పశ్చిమ బెంగాల్లో ఉపాధ్యాయుల నుంచి ఈసీకి ఎదురుదెబ్బ?
BLO విధుల నుంచి మినహాయింపు కోరుతున్న టీచర్లు..;
బీహార్లో లాగా పశ్చిమ బెంగాల్(West Bengal)లోనూ ఎలక్షన్ కమిషన్ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ (S.I.R)ను చేపట్టనుంది. అయితే BLOలుగా నియమితులైన ఉపాధ్యాయులు తమకు ఆ విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు. కారణాలను విశ్లేషిస్తే..
బీహార్లో 50 లక్షల ఓటర్ల తొలగింపు..
బీహార్ రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణ (S.I.R) ప్రక్రియ పూర్తయ్యింది. జూలై 1 ప్రారంభమైన ఈ డ్రైవ్ 25వ తేదీతో ముగిసింది. మరణించిన ఓటర్లు, శాశ్వతంగా వలస వెళ్లిన ఓటర్లు, రెండు చోట్ల ఓటు హక్కు నమోదు చేసుకున్న ఓటర్లను తొలగించడమే లక్ష్యంగా చేపట్టిన ఈ ప్రక్రియలో బీఎల్వోలు ఇంటింటికి తిరిగి వివరాలు సేకరించారు.
18 లక్షల మంది ఓటర్లు చనిపోయారని, 26 లక్షల మంది ఇతర ప్రాంతాలకు షిఫ్ట్ అయ్యారని, రెండు చోట్ల పేర్లు నమోదు చేసుకున్న ఓట్లరు 7 లక్షల మంది ఉన్నారని ఈసీ తేల్చింది.
ఇదివరకే చెప్పిన ఈసీ..
ఇలాంటి ప్రక్రియను మిగతా రాష్ట్రాల్లోనూ అమలు చేస్తామని ఎలక్షన్ కమిషన్ ముందుగానే చెప్పింది. వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ కూడా S.I.R చేపట్టబోతుంది. అయితే కొంతమంది ఉపాధ్యాయులు ఈ డ్రైవ్లో పాల్గొనేందుకు విముఖత చూపుతున్నారు. కొంతమంది ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు చూపుతూ విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని డీఈవోకు వినతులు సమర్పిస్తున్నారు.
‘విద్యార్థులపై ప్రభావం చూపుతుంది..’
"ఈసారి BLOలుగా నియమితులయిన ఉపాధ్యాయులపై పనిభారం పెరిగింది. S.I.R గైడ్లైన్స్ ప్రకారం ఇంటింటికీ తిరిగి క్షుణ్ణంగా పూర్తి వివరాలు సేకరించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో రాజకీయ నాయకుల నుంచి ఒత్తిళ్లు రావచ్చు. ఈ అదనపు పనిభారం విద్యార్థులపై ప్రభావం చూపుతుంది. పరీక్షా పత్రాల మూల్యాంకనంతో సహా విద్యా కార్యకలాపాలకు అంతరాయం కలుగుతుంది,’’అని ఉస్తి యునైటెడ్ ప్రైమరీ టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (UUPTWA) నార్త్ 24 పరగణాస్ యూనిట్ జిల్లా కార్యదర్శి పరమిత దాస్ ది ఫెడరల్కు చెప్పారు.
మినహాయించాలని కోరుతూ..
‘‘నా వ్యక్తిగత, కుటుంబ బాధ్యత కారణంగా నాకు BLO బాధ్యతల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నా. ఈ విషయం మీకు తెలియజేయడానికి చింతిస్తున్నాను” అని మొహమ్మద్ కైసర్ రషీద్ ముర్షిదాబాద్ DEOకి రాసిన లేఖలో కోరారు. ఉత్తర బెంగాల్లోని కూచ్ బెహార్కు చెందిన మరో ఉపాధ్యాయుడు వైద్య కారణాల వల్ల విధుల నుంచి తప్పించాలని వినతిపత్రం ఇచ్చారు.
ఉపాధ్యాయులు ఎందుకు జంకుతున్నారు?
S.I.R గైడ్లైన్స్ ప్రకారం విధులు నిర్వహించే సమయంలో రాజకీయ నాయకుల నుంచి ఒత్తిళ్లు రావచ్చని, అందుకు భయపడుతున్నారని బెంగాల్ మదర్సా విద్యా వేదిక కూచ్ బెహార్ జిల్లా కార్యదర్శి ఖుర్షీద్ ఆలం పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో మానవ తప్పిదం వల్ల ఏదైనా తేడా వస్తే BLOలు సస్పెన్షన్తో పాటు క్రమశిక్షణా చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. బీహార్లో చాలా మంది BLOలను సస్పెండ్ కూడా చేశారు.’’ అని వివరించారు.
బీహార్ రాష్ట్రంలోని ముజఫర్పూర్ జిల్లాలో ఓటర్ల ధృవీకరణ ప్రక్రియలో జరిగిన అవకతవకల కారణంగా దాదాపు 60 మంది బిఎల్ఓల జీతాలు నిలిచిపోయాయి. విధుల్లో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలపై మరికొందరు సస్పెన్షన్కు గురయినట్లు మీడియాలు కథనాలు వచ్చాయి.
ఇంతకష్టపడి వివరాలు సేకరించినందుకు BLOలకు ఇచ్చే గౌరవ వేతనం కేవలం రూ. 6,000. BLO విధులకు వేతనాన్ని ఓవర్ టైం వేతనంగా పరిగణించాలని గతంలో ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి.
అనేక పాఠశాలల్లో ఇప్పటికే ఉపాధ్యాయుల కొరత ఉంది. SIR బాధ్యతల వల్ల పిల్లల చదువులపై పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
‘క్రమశిక్షణా చర్యలుంటాయి’
"రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా నోటిఫికేషన్ జారీ అయ్యింది. సరైన కారణాలు లేకుండా BLOలు మినహాయింపు కోరితే షో-కాజ్ నోటీసు జారీ చేస్తాం. వారి వివరణ సంతృప్తికరంగా లేకపోతే చర్యలు తీసుకుంటాం," అని బీహార్లోని ముర్షిదాబాద్ DEO రాజర్షి మిత్ర మీడియాకు తెలిపారు. ఇలాంటి హెచ్చరికలు పశ్చిమ బెంగాల్ అంతటా ఉపాధ్యాWest Bengal
EC faces Bengal teachers' 'rebellion'య సంఘాలను ఏకతాటిపైకి వచ్చేలా చేస్తున్నాయి.
SIRను అనుమతించం: మమతా
రాష్ట్రంలో SIR లాంటి ఏ కార్యకలాపాన్ని అనుమతించమని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) ఇటీవల ఓ ప్రకటన చేసింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీజేపీ ఆమె పాలనకు ఎండ్ కార్డు వేయాలని చూస్తుంది.
దేశంలోనే అత్యధిక జనాభా గల పశ్చిమ బెంగాల్లో చివరిసారిగా 2002లో ఓటర్ల జాబితాలను క్షుణ్ణంగా సమీక్షించారు. దాదాపు 28 లక్షల మంది పేర్లను తొలగించారు.