులు ‘ఫెడరల్ తెలంగాణ’కు తెలిపారు.
- ఈ ప్రమాద ఘటనలో అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.ఈ ప్రమాదంలో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో, ఎంత మందికి గాయాలయ్యాయో ఇంకా తెలియ లేదు. ఈ ప్రమాద ఘటనలో ఇప్పటివరకు బీహార్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారని ప్రత్యక్ష సాక్షులు మక్కా నుంచి చెప్పారు.
- మృతులను ముహమ్మద్ సిద్ధిక్ (73), అబ్దుల్ లతీఫ్ (70)గా గుర్తించామని సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది.

సహాయ చర్యలు చేపట్టిన అధికారులు
ఈ ప్రమాద ఘటన అనంతరం హజ్ మిషన్ అత్యవసరంగా పరిశీలించి యాత్రికులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించిందని హైదరాబాద్ నగరానికి చెందిన హజ్ యాత్రికుడు మతీన్ చెప్పారు.మక్కా, మినా నగరాల్లో హజ్ సమయంలో ప్రమాదాలు జరుగుతుంటాయి.

తెలంగాణ హజ్ యాత్రికులు క్షేమం : హజ్ కమిటీ ప్రతినిధి ఆరిఫ్
ఈ ఏడాది తెలంగాణ నుంచి 11,418 మంది హజ్ యాత్రికులు మక్కాకు వెళ్లారని వారంతా క్షేమంగా ఉన్నారని తెలంగాణ హజ్ కమిటీ ప్రతినిధి ఆరిఫ్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. లిఫ్ట్ కుప్పకూలిన ప్రమాదంలో చిక్కుకున్న వారిలో తెలంగాణ హజ్ యాత్రికులెవరూ లేరని ఆయన తెలిపారు.

గుండెపోటుతో తెలంగాణ హజ్ యాత్రికుడి మృతి
ఈ ఏడాది హజ్ యాత్రకు నిజామాబాద్ జిల్లా నుంచి వెళ్లిన మీర్ రహ్మత్ అలీ నబవీ మసీదులో ప్రార్థనలు చేస్తూ గుండెపోటుతో మరణించారని ఆరిఫ్ చెప్పారు. తెలంగాణ కు చెందిన మరో హజ్ యాత్రికుడికి అల్సర్ తీవ్రం కావడంతో అక్కడి ఆసుపత్రిలో వైద్యులు అతనికి శస్త్రచికిత్స చేశారని, అతను కోలుకుంటున్నాడని ఆరిఫ్ వివరించారు.

గతంలోనూ ప్రమాదాలు
2015వసంవత్సరంలో మినాలో జరిగిన తొక్కిసలాటలో రెండు వేల మంది హజ్ యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. గతంలో టెంట్లలో అగ్నిప్రమాదం జరగడంతో పలువురు మృత్యువాత పడ్డారు. దీంతో టెంట్ల స్థానంలో హోటళ్లలో హజ్ యాత్రికులకు వసతి సౌకర్యాలు కల్పించారు.



Tags:    

Similar News