తెలంగాణ పునర్నిర్మాణ కల ఫలించేనా?

తెలంగాణలో రాజకీయ పంచాయతీలు, కుట్రలు జనం బ్రతుకులో చిచ్చు పెడుతున్నాయి. ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. జనం నోరెళ్ల బెట్టి చూసే స్థితి నుండి బయట పడాలి.

Update: 2024-03-28 11:26 GMT

-రమణాచారి


తెలంగాణ పునర్నిర్మాణం, ఆరు దశాబ్దాల ప్రజల కల. నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష. దశాబ్ద కాలం తర్వాత కూడా ఎజెండాగానే మిగిలింది. పునర్నిర్మాణం అంటే కోల్పోయిన వాటిని తిరిగి సాధించుకోవడం, కావలసిన వాటిని నిర్మించుకోవడం . దీనిలో అత్యంత ప్రాధాన్యత కలిగినవి విద్యా, వైద్యం, వ్యవసాయం, సాంస్కృతిక వైభవం, స్వేచ్ఛ- సౌబ్రాతృత్వం, ప్రజాస్వామిక వాతావరణం పెంపొందించే చర్యలు చేపట్టడం. స్వపరిపాలనలో ఇవన్నీ సాధించుకోగలవనే నమ్మకంతో, త్యాగాలతో నడిచిన ఉద్యమం. సుదీర్ఘకాలం, వివిధ రూపాలలో పోరాడిన చరిత్ర యావత్ తెలంగాణ ప్రజలది.

ప్రజల ఆకాంక్ష ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కృషిచేసిన / పోరాడిన ఉద్యమకారుల నుండి సలహాలు, సూచనలు స్వీకరించి అమలు చేయగల రాజకీయ నాయకత్వం పునర్ నిర్మాణానికి ఎంతైనా అవసరం . త్యాగాల గాయాలతో తల్ల డిల్లిన తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడం పాలకుల ప్రధమ కర్తవ్యంగా ఉండాలి. పదవుల కోసం, అధికారం కోసం, సంపాదన కోసం ఎగబడుతున్న నాయకులు పునర్నిర్మాణంపై శ్రద్ధ పెడతారు అనేది భ్రమగానే మిగిలిపోవచ్చు ఏమో. నీళ్లు నిధులు నియామకాల నినాదంతో కొనసాగిన ఉద్యమమిది. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం అనేక పాయలుగా సాగింది. ప్రధానంగా ప్రజాస్వామిక తెలంగాణ, సామాజిక తెలంగాణ, భౌగోళిక తెలంగాణ, బహుజన తెలంగాణ ఇలా పలుజెండాలతో ఉవ్వెత్తున ఎగిసిపడ్డ ఉద్యమ జ్వాల అది.

 రాజకీయ పంచాయతీలు, కుట్రలు

ఆరు దశాబ్దాల సుదీర్ఘ పోరాటం తర్వాత ఏర్పడిన ప్రత్యేక రాష్ట్రం ఎలా ఉండాలి? ఎలా ఉంది? అనే అంశంప్రాధాన్యత సంతరించుకుంది. దక్షిణ భారత దేశంలో పెద్ద నదులు గోదావరి కృష్ణలు తెలంగాణలో ప్రవేశిస్తున్నా తాగు, తాగునీటి సమస్య, సమస్యగానే మిగిలి ఉంది . పాలకుల దృష్టిలోపం, సాచివేత ధోరణి ఇందుకు ప్రధాన కారణం. సకాలంలో సరైన ప్రాజెక్టుల నిర్మాణం, జల వనరుల సక్రమ వినియోగంపై శాస్త్రీయ అవగాహన లోపం కారణంగానే ఈ దుస్థితికి కారణం. భవిష్యత్తులో తెలంగాణలో నీటి సమస్య,కరెంటు సమస్య ప్రధానం కాబోతున్నాయి. సాగునీటి మాట అటు ఉంచితే , తాగునీటికి కట కట ఏర్పడే పరిస్థితులు కనపడుతున్నాయి. రాజకీయ పంచాయతీలు, కుట్రలు జనం బ్రతుకులో చిచ్చు పెడుతున్నాయి. ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం పక్కకు పెట్టి,జనం నోరెళ్ల బెట్టి చూసే పరిస్థితి నుండి బయట పడే మార్గాలు అన్వేషించాలి .

సమస్యల పరిష్కార కార్యాచరణ ఏదీ?

రైతు సమస్యల మీద,విద్యారంగ సమస్యల మీద దృష్టి సారిస్తున్నట్టు ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది. రైతు సమస్యలు అంటే విద్యుత్ సమస్య గిట్టుబాటు ధర,కల్తీ పురుగుమందులు,విత్తనాలు. అన్నిoటికంటే ప్రధానమైనవి, సాగునీటి సమస్య. మరియు కౌలు రైతుల సమస్య పోడు భూముల సమస్య, అన్యాక్రాంతమైన భూముల సమస్య లాంటి వాటిపై ఎలాంటి కార్యాచరణ ఉంటుందో స్పష్టం చేయలేదు. ఈసారి వర్షాభావం అధికంగా ఉండడం, మేడిగడ్డ సాకుగా నీటి విడుదలను ఆపేయడం మరో కొత్త సమస్యకు తెర లేపాయి. సమస్యను చేశాయి. అసలే తాగునీటి సమస్య పైగా ఎండాకాలం అంతా ముందే ఉంది. విద్యుత్ సమస్య/ సంక్షోభం తప్పదు. వీటిని పరిష్కరించే కార్యాచరణ కానరావడం లేదు.


సంక్షేమ పథకాల అమలుతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా సంక్షోభంలో కూలిపోయింది. ఉద్యోగుల మెప్పు కోసం మొదటి తారీకు జీతాలు మాత్రమే అమలవుతున్నాయి. బకాయలు ఎప్పుడు చెల్లిస్తారో చెప్పలేం. విద్యారంగ అభివృద్ధి కోసం 500 కోట్లతో ప్రతి మండలంలో ఒక భవనం ఏర్పాటు చేస్తామంటున్నారు. ఇప్పటికేభవనాల సంఖ్య ఇబ్బంది లేకున్నా ,ఉపాధ్యాయుల కొరత, మౌలిక వనరుల కోసం తిప్పలు పడుతున్నారు. కొత్త భవనాల నిర్మాణం అవసరం ఏమున్నట్లు ? కొత్త ఫ్లైఓవర్లు, రోడ్ల విస్తరణలు, కొత్త భవనాలు, కొత్త నిర్మాణాలు ఇప్పటికిప్పుడు ప్రధాన అంశాలు కావు .

వ్యవసాయ రంగ అభివృద్ధికి కమిషన్ వేసిన పాలకులు వ్యవసాయ యూనివర్సిటీ స్థలాన్ని, హైకోర్టు భవన నిర్మాణానికి కేటాయించి చారిత్రక తప్పదమే చేశారు. దీనిపై పౌర సమాజం నుంచి ఎలాంటి సూచన, సలహా స్వీకరించలేదు. పౌర సమాజ ప్రతినిధులు కూడా మొక్కుబడిగా నిరసించారు. విద్యార్థుల నిరసన కానరాకుండా ప్రయోగాలు పరీక్ష నిర్వహించి ఉధృతి కానరాకుండా మీడియాను మేనేజ్ చేసి గుట్టు చప్పుడు కాకుండా పరాయీకరణ చేశారు. యూనివర్సిటీ పాలకుల తప్పిదం కూడా తక్కువేమీ కాదు, బాధ్యతారాహిత్యం అనవచ్చు.

తెలంగాణలో ఉద్యమకారుల ఊసేలేదు

తెలంగాణ సిద్ధించాక పూర్తిగా విస్మృతిలోకి నెట్టబడిన వారు ఉద్యమకారులు.  ఉద్యమకారులతో చర్చలు లేవు. నిర్బంధo విషయానికొస్తే ఉపా కేసులు ఎత్తివేయలేదు. ఫార్మాసిటీ రద్దు చేయలేదు. మహబూబ్నగర్ లో నిమ్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం నిలిపేయలేదు. ఉత్తర తెలంగాణలో విస్తరించి ఉన్న సింగరేణి భవిష్యత్తుపైన హామీ లేదు అరుణోదయ సంస్థను నిషేధ సంస్థగా ప్రకటించారు. దీనిపై ఎలాంటి అభిప్రాయం లేదు. భువనగిరిలో ఇద్దరు హాస్టల్ విద్యార్థులను / బాలికల అనుమానాస్పద మరణం పై నిరసన అడ్డుకున్నారు. పౌర హక్కుల సంఘం సభల ర్యాలీ అనుమతించలేదు. సాంస్కృతిక పునరూజ్జీ వనంపై చర్చకు సమయమే ఇవ్వడం లేదు. మావోయిస్టులు రావాలి, నియంత పాలన పోవాలని అని నినదించిన, నాటి పీసీసీ అధ్యక్షుడు,నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ పార్టీపై నిషేధం విషయంలో ఎలాంటి స్పందన లేదు. అమరుల బంధుమిత్రుల సంఘం సంఘం డిమాండ్ కూడా ఇదే కదా!కూంబింగ్ లతో ప్రజలలో కలిగే భయభ్రాంతులను తొలగించే చర్యలను నిలిపివేసి ఆదేశాలు ప్రభుత్వం ఇవ్వలేదు.

తెలంగాణ ప్రజలు ఆకలి అయిన భరిస్తారు గానీ, స్వేచ్ఛ పైన దాడి జరిగితే మాత్రం సహించరు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టు తెలిసింది. ఒక రకంగా దీనిని ఆయన మాటలలో వచ్చిన గణనీయ మార్పుగా గుర్తించాలి. తెలంగాణ ఉద్యమంపై తుపాకీ ఎక్కువ పెట్టి, తెలంగాణ ఉద్యమాన్ని అతి క్రూరంగా అణచివేసిన తెలుగుదేశం పార్టీలో సంవత్సరం క్రితం వరకు కొనసాగిన మనిషి ఇలా మాట్లాడడం కొంత ఆశ్చర్యం కలిగించక మానదు. అయినా కాంగ్రెస్ పార్టీలో చేరడం ముఖ్యమంత్రి కావడం చక చకా జరిగిపోయాయి.


పౌర ప్రజాస్వామికవాదులు గళం ఎత్తాల్సిన సమయం


అధికారం దక్కించుకోవడానికి, దీర్ఘకాలం పదవిలో ఉండాలంటే పౌర సమాజం ముందు ఇలాంటి పదాలు వాడడం రాజకీయ పార్టీలకు, నేతలకు అవసరమే.నక్సలైట్లే దేశభక్తులని నినదించిన ఎన్టీఆర్ ( తెలుగుదేశం పార్టీ),రాజకీయ ఆర్థిక,సమస్యగా గుర్తించి చర్చలు జరుపుతామన్న వై. ఎస్. ఆర్.( కాంగ్రెస్ పార్టీ), మావోయిస్టు ఎజెండా తమ ఏజెండాగా ప్రకటించిన కేసీఆర్. (టిఆర్ఎస్ పార్టీ) ల నినాదాలను, కార్యాచరణను మరువరాదు. ఆచరణ గీటు రాయగా అర్థం చేసుకోవాలి. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి.

గత ఎన్నికలలో ఇచ్చిన హామీలు అమలు కోసం పౌర ప్రజాస్వామికవాదులు గళం ఎత్తాల్సిన సమయం ఇది. ఇప్పటికే ఇచ్చిన హామీల అమలు కోసం, ప్రజాస్వామిక వాతావరణ ఏర్పాటు కోసం, రాజకీయ పార్టీ లను నిలదీయాల్సిన సమయమిది. మౌలిక సమస్యల చర్చించకుండా, పరిష్కారం కోసం కృషి చేయకుండా పాలకుల వాగ్దానాల వలలో చిక్కితే పులి -బంగారు కంకణం కథ పునరావృతం అవుతుంది. దీనిని  పౌర ప్రజాస్వామిక వాదులు గుర్తించాలి.

(ఇందులో వ్యక్తం చేసిన అభిప్రాయాలన్నీ రచయిత వ్యక్తిగతం. ఫెడరల్ తెలంగాణ ఒక ప్రజాస్వామిక వేదిక. రచయితల అభిప్రాయాలతో  ఏకీభవించనవసరం లేదు)


Tags:    

Similar News