పేదల పథకానికి ఎవ్వరూ అప్లై చేయరా?
జాతీయ కుటుంబ లబ్ధి పథకం (NFBS) అంటే ఏమిటి?;
ఆరుగాలం కష్టపడినా, అస్తమానం పాటుపడినా, కడుపు నిండా తిండి లేక, కట్టుకోను బట్ట లేక, ఉండడానికి ఇల్లు లేక , గోస పడే కుటుంబాలు ఇప్పటికే మన రాష్ట్రంలో లక్షల సంఖ్యలో ఉంటాయి. ఈ కుటుంబాలు ఎక్కువగా శ్రమను నమ్ముకుని బతుకు తుంటాయి. గ్రామాలలో వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ , విషరసాయనాల వినియోగం కారణంగా పేద, శ్రామిక కుటుంబాలకు పని దినాలు తగ్గిపోతున్నాయి. గ్రామాలలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూడా సరిగా అమలు కావడం లేదు. ఈ పథకం క్రింద సంవత్సరానికి 100 పని దినాలు లభించాల్సి ఉండగా , కేవలం 45-50 పని దినాలు మాత్రమే పని దొరుకుతున్నది. ఈ కారణంగా గ్రామీణ గ్రామీణ, పట్టణ పేద ,శ్రామిక కుటుంబాలు ఆదాయాలు పడిపోయాయి. ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్నాయి.
గ్రామీణ ప్రాంతం నుండీ పట్టణ ప్రాంతాలకు లక్షలాది పేద కుటుంబాలు చేరుతున్నాయి. శ్రామిక ప్రజలతో నిండిన బస్తీలు పెరిగిపోతున్నాయి . వీరికి కూడా తగిన పని దొరకడం లేదు. కుటుంబ పోషణకు సరిపోయే విధంగా ఆదాయాలు రావడం లేదు. గ్రామీణ, పట్టణ పేద కుటుంబాలన్నీ అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉంటున్నాయి. ఇలాంటి స్థితిలో ఆయా కుటుంబాలలో పని చేసి , ఆదాయాలు సంపాదించే వ్యక్తులు ఎవరైనా మరణిస్తే ఆ కుటుంబాలు మరింత సంక్షోభంలో కూరుకు పోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో భూమిపై పట్టా హక్కులు కలిగిన వారు సహజ మరణానికి గురైనా 5 లక్షల రూపాయల సహాయం అందే రైతు బీమా పథకం ఉంది. కానీ సాగు భూమి లేని గ్రామీణ కుటుంబాలు, పట్టణ పేద కుటుంబాలఅను ఆదుకోవడానికి ఇలాంటి పథకం ఏమీ లేదు. కాబట్టి ఆ కుటుంబాలలో పెద్ద వాళ్ళు మరణిస్తే, ఆ కుటుంబాలకు కోలుకోవడానికి ఎక్కువ కష్టం అవుతున్నది. ఒక్కోసారి అంత్య క్రియలకు కూడా ఆ కుటుంబాలు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి స్థితిలో ఆయా కుటుంబాలను ఆడుకోవడానికి ఒక పథకం ఉండేది. ఈ పథకం క్రింద, స్పాట్ అసిస్టెన్స్ లాగా కనీసం 5,000 రూపాయలు బాధిత కుటుంబానికి అందించేవారు.
అనంతరం ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం మెరుగు పరిచి, కొత్త పథకాన్ని తీసుకు వచ్చింది. దాని పేరు జాతీయ కుటుంబ లబ్ధి పథకం (NFBS).
ఇంటి పెద్ద (ఆదాయం సంపాదించే వ్యక్తి) మరణించిన సందర్భంలో ఈ జాతీయ కుటుంబ లబ్ధి పథకం (NFBS) క్రింద ఆ కుటుంబానికి ఒకసారి సహాయంగా రూ. 20,000/- అందిస్తారు. ఈ పథకం కింద, గృహిణి అయిన మహిళ కూడా "ఆదాయం సంపాదించే వ్యక్తి" గా పరిగణించబడుతుంది. స్థానిక విచారణ తర్వాత, మరణించిన వ్యక్తి కుటుంబంలో గృహ నాయకుడిగా గుర్తించ బడిన జీవించి ఉన్న సభ్యుడికి ఈ సహాయాన్ని అందిస్తారు.
ఈ పథకం కోసం "కుటుంబం" అనే పదం భార్య/భర్త, మైనర్ పిల్లలు, పెళ్లికాని కుమార్తెలు, ఆధార పడిన తల్లిదండ్రులను కలిగి ఉంటుంది. పెళ్లి కాని వయోజనుడు మరణించిన సందర్భంలో, కుటుంబం అనే పదం మైనర్ సోదరులు/ సోదరీమణులు ఆధారపడిన తల్లిదండ్రులను కలిగి ఉంటుంది. ఆదాయం సంపాదించే వ్యక్తి మరణం 18 సంవత్సరాల కంటే ఎక్కువ మరియు 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సులో జరిగి ఉండాలి.
ప్రాథమిక ఆదాయం సంపాదించే వ్యక్తి అనగా, కుటుంబ మొత్తం ఆదాయంలో అత్యధిక భాగం సంపాదించే పురుషుడు లేదా స్త్రీ. ఆ కుటుంబం భారత ప్రభుత్వం నిర్దేశించిన పేదరిక రేఖ కింద ఉండాలి. అంటే రేషన్ కార్డు తప్పని సరిగా కలిగి ఉండాలి. AABY/JBY/ఆపత్బంధు పథకాల కింద ఇప్పటికే సహాయం పొందిన దరఖాస్తుదారులు అర్హులు కాదు.
తెలంగాణ రాష్ట్రం NFBS కింద అందించే సహాయం మొత్తాన్ని రూ. 10,000/- నుండి రూ. 20,000/- కు పెంచింది ( ఇది 12.04.2017 నుండి అమలులోకి వచ్చింది, G.O. Ms NO.25, dt. 12.04.2017). ప్రస్తుతం ఈ పథకానికి అవసరమైన మొత్తం నిధిని కేంద్ర ప్రభుత్వమే అందిస్తుంది.
ఈ అర్హత కలిగిన కుటుంబాలలో కూడా లబ్ధి దారుల ఎంపిక లో ఈ క్రింది వారికి ప్రాధాన్యతా వరస క్రమం ఈ క్రింది విధంగా ఉంటుంది.
i) SC/ST కుటుంబాలు ii) మైనర్ పిల్లలు అనాథలైన కుటుంబాలు iii) ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మైనర్ పిల్లలు వికలాంగులైన కుటుంబాలు iv) ఒకే బిడ్డ ఆడపిల్ల అయిన కుటుంబాలు v) ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మైనర్ పిల్లలు అందరూ ఆడపిల్లలైన కుటుంబాలు vi) ఒకే బిడ్డ ఉన్న కుటుంబాలు vii) వయోజన పురుష సభ్యుడు లేని కుటుంబాలు viii) మైనారిటీలు మరియు BC/OC వర్గాలకు చెందిన కుటుంబాలు
దరఖాస్తుదారు NFBS మంజూరు కోసం సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో మాన్యువల్గా దరఖాస్తు సమర్పించాలి.
ఈ పథకం కోసం నిధులు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP) యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నియంత్రణలో ఉన్న ప్రత్యేక రాష్ట్ర నోడల్ బ్యాంక్ ఖాతాలో ఉంటాయి. లబ్ధిదారుల ఖాతాలకు ఎలక్ట్రానిక్ బదిలీ ద్వారా జరుగుతుంది.
దరఖాస్తుదారులు సంబంధిత తహసీల్దార్కు నిర్దేశిత ఫార్మాట్లో భాగం-Iలో దరఖాస్తు సమర్పించాలి. ఇందుకు అవసరమైన పత్రాలు: 1) ఆధార్ కార్డు - కుటుంబ సభ్యులు 2) మరణ ధృవీకరణ పత్రం 3) బ్యాంక్ పాస్ బుక్, 4) మరణం ఎలా సంభవించిందనే దానిపై అఫిడవిట్ (సాధారణ మరణం లేదా ప్రమాదం), 5) రేషన్ కార్డు 6) కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రం 7) కుల ధృవీకరణ పత్రం కాపీ 8) AABY/JBY సహాయం అందిందా లేదా అనే విషయమై IKP నుండి నిరభ్యంతర పత్రం(NOC)
తహసీల్దార్ విచారణ తర్వాత ప్రతిపాదనలను సంబంధిత రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (RDO) కు సమర్పిస్తారు. RDO స్థాయిలో అర్హత గల దరఖాస్తుల వివరాలు నమోదు చేయబడి, ఆన్లైన్లో జిల్లా రెవెన్యూ అధికారి (DRO)కు పంపిస్తారు. DRO ఆన్లైన్లో ఫండ్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ (FTR) రూపొందించి, CEO, SERPకు ఆన్లైన్లో పంపుతారు.
సామాజిక భద్రతా పెన్షన్ల డైరెక్టర్, CEO, SERP నుండి నిధుల విడుదలకు ఆదేశాలు తీసుకుని, DRO నుండి వచ్చిన FTRలను ఆమోదించి, NFBS లబ్ధిదారుల వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలకు మొత్తాన్ని బదిలీ చేయడానికి ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ (FTO) రూపొందిస్తారు.
ఈ పథకం క్రింద తెలంగాణ రాష్ట్రంలో సంవత్సరానికి 7794 మందికి సహాయం అందిస్తారు. అయితే ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ ద్వారా, 2020 జనవరి నుండీ ఇప్పటి వరకూ అర్హులైన కుటుంబాలను ఎంపిక చేసి, సహాయం అందించలను నిర్ణయించింది. అంటే దాదాపు 40,000 మందికి ఈ సహాయం అందే అవకాశం ఉంది .
ఇంత పెద్ద రాష్ట్రంలో “ఇంత తక్కువ మందికా” అని మనకు అనిపించవచ్చు కానీ, గత పదేళ్లుగా నిజంగా ఈ పథకం అమలు చాలా బలహీనంగా ఉంది. కొద్దిమంది సామాజిక కార్యకర్తలు , రైతు స్వరాజ్య వేదిక లాంటి సంస్థల ప్రతినిధులు బాధిత కుటుంబాలకు ఈ పథకం అమలు చేయాలని మొదటి నుండీ కోరుతున్నారు . కలెక్టర్స్ కు కూడా అనేక సార్లు మెమొరాండాలు ఇచ్చారు. అర్హులైన బాధిత కుటుంబాలతో దరఖాస్తులు కూడా చేయిస్తూ వచ్చారు. కానీ ఇప్పటికీ చాలా మంది సామాజిక కార్యకర్తలకు, చాలా ప్రజా సంఘాలకు, దళిత, ఆదివాసీ సంఘాలకు , ప్రజా పక్ష రాజకీయ పార్టీలకు కూడా ఈ పథకం గురించి సమాచారం లేదు. తెలిసినా , తమ సంస్థల నిర్మాణం ఉన్న గ్రామాలలో, పట్టణ బస్తీలలో పేద కుటుంబాల పక్షాన పూనుకుని ఈ పథకం అమలుకు ప్రయత్నాలు కూడా చేయకపోవడం విచార కరం.
ఈ పథకం అమలు తీరు రాష్ట్రంలో మొదటి నుండీ ఎప్పుడూ టార్గెట్ చేరలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 లో ఈ పథకం క్రింద 1711 మందికి మాత్రమే సహాయం అందింది. 2015 లో 4428 మందికి, 2016 లో 4,192 మందికి , 2017 లో 3,480 మందికి, 2018 లో 1378 మందికి, 2019 లో 1,587 మందికి, 2020 లో 824 మందికి , 2021 లో 851 మందికి సహాయం అందింది. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ఈ పథకం క్రింద లబ్ధిదారుల సంఖ్య కొంత ఎక్కువాగే ఉన్నా, 2018 లో రైతు బీమా పథకం మొదలయ్యాక, ఈ NFBS పథకాన్ని పూర్తిగా మూలకు పదేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2023 డిసెంబర్ నుండీ 2025 మార్చ్ వరకూ 732 మంది మాత్రమే లబ్ధి దారులుగా ఉన్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో పని చేసే నిజాయితీ కలిగిన అధికారులు ప్రత్యేక చొరవ చూపించిన సందర్భాలలో ఈ పథకం అమలు కొంత ముందుకు వెళుతున్నది.
రైతు స్వరాజ్య వేదిక సేకరించిన సమాచారం ప్రకారం 2025 జనవరి 1 నుండీ జూన్ 20 నాటికి అత్యధికంగా కరీం నగర్ జిల్లాలో 582 మందిని, జనగామ జిల్లాలో 303 మందిని, హైదరాబాద్ జిల్లాలో 212 మందిని, ఆదిలాబాద్ జిల్లాలో 87 మందిని, నల్లగొండ జిల్లాలో 14 మందిని, పెద్దపల్లి జిల్లాలో 9 మందిని, సిద్దిపేట జిల్లాలో 21 మందిని , వనపర్తి జిల్లాలో 25 మందిని, యాదాద్రి భువనగిరి జిల్లాలో 59 మందిని, రాజన్న సిరిసిల్లా జిల్లాలో 5 గురిని, జగిత్యాల జిల్లాలో ముగ్గురిని,ఖమ్మం జిల్లాలో 8 మందిని , నిజామాబాద్ జిల్లాలో ఒక్కరిని , సంగారెడ్డి జిల్లాలో 9 మందిని, మహబూబాబాద్ జిల్లాలో 5 గురిని , మంచిర్యాల జిల్లాలో ఒకరిని , ములుగు జిల్లాలో 6 గురిని, మొత్తం 1350 మందిని మాత్రమే ఎంపిక చేశారు. మొత్తంగా ఈ కుటుంబాలకు రెండు కోట్ల 70 లక్షల రూపాయల సహాయం అందనుంది.
ఈ పథకం క్రింద 16 జిల్లాలలో ఒక్కరిని కూడా ఎంపిక చేయలేదు. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాలలో పేద, శ్రామిక కుటుంబాలతో పని చేసే సంఘాలు, వ్యక్తులు పూనుకుని, ఈ పథకం లబ్ధిదారులుగా మార్చడానికి సీరియస్ గా పని చేయాల్సిన అవసరం ఉంది. ఒక ఎకరం భూమిలో కనీసం 15, 000 కూడా నికర ఆదాయం లేని చోట, ఉపాధి హామీ పథకం లో సంవత్సరానికి కనీసం 8,000 రూపాయలు కూడా కుటుంబానికి ఆదాయం రాని సందర్భంలో భూమి లేని, పేద, శ్రామిక కుటుంబాలకు ఈ పథకం క్రింద అందించే 20,000 కూడా ఎక్కువే అనేది సామాజిక కార్యకర్తలు,ప్రజా సంఘాలు, స్వచ్చంధ సంస్థలు దృష్టిలో ఉంచుకోవాలి.