బెంగళూరు చిన్నస్వామి స్టేడియం సమీపంలో తొక్కిసలాట - పది మంది మృతి
పదుల సంఖ్యలో స్పృహకోల్పోయిన క్రికెట్ అభిమానులు;
బెంగళూరు(Bangalore) చిన్నస్వామి స్టేడియం సమీపంలో బుధవారం (జూన్ 4) తొక్కిసలాట(Stampede) జరిగింది. ఈ ఘటనలో పది మంది మృతి చెందారు. 50 మందికి పైగా గాయపడ్డారు. నిన్న (జూన్ 3వ తేదీ) జరిగిన ఐపీఎల్ ఫైనల్స్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) విజేతగా నిలిచింది. దీంతో జట్టు సభ్యులకు స్టేడియంలో ప్రత్యేక సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ సన్మాన కార్యక్రమానికి అభిమానులు భారీగా తరలివచ్చారు. ఒక్కసారిగా స్టేడియం సమీపంలో తొక్కిసలాట జరగడంతో కొంతమంది కిందపడిపోయారు. ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. ఇక స్పృహతప్పిన, గాయపడ్డ వారిని పోలీసులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ఆర్సీబీ మంగళవారం (జూన్ 3) అహ్మదాబాద్లో జరిగిన ఫైనల్లో పంజాబ్ కింగ్స్పై 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. బుధవారం మధ్యాహ్నం ఆర్సీబీ జట్టు సభ్యులు బెంగళూరు చేరుకున్నారు. జట్టు సభ్యులకు డిప్యూటీ సీఎం డి.కె. శివకుమార్ విమానాశ్రయంలో స్వాగతం పలికారు. అనంతరం సీఎం సిద్ధరామయ్యను కలిసేందుకు టీం సభ్యులు బయలుదేరారు. విధాన సౌధ వరకు అభిమానులు రోడ్డుకు రెండు వైపులా నిలబడి హర్షధ్వానాలతో స్వాగతం పలికారు. ముఖ్యమంత్రిని కలిసిన అనంతరం ఆర్సీబీ జట్టు సభ్యులు ఎం.చిన్నస్వామి స్టేడియం(Chinnaswamy Stadium)కు బయలుదేరారు. సీఎం ప్రత్యేక అనుమతితో విధాన సౌధ నుంచి స్టేడియం వరకు ఓపెన్ టాప్ బస్ విజయోత్సవ ర్యాలీ ప్రారంభమైంది.