విమాన ప్రమాద మృతులకు కొనసాగుతున్న డీఎన్ఏ పరీక్షలు
220 మృతదేహాల గుర్తింపు; కుటుంబసభ్యులకు 202 అప్పగింత..;
అహ్మదాబాద్(Ahmedabad) విమాన ప్రమాద మృతులకు డీఎన్ఏ పరీక్షలు (DNA Test) కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 220 మృతదేహాలకు పరీక్షలు పూర్తిచేశారు. వీటిలో 202 మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించామని గుజరాత్ ఆరోగ్యశాఖ మంత్రి రుషికేష్ పటేల్ శుక్రవారం (జూన్ 20) తెలిపారు.
విమాన సిబ్బందితో కలిపి మొత్తం 242 మంది ప్రయాణికులతో అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం AI-171.. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే మేఘనినగర్ ప్రాంతంలోని వైద్య కళాశాల హాస్టల్ భవనంపై కూలిపోయిన విషయం తెలిసింది. జూన్ 12న జరిగిన ఈ దుర్ఘటనలో ఒక్క ప్రయాణికుడు తప్ప మిగతా వాళ్లంతా సజీవ దహనమయ్యారు. విమానం భవనంపై కూలిపోవడంతో మరో 29 మంది చనిపోయారు.
"ఇప్పటివరకు 220 DNA నమూనాలను సరిపోల్చారు. 202 మృతదేహాలను ఇప్పటికే వారి బంధువులకు అప్పగించారు. మరికొన్ని మృతదేహాలను గుర్తించాల్సి ఉంది," అని ఆరోగ్య శాఖ మంత్రి రుషికేష్ పటేల్ అన్నారు. 15 మృతదేహాలను విమానంలో వారి గమ్యస్థానాలకు చేర్చామని, 187 మృతదేహాలను రోడ్డు మార్గం ద్వారా తరలించినట్లు మంత్రి తెలిపారు.