సివిల్ సర్వెంట్లు పార్టీ అభ్యర్థులుగా మారుతున్నారా?
టీవీకే లో చేరిన ఆదాయపు పన్ను శాఖ అధికారి కేజీ అరుణ్ రాజ్;
By : The Federal
Update: 2025-06-09 12:54 GMT
మహాలింగం పొన్నుస్వామి
ఐఆర్ఎస్ అధికారి కేజీ అరుణ్ రాజ్, ప్రముఖ నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం(టీవీకే) లో చేరారు. ఆయనకు పాలసీ అండ్ ప్రచార జనరల్ సెక్రటరీగా పార్టీ అవకాశం ఇచ్చింది.
ఇప్పటికే అనేక మంది అధికారులు బ్యూరోక్రసీ నుంచి తప్పుకుని రాజకీయాల్లో చేరారు. కేజీ అరుణ్ రాజ్ ఇంతకుముందు వైద్యుడిగా సేవలందించారు.
తమిళనాడులోని సేలం జిల్లాకు చెందిన అరుణ్ రాజ్ మద్రాస్ మెడికల్ కాలేజీ నుంచి గ్రామీణ ఆరోగ్య సంరక్షణ సేవలతో పాటు ఎంబీబీఎస్ పూర్తి చేశారు. 2009 లో యూపీఎస్సీ పరీక్ష రాసి ఆదాయపన్ను శాఖలో చేరారు.
2016 లో చేసిన రైడ్ లో 90 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న ఘటనలో ఆయన పేరు మారుమోగిపోయింది. తమిళనాడు, బీహార్, మహారాష్ట్రలో ఆయన సమర్థవంతుడైన అధికారిగా సేవలందించారు. గత నెలలో రాజకీయాలను చేరడానికి స్వచ్చంద పదవీ విరమణ చేశారు.
టీవీకే లో చేరిక..
అరుణ్ రాజ్ చేరికను ధృవీకరిస్తూ టీవీకే ప్రెస్ నోట్ లో పార్టీ నాయకుడితో విజయ్ తో ఆయనకున్న దీర్ఘకాల బంధం 2009 లో ప్రారంభమైందని పేర్కొంది. అరుణ్ రాజ్ టీవీకే నాయకత్వంలో కీలక సభ్యుడిగా మారడానికి సిద్దంగా ఉన్నారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయంగా ముఖ్యమైన కొంగునాడు బెల్ట్ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది.
‘‘నేను డాక్టర్ గా ఉన్నప్పటి నుంచే పరిపాలన పట్ల ఆకర్షితుడయ్యాను. అది నన్ను యూపీఎస్సీ వరకూ నడిపించింది. కానీ రాజకీయాలు ప్రజలకు సేవ చేయడానికి అంతిమ వేదికగా ఉపయోగపడతాయి’’ అని అరుణ్ రాజ్ అన్నారు.
నిర్భయ అధికారి..
అరుణ్ రాజ్ అధిక ఆదాయపు పన్ను దాడులకు నాయకత్వం వహించే నిర్భయ అధికారిగా ఖ్యాతిని సంపాదించాడు. మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి ఎన్ శశికళ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని మెగా దాడులు చేశారు.
అలాగే రాజకీయంగా సున్నితంగా ఉన్న కోడనాడు ఎస్టేట్ కేసుకు సంబంధించిన దర్యాప్తులో కీలకంగా వ్యవహరించారు. సివిల్ సర్వీస్ ఆశించేవారి కోసం రూపొందించబడిన రాజ్యాంగంపై తన సెషన్ లకు ఆయన ప్రసిద్ది చెందారు.
బ్యూరోక్రసీ నుంచి రాజకీయాల్లోకి..
తమిళనాడులో పౌర సేవకులు రాజకీయాల్లోకి ప్రవేశించే ధోరణి పెరుగుతున్న నేపథ్యంలో అరుణ్ రాజ్ ఈ చర్యకు ప్రాధాన్యం సంతరించుకుంది. రాజకీయాల్లో చేరిన మాజీ అధికారుల జాబితా, వారి జాబితాలు కింద పేర్కొన్నారు.
వీఎస్ చంద్రలేఖ (1971 బ్యాచ్ ఐఏఎస్)
తమిళనాడు తొలి మహిళా కలెక్టర్ అయిన ఆమె 1992 లో రాజీనామా చేసి జనతా పార్టీలో చేరారు. ఆ పార్టీ 2013 లో బీజేపీలో విలీనమైంది. ఆమె ఇప్పటికి బీజేపీ నాయకుడు సుబ్రమణియన్ స్వామికి సన్నిహితురాలిగా ఇప్పటికి ఉన్నారు.
ఆర్. నటరాజన్( 1975 బ్యాచ్ ఐపీఎస్)
తమిళనాడు మాజీ డీజీపీ నటరాజ్ 2014 లో అన్నాడీఎంకేలో చేరారు. 2016 లో మైలాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. కానీ 2021 ఎన్నికల్లో ఆయన ఓటమి చెందారు. ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో చురుకుగా లేరు.
ఏఎక్స్ అలెగ్జాండర్( 1970 బ్యాచ్ ఐపీఎస్)
తమిళనాడు మాజీ డీజీపీ అయిన అలెగ్జాండర్ 2014 లో అన్నాడీఎంకే లో చేరారు. కానీ పార్టీ టికెట్ సాధించడంలో విఫలమయ్యారు. తరువాత ఆయన రాజకీయాల్లో చురుకుగా లేరు.
కే. మలైస్వామి ( సీనియర్ ఐఏఎస్)
పదవీ విరమణ తరువాత మలైస్వామి అన్నాడీఎంకే లో చేరారు. రామనాథపుర ఎంపీగా 1999-2004 వరకూ పనిచేశారు. తరువాత రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. మోదీ కూటమిని సమర్థించినందుకు 2014 లో పార్టీ నుంచి బహిష్కరించారు. 2015 లో బీజేపీ లో చేరారు.
పి. శివగామి (1980 బ్యాచ్ ఐఏఎస్)
2008 లో వీఆర్ఎస్ తరువాత శివగామి బీఎస్పీలో చేరారు. తరువాత సొంతంగా సముగ సమతువ పడైని స్థాపించారు. 2016 లో పెరంబలూర్ లో అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే చిహ్నంతో పోటీ చేసి ఓడిపోయారు.
ఏజీ మౌర్య( 1997- బ్యాచ్ ఐపీఎస్)
2018 లో మక్కల్ నీది మయ్యమ్ (ఎంఎన్ఎం) చేరి, ఇప్పుడు పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఆయన 2019లో చెన్నై నార్త్ లోక్ సభ స్థానానికి పోటీ చేశారు. కానీ ఆయన డీఎంకే కళానిధి వీరాస్వామి చేతిలో ఓడిపోయారు.
ఆర్ రంగరాజన్( 2005 బ్యాచ్ ఐఏఎస్)
అస్సాం కేడర్ మాజీ ఐఏఎస్ అధికారి అయిన రంగరాజన్ 2018లో ఎంఎన్ఎం లో చేరారు. 2019 లో చెన్నై సౌత్ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
సంతోష్ బాబు( 1995- బ్యాచ్ ఐఏఎస్)
వైద్యుడి నుంచి ఐఏఎస్ అధికారిగా మారిన బాబు 2020 లో వీఆర్ఎస్ తీసుకుని కమల్ హసన్ పార్టీలో చేరారు. 2021 లో వేలచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవలేకపోయారు. వ్యక్తిగత కారణాలను చూపుతూ ప్రధాన స్రవంతి రాజకీయాలను విడిచిపెట్టారు.
కే. అన్నామలై( 2011 బ్యాచ్ ఐపీఎస్)
2019 లో కర్ణాటకలో ఎస్పీ పదవికి రాజీనామా చేసి 2020 లో బీజేపీ లో చేరారు. ఆయన తమిళనాడులో చాలా ప్రముఖ వ్యక్తిగా ఎదిగారు. ఆయన ఇప్పుడు పార్టీ తమిళనాడు యూనిట్ అధిపతి కానప్పటికీ ఆయనకు చాలా పలుకుబడి ఉంది.
శశికాంత్ సెంథిల్( 2009 బ్యాచ్ ఐఏఎస్)
కర్ణాటక కేడర్ మాజీ ఐఏఎస్ అధికారి అయిన సెంథిల్ కాంగ్రెస్ లో చేరారు. 2024 లో తిరువల్లూర్ లోక్ సభ స్థానాన్ని రికార్డు స్థాయిలో 5,72,155 ఓట్ల తేడాతో గెలుచుకుని రాహుల్ గాంధీ బృందంతో జతకట్టారు.