పుటుక్కు జరజరా డుబుక్కు మే!

Update: 2025-12-24 03:47 GMT

రాజు వెడలె సభ అన్నట్టు కేసీఆర్ రెండేళ్ల ఫామ్ హౌస్ విశ్రాంత ఆశ్రమం నుంచి ఇటీవల నగర ప్రవేశం చేసారు. తమ పార్టీ భవనంలో తన వందిమాగదులతో కొన్ని లైఫ్ లైన్ మాటలు మాట్లాడినాడు. అధికార పార్టీకి తాను టూ ఇయర్స్ గ్రేస్ పీరియడ్ ఇచ్చానని ఇక తోలు తీస్తానని ఆయన మార్కు పత్రికా విలేకరుల సమావేశం పెట్టి అధికార పార్టీ మీద ఒంటి కాలు మిద షరామాములుగానే లేశారు.

తెలంగాణ ప్రస్తుత పరిస్థితికి కారణం ఏ ఒక్క పార్టీ నాయకులు గాని అధినాయకులు గాని ఏ ఒక్కరూ బరువూ మోయరు బాధ్యత వహించరు. పైగా మీరే కారణం అంటే ఈ దుస్థితికి మీరే కారణం అంటూ అధికార పార్టీ నాయకులు ఒకవైపు ప్రతిపక్ష పార్టీ నాయకులు మరోవైపు తాటి చెట్టు ఎందుకు ఎక్కినవ్ అంటే దుడ్డె గడ్డి కోసం అన్నట్టు అందరూ అమూల్ బేబీలే కానీ వండిన అన్నం దేకీషా మాత్రం ఖాళీ అయిపోయింది.

ఇది రాష్ట్రంలోనే కాదు అటు కేంద్రంలోనూ ఇటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలలోనూ ఇంచుమించుగా ఇదే మోస్తరు ఆరోపణలు కారాలు మిరియాలు నూరినట్టు జనాంతికంగా మీడియా ద్వారా టన్నులకొద్దీ వినోదం వీక్షకులకు శ్రోతలకు పంచుతుంటారు. వారు వీరు అనే భేదం లేకుండా అందరూ నీళ్ల మీద దెబ్బ కొట్టినట్టు వాచాలత్వం ప్రదర్శిస్తుంటారు . కేవలం ప్రేమ్ మాత్రమే పెట్టిన గాంధీ విగ్రహం కళ్లద్దాలోంచి ఇంటింటికి చెత్త బండిని పంపి అభివృద్ధి పేరున స్వచ్ఛభారత్ కలగంటారు అందరూ వెంట్రుకలకు బఠానీలు అమ్మేవాళ్లే. సత్య నారాయణ స్వామి కథలు చెప్పినప్పుడు కదలగకుండా వినే లాగా కథలు డిజైన్ చేసినట్టు అగో వృద్ధి వచ్చే ఇగో అభివృద్ధి జరిగే అంటూ ఐదేళ్ల పాటు ఓటర్లను ఓపికకు పరీక్ష పెట్టేలా విసిగిపోయేలా చేసి అధికార నాయకులు వాలం ఊపుకుంటూ అధికారం ఎంజాయ్ చేస్తూ కాలం గడుపుతుంటారు.

78ఏళ్ల స్వేచ్ఛ స్వతంత్ర భారతంలో అధికారంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ప్రజలను నిర్దాక్షిణ్యంగా బ్యాంకుల ప్రాంచిస్ బ్రాంచ్ ల వైపు పెన్షన్ల కోసం రేషన్ ల కోసం పాలకులు రైతులను, వృద్ధులను ,మహిళలను , విద్యార్థులను తరిమేశారు. అయ్యగారికి సంభావన ప్రజలకు తీర్థప్రసాదాలు. ప్రజాస్వామ్యం అంతా కొడితే ఇంతే సంగతులు. దేశభక్తి ప్రజాసేవ నిస్వార్థ నాయకత్వం స్థానంలోకి ఎప్పుడైతే రాజకీయ వ్యవస్థ దందాగా చేరిందో అప్పటినుండి నీకు ఇది నాకు అదిగా" క్విడ్ క్రో ప్రోకో" ఆక్రమించి దేశ ప్రజలను అతలాకుతలం చేస్తున్నది. రాజకీయ పార్టీ నాయకులు పెద్ద పెద్ద మాటలు ఎన్నికల అప్పుడు మాట్లాడి అధికారం రాగానే శుష్క నినాదాలు శూన్యహస్తాలుగా మారిపోతున్నారు. ఏ ఒక్కరూ ఓటర్లకు జవాబుదారితనం వహించరు. తెల్లారి లేస్తే సంక్షేమం పేరున నాయకులు ఊదరగొడుతూ ఉంటారు. అప్పులు అంటే అభివృద్ధి అని సుమతీ భాష్యాలు వేమన నీతి సూక్తులు వల్లె వేస్తుంటారు. రాజకీయాలలో ఇంకా "ఆవు పులి "కథ చెప్పి "అయ్యా పులి" వచ్చే కథలు ప్రజలకు చెప్పడం పరిపాటైపోయింది. రోజురోజుకు రాజకీయాల తీరు చూస్తే "తోక పోయి కత్తి వచ్చే డాం డాం..." అన్న నీతి కథ మతిలోకి వస్తుంది.అంతా వడ్లు పెరుగు కలిపినట్టుగా ఉంది. మనసంతా పుండు పుండుగా ఉంది .

ఎన్నికలప్పుడు ఒల్సెన్ని మాటలు చెప్పి గద్దె మీద కూర్చున్న ఓ గడుసు రాజా! కమిషన్ రిపోర్ట్ లో తేల్చిన విద్యుత్తు కొనుగోళ్ల అవినీతి పైన ఇప్పటివరకూ ఎందుకు చర్యలు చేపట్టలేదు? కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ లో నుంచి కాంట్రాక్టర్లను ఎందుకు మినహాయించారు?? ప్రతి ఏటా దావోస్ అంగట్లకు పోయి ఖర్చు పెట్టింది ఎంత మీరు??? సద్దులు కట్టుకొచ్చిన దాంట్లో పాసిపోయినవి ఎన్ని అవిసిపోయినవి ఎన్ని రద్దయినవి ఎన్న???? రాశికి వచ్చినవి ఎన్న????? తెలిసి చెప్పకపోతే తలకాయ రెండు వక్కలై చనిపోతావు తెలియక చెప్పకపోతే భుజం మీద మోస్తున్న బేతాళ శవం చెట్టు ఎక్కుతుంది.

పోసిన కుప్ప మీద కూసొని గట్టి గింజలను కావలసినంత బుక్కి, దోచుకొని దాచుకొని పంజరంలో నుంచి అప్పుడప్పుడు అతిథి నటునిలా వచ్చిపోయే ఓ విపక్ష పలుకుల చిలకల్లారా! బేతాళ విక్రమార్క కథలు ఎన్ని రోజులు సీరియల్ గా హరికథ చెప్పుతారు. చెప్పేవానికి లేకున్నా వినేవాడు ఉన్నంతసేపు నక్క-- కాకామ్మ కథలు "బొంక నేర్చినమ్మ రంకు నేర్చినట్టు" చెప్తూనే ఉంటారు.

అయ్యలారా అందరూ శాకాహారులే పత్తిత్తులు మధ్యత సంపద్వంతమైన తెలంగాణ దేశి కోడి ఎట్లా మాయమైపోయింది ఎవరు మాయ చేసారు కాచేశారు. తెల్లారి లేస్తే లక్ష్మీ కళ తాండవించే మీకూ మీ నోళ్లకు మొక్కలె. అవి నోర్లా మోర్లా.

2001 లో తెరాస నాయకుల ఆస్తులు ఎన్ని? 20 25 వచ్చేసరికి బారాస నాయకుల ఆస్తులు అంశాలు ఎన్ని? చెప్పండ్రి సార్లూ ! మీరు ఎక్కడ చెమట వాడిది ఎక్కడ గడపతో తవ్వితిని పారతో ఎత్తి తట్ట మోస్తరి తనులారా తండ్రులారా తల్లులారా గా కమాయించే ఇకమతు ప్రజలకు చెప్తే బాగుపడతారు కదా కానీ చెప్పరు. ఓటర్లు కు పందాలు ఎన్ని పడ్డా పచ్చీసులో ఎప్పటికీ గడ నొక్కదు. మీరు మాత్రం సీదా ఇంట్ల పడతారు. మిమ్మల్ని నాయకునిగా ఎన్నిక చేసుకున్న పాపానికి ఐదేళ్లకోసారి మేము ఓడిపోవడం మీరు మళ్లీ మళ్లీ గెలువడం . గిదే అంటారు. పుటుక్కు జరజర డుబుక్కుమే !

Tags:    

Similar News