ఏపీపీఎస్సీ చైర్‌పర్సన్‌గా మాజీ ఐపీఎస్‌ అనురాధ

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ ఐపీఎస్‌ అధికారి అనురాధను ఏపీపీఎస్సీ చైర్‌పర్సన్‌గా నియమించింది.

Update: 2024-10-23 12:10 GMT

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్‌పర్సన్‌గా మాజీ ఐపీఎస్‌ అధికారిని నియమించింది. రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి ఏఆర్‌ అనురాధను ఏపీపీఎస్సీ చైర్‌పర్సన్‌గా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అనురాధ గతంలో ఇంటెలిజెన్స్‌ చీఫ్, హోంశాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆంధ్రప్రదేశ్‌ ఇంటెలిజెన్స్‌ విభాగాని చీఫ్‌గా పని చేసిన మొదటి మహిళా ఐపీఎస్‌ అధికారిగా అనురాద గుర్తింపు పొందారు. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీగా కూడా ఆమె పని చేశారు. 1987 బ్యాచ్‌కు చెందిన ఏఆర్‌ అనురాధ మరో మాజీ ఐపీఎస్‌ అధికారి నిమ్మగడ్డ సురేంద్రబాబు సతీమణి. అయితే ఇది వరకు ఏపీపీఎస్సీ చైర్మన్‌ కూడా ఐపీఎస్‌ అధికారే ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వం మాజీ ఐపీఎస్‌ అధికారి గౌతమ్‌ సవాంగ్‌ను ఏపీపీఎస్సీ చైర్మన్‌గా నియమించింది. అయితే సార్వత్రిక ఎన్నికల్లో జగన్‌ ప్రభుత్వం ఓడిపోవడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అప్పటి గతమ్‌ సవాంగ్‌ తన చైర్మన్‌ పదవికి రాజీనామా చేశారు. సవాంగ్‌ రాజీనామా తర్వాత నాలుగు నెలల పాటు ఈ పదవి ఖాళీగానే ఉంది. తాజాగా అనురాధను ఏపీపీఎస్సీ చైర్‌పర్సన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.

Tags:    

Similar News