‘అక్కడ ఇక్కడా ఎందుకు కేటీఆర్.. అసెంబ్లీకి రండి’
బీఆర్ఎస్ పాలనలో జరిగిన వైఫల్యాలపై చర్చ జరిగితేనే తెలంగాణకు న్యాయం.;
తెలంగాణ రాజకీయాల్లో రసవత్తరంగా మారుతున్నాయి. సవాళ్లు ప్రతిసవాళ్లతో రంజురంజుగా మారాయి. సీఎం రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ చేసినట్లే కేటీఆర్, బీఆర్ఎస్ నేతలను వెంటబెట్టుకుని ఈరోజు(మంగళవారం) సోమాజీగూడ ప్రెస్క్లబ్కు చేరుకున్నారు. తెలంగాణలో రైతులకు కాంగ్రెస్ సర్కార్ అందిస్తున్న సంక్షేమంపై చర్చించడానికి ప్రెస్క్లబ్ను బీఆర్ఎస్ నేతలు గంటసేపటి కోసం బుక్ చేశారు. కాగా ఈ చర్చకు సీఎం రేవంత్ రాకపోవడంతో కేటీఆర్.. ప్రెస్మీట్ పెట్టి.. రేవంత్పై విమర్శలు గుప్పించారు. చేతకాని మాటలు సెప్పుడు తప్ప రేవంత్కు ఏమీ రాదంటూ ఘాటుగా విమర్శించారు. అంతేకాకుండా రేవంత్ భయపడి ఉంటే డిప్యూటీ సీఎం, హోంమంత్రి ఇంకెవరైనా రావొచ్చని, తాము పూర్తి వివరాలతో చర్చకు వచ్చామని కేటీఆర్ చెప్పారు. కాగా కేటీఆర్ విమర్శలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమమార్క స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీకి వచ్చే దమ్ములేని మీరా కాంగ్రెస్ గురించి మాట్లాడేది అంటూ మండిపడ్డారు.
‘‘కేసీఆర్కు రేవంత్ ఛాలెంజ్ను కేటీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. కేటీఆర్ మాట్లాడే ప్రతి మాట క్షుద్ర రాజకీయాలకు నిదర్శనం. ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. భవిష్యత్తులో బీఆర్ఎస్కి డిపాజిట్లు కూడా రావని కాలం తేలుస్తుంది. దమ్ముంటే అసెంబ్లీకి రండి. సమస్యలపై నిజంగా చర్చ చేయాలంటే ప్రెస్క్లబ్లో కాదు, అసెంబ్లీలో రండి. ప్రభుత్వంగా మేము సిద్ధంగా ఉన్నాం. చర్చకు వేదిక ప్రజాప్రతినిధుల సభే’’ అని అన్నారు.
కేసీఆర్కు ప్రత్యేక ఆహ్వానం
‘‘నిజంగా ప్రజా సమస్యలపై మాట్లాడాలి, చర్చించాలి వాటిని పరిష్కరించాలి అనుకుంటే మాజీ సీఎం కేసీఆర్గారు అసెంబ్లీలోకి వచ్చి చర్చించాలి. జలవనరులు, వ్యవసాయం, సంక్షేమం… అన్నింటిపై సిద్ధంగా ఉన్నాం. గోదావరి–కృష్ణ జలాలపై అసెంబ్లీలోనే తేలుద్దాం. తెలంగాణకు న్యాయం జరగాలంటే గోదావరి, కృష్ణా నదుల జలాల విషయంలో బీఆర్ఎస్ పాలనలో జరిగిన వైఫల్యాలపై చర్చ అనివార్యం. రివర్స్ టెండరింగ్ ద్వారా తక్కువ ఖర్చుతో మంచి పనులు చేస్తున్నాం. ప్రజల సమస్యలపై చర్చించాల్సింది బీఆర్ఎస్.. వారు నేతల తీరును విమర్శించడం సరికాదు. అయినా కూడా వాళ్ల మాటలకు తగిన బదులు అసెంబ్లీలో ఇస్తాం’’ అని స్పష్టం చేశారు భట్టి.