రూ.4వేల కోట్ల కుంభకోణంపై విచారణ
ఐపీడీఎల్ భూముల అంశంలోకి విజిలెన్స్ శాఖ ఎంట్రీ.
ఐడీపీఎల్ భూముల కుంభకోణం అంశంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. రూ.4వేల కోట్ల కుంభకోణంపై వెంటనే దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కొంతకాలంగా ఈ భూముల వ్యవహారంపై తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఈ భూములకు ఆక్రమించారంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో ఐడీపీఎల్ భూముల మంట రాజుకుంది. ఇది కాస్తా ఇప్పుడు విచారణకు దారితీసింది. కొంతకాలంగా తెగ వినిపిస్తున్న ఈ కుంభకోణంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అసలు ఐపీడీఎల్ భూముల అంశంలో నిజానిజాలు ఏంటో? తేల్చాలని ప్రభుత్వం భావించింది. అందుకే సమగ్ర దర్యాప్తు చేయాలంటూ విజిలెన్స్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది.
వివాదం మొదలు ఎక్కడంటే!
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తన ‘జాగృతి జనం బాట‘ పర్యటనలో భాగంగా ఇటీవల కూకట్పల్లి ప్రాంతంలోని సమస్యలను ప్రస్తావించారు. ఈ సందర్బంగానే అక్కడ భారీగా భూములు కబ్జా అయ్యాయని, అందుకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బాధ్యులంటూ సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై మాధవరం కృష్ణారావు ఘాటుగా స్పందించారు. కవిత చేసిన ఆరోపణలను పూర్తిగా ఖండించారు. కౌంటర్గా కవిత భర్తకు ఐడీపీఎల్ భూములతో సంబంధం ఉందని, 36 ఎకరాల భూమి ఎలా వచ్చిందో ప్రజలకు స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మాటల యుద్ధం క్రమంగా రాజకీయ దుమారం రేపింది.
వివాదం మరింత ముదరడంతో మాధవరం కృష్ణారావు, బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, అలాగే ఓ మీడియా ఛానల్కు కవిత లీగల్ నోటీసులు పంపారు. వారం రోజుల్లో బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో న్యాయపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ వివాదం రోజురోజుకు అధికం అవుతున్న క్రమంలో ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఈ భూముల కబ్జా అంశంపై విచారణ జరపాలని తెలిపింది.
మాధవరం ఆత్మాహుతి బెదిరింపులు
తాను భూ కబ్జాలకు పాల్పడ్డారంటూ వస్తున్న ఆరోపణలపై కూకట్పల్లి కృష్ణారావు.. డిసెంబర్ 11న స్పందించారు. తాను కబ్జాలు చేసినట్లు నిరూపిస్తే జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. తనపై చేస్తున్నవన్నీ అసత్య ఆరోపణలేనని కొట్టిపారశారు. తాను ప్రజల కోసమే పనిచేశానని, తానంటే ఏంటో ప్రజలకు బాగా తెలుసని అన్నారాయన. కబ్జాల ఆరోపణలపై గురువారం ఆయన స్పందించారు. ఇద్దరు నేతలు కావాలనే తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐీపీఎల్ భూముల్లో పేదలు నివాసం ఉంటున్నారని, వారి జోలికి వెళ్తే తాను ఆత్మాహుతి చేసుకుంటానని ఆయన హెచ్చరించారు.
దర్యాప్తు జరగాలని డిమాండ్
ఈ క్రమంలోనే అసలు ఐడీపీఎల్ భూముల ఆక్రమణలపై లోతైన దర్యాప్తు జరగాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జాలను పాల్పడుతున్నారని, ఈ అంశంపై తాను గతంలోనే చాలా సార్లు ఫిర్యాదు చేశానని ఆయన చెప్పారు. తాను ఐడీపీఎల్ ఉద్యోగులను బెదిరించానని వస్తున్న వార్తల్లో కూడా ఎటువంటి వాస్తవం లేదని అన్నారు. ఆ వార్తలను తాను పూర్తిగా ఖండిస్తున్నానని చెప్పారు.
ఐడీపీఎల్ ఉద్యోగుల ఆరోపణలు ఇవి
హైదరాబాద్ను ఫార్మా క్యాపిటల్గా నిలబెట్టిన ఐడీపీఎల్ (ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్) భూములు పెద్ద ఎత్తున ఆక్రమణలకు గురవుతున్నాయని ఉద్యోగులు ఘోర ఆరోపణలు చేస్తున్నారు. 1961లో ఏర్పాటు చేసిన ఐడీపీఎల్కు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం మూసాపేట, బాలానగర్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్లో 902 ఎకరాలు కేటాయించగా, పరిశ్రమ మూతపడిన తర్వాత భూముల విలువ పెరగడంతో ప్రభావశీలులు, రియల్టర్లు, కొందరు నేతలు కలిసి భూములను కబ్జా చేస్తున్నారని చెబుతున్నారు.
ఇప్పటికే 150 ఎకరాలు అక్రమంగా చేతులు మారాయని, వీటి విలువ సుమారు రూ.4,000 కోట్లు ఉంటుందని సమాచారం. ఈ దందాలో కొంతమంది ఐడీపీఎల్ ఉన్నతాధికారుల పాత్ర కూడా ఉందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. రెవెన్యూ అధికారులు, కలెక్టర్, పోలీసులు, డీజీపీ వరకు ఫిర్యాదులు చేసినా స్పందన లేకపోవడం బాధాకరమని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు వెంటనే జోక్యం చేసుకుని ఐడీపీఎల్ భూములను రక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.