‘కేంద్రం సరిగా స్పందించకపోతే సుప్రీంకోర్టుకెళ్తాం’

కేంద్ర స్పంద‌న అనుకూలంగా లేక‌పోతే సుప్రీంకోర్టును ఆశ్ర‌యిస్తామ‌ని కేంద్ర మంత్రికి సీఎం స్ప‌ష్టం చేశారు.;

Update: 2025-06-19 11:07 GMT

బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో కేంద్ర సరైన నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో బనచర్ల ప్రాజెక్ట్ గురించి చర్చించారు. తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా నిర్మిస్తున్న ప్రాజెక్ట్‌ను అడ్డుకోవాలని కోరారు. కేంద్ర స్పందన న్యాయపరంగా లేనిపక్షంలో తాము సుప్రీంకోర్టుకు వెళ్తామని, ఎంత దూరమైనా వెళ్లి తెలంగాణ హక్కులను కాపాడుకుంటామని అన్నారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీ అన్న మాటకు తావులేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య రగులుతున్న బనకచర్ల అంశంపై కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో చర్చించారు. బనకచర్ల ముమ్మాటికీ తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా ప్రతిపాదించిన ప్రాజెక్టేనని పేర్కొన్నారు. రాష్ట్ర పునర్విభజన సమయంలో చేసుకున్న ఒప్పందాన్ని ఏపీ పదేపదే ఉల్లంఘిస్తోందని, నీటి విషయంలో తెలంగాణకు అన్యాయం చేయాలని ప్రయత్నిస్తోందని అన్నారు రేవంత్. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి యుద్ధం ముదురుతున్న క్రమంలో రేవంత్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అదే విధంగా గోదావరి, కృష్ణా నదుల నుంచి 1500 టీఎంసీల నీరు వినియోగించుకునేలా తెలంగాణకు అనుమతి ఇవ్వాలని కూడా రేవంత్ కోరారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కు విరుద్ధంగా ఏపీ సర్కార్ ప్ర‌తిపాదిస్తున్న గోదావరి-బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టు ప్రీ ఫీజుబిలిటీ రిపోర్ట్‌ను తిర‌స్క‌రించాల‌ని రేవంత్ రెడ్డి, తెలంగాణ నీటి పారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టు విష‌యంలో గోదావ‌రి జ‌ల వివాదాల ట్రైబ్యున‌ల్-1980 (జీడ‌బ్ల్యూడీటీ), ఆంధ్ర‌ప్ర‌దేశ్ పున‌ర్విభ‌జ‌న చ‌ట్టం-2014ల‌కు విరుద్ధంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని కేంద్ర మంత్రికి వారు తెలియ‌జేశారు. ఢిల్లీలోని శ్ర‌మ‌శ‌క్తి భ‌వ‌న్‌లో జ‌ల్‌శ‌క్తి మంత్రి సీఆర్ పాటిల్‌, ఆ శాఖ కార్య‌ద‌ర్శి దేబ‌శ్రీ ముఖ‌ర్జీ, ఇత‌ర ఉన్న‌తాధికారుల‌తో ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి గురువారం స‌మావేశ‌మ‌య్యారు. బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టు అనుమ‌తుల విష‌యంలో కేంద్ర ఆర్థిక శాఖ‌, ప‌ర్యావ‌ర‌ణ శాఖ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుతో తెలంగాణ ప్ర‌జ‌లు, రైతుల్లో ఆందోళ‌న‌లు నెల‌కొన్నాయ‌ని కేంద్ర మంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్లారు. గోదావ‌రి వ‌ర‌ద జ‌లాల ఆధారంగా బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టు ప్ర‌తిపాదిస్తున్నామ‌ని ఏపీ చెబుతోంద‌ని.. జీడ‌బ్ల్యూడీటీ-1980లో వ‌ర‌ద జ‌లాలు, మిగులు జ‌లాల ప్ర‌స్తావ‌నే లేద‌న్నారు. 2014 ఏపీ పున‌ర్విభ‌జ‌న చ‌ట్టం ప్రకారం ఏ రాష్ట్రంలోనైనా నూతన ప్రాజెక్ట్ నిర్మించాల‌నుకుంటే ముందు ఆ న‌దీ యాజ‌మాన్య బోర్డు, కేంద్ర జ‌ల‌ సంఘం (సీడ‌బ్ల్యూసీ), జ‌ల్‌శ‌క్తి మంత్రి అధ్య‌క్ష‌త‌న‌ రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు స‌భ్యులుగా ఉండే ఎపెక్స్ కౌన్సిల్‌లో చ‌ర్చించి అనుమ‌తి పొందాల‌ని.. బ‌న‌క‌చ‌ర్ల విష‌యంలో ఏపీ వీట‌న్నింటిని ఉల్లంఘిస్తోంద‌ని కేంద్ర మంత్రికి తెలియ‌జేశారు.

బ‌న‌క‌చ‌ర్ల విష‌యంలో ఏ నిబంధ‌న‌లు పాటించ‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ‌ర‌ద జ‌లాల ఆధారంగా ప్రాజెక్ట్ చేప‌డుతున్నామ‌ని చెబుతుండ‌డం తీవ్ర అభ్యంత‌ర‌క‌ర‌మ‌ని జ‌ల్ శ‌క్తి మంత్రితో సీఎం పేర్కొన్నారు. ఈ విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం, జ‌ల్‌శ‌క్తి మంత్రిత్వ శాఖ త‌క్ష‌ణ‌మే జోక్యం చేసుకొని బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్ట్ ముందుకెళ్ల‌కుండా చూడాల‌ని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌కు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు.

సీడ‌బ్ల్యూసీ ప‌రిధిలోని సాంకేతిక స‌ల‌హా మండ‌లి నుంచి అనుమ‌తులు పొంద‌కుండానే వ‌ర‌ద జ‌లాల పేరుతో పోల‌వ‌రం కింద పురుషోత్త‌ప‌ట్నం, వెంక‌ట‌న‌గ‌రం, ప‌ట్టిసీమ‌, చింత‌లపూడి ఎత్తిపోత‌ల ప‌థ‌కాల‌ను ఏపీ చేప‌ట్టింద‌ని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి తెలియ‌జేశారు. జీడ‌బ్ల్యూడీటీ-1980 నిబంధ‌న‌ల ప్ర‌కారం పోల‌వ‌రం డిజైన్లు మార్పు చేసింద‌ని, ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తుల‌కు విరుద్ధంగా ప‌నులు చేప‌డుతోంద‌ని.. తాము అభ్యంత‌రాలు లేవ‌నెత్తినా ప‌నులు మాత్రం కొన‌సాగిస్తూనే ఉంద‌ని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌కు సీఎం వివ‌రించారు. జాతీయ‌ప్రాజెక్టు అయిన పోల‌వ‌రం విష‌యంలో ఎటువంటి నిబంధ‌న‌లు ఉల్లంఘించ‌కుండా కేంద్ర ప్ర‌భుత్వం దృష్టి సారించాల‌ని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. గోదావ‌రిలో వ‌ర‌ద‌ జ‌లాలున్నాయ‌ని నిజంగా ఏపీ భావిస్తుంటే పోల‌వ‌రం-బ‌న‌క‌చ‌ర్ల‌కు బ‌దులు కేంద్రం నిధులు ఇచ్చే ఇచ్చంప‌ల్లి-నాగార్జున సాగ‌ర్ అనుసంధానం ద్వారా పెన్నా బేసిన్‌కు నీళ్లు తీసుకెళ్లే విష‌యంలో చ‌ర్చ‌కు తాము సిద్ధ‌మ‌ని కేంద్ర మంత్రికి సీఎం, రాష్ట్ర మంత్రి తెలిపారు. కృష్ణా జ‌ల వివాదాల ట్రైబ్యున‌ల్‌-2 తీర్పు త్వ‌ర‌గా వెలువ‌డేలా చూడాల‌ని కేంద్ర మంత్రికి సీఎం, రాష్ట్ర మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు. తెలంగాణ ప్ర‌యోజ‌నాల విష‌యంలో తాము ఎట్టిప‌రిస్థితుల్లోనూ రాజీప‌డ‌బోమ‌ని, అన్ని వేదిక‌ల ద్వారా స‌మ‌స్యలు సామ‌ర‌స్య‌పూర్వ‌కంగా ప‌రిష్కారానికి ప్ర‌య‌త్నిస్తామ‌ని సీఎం కేంద్ర మంత్రి పాటిల్ కు తెలియ‌జేశారు. కేంద్ర స్పంద‌న అనుకూలంగా లేక‌పోతే సుప్రీంకోర్టును ఆశ్ర‌యిస్తామ‌ని కేంద్ర మంత్రికి సీఎం స్ప‌ష్టం చేశారు.

* మేం 1500 టీఎంసీల‌కు వాడుకునేలా అనుమ‌తులు ఇవ్వండి....

తెలంగాణ‌కు గోదావ‌రి న‌దిలో 1000 టీఎంసీలు, కృష్ణా న‌దిలో 500 టీఎంసీలు మొత్తంగా 1500 టీఎంసీల నీటి వినియోగానికి కేంద్ర జ‌ల్‌శ‌క్తి మంత్రిత్వ శాఖ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ నిర‌భ్యంత‌ర ప‌త్రం (ఎన్‌వోసీ) జారీ చేయాల‌ని, దానికి కేంద్ర ప్ర‌భుత్వం ఆమోదం తెల‌పాల‌ని జ‌ల్ శ‌క్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. 1500 టీఎంసీల నీటితో కోటిన్న‌ర ఎక‌రాల‌కు నీరు అందుతుంద‌ని.. ఆ త‌ర్వాత ఏపీ చేప్ట‌టే ప్రాజెక్టుల అనుమ‌తుల ప్ర‌క్రియ‌ను ప‌రిశీలిస్తే త‌మ‌కు ఎటువంటి అభ్యంత‌రం లేద‌న్నారు.

* ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం చేప‌డుతున్న ప్రాజెక్టుల‌కు అనుమ‌తుల ప్ర‌క్రియ‌లో స‌త్వ‌రం స్పందిస్తూ తెలంగాణ ప్రాజెక్టుల విష‌యంలో మాత్రం అల‌స‌త్వం ప్ర‌ద‌ర్శించ‌డం త‌గ‌ద‌ని జ‌ల్ శ‌క్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ వైఖ‌రితో ఇరు రాష్ట్రాల మ‌ధ్య ప‌లు అపోహ‌లు, ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు త‌లెత్తుతున్నాయ‌న్నారు. పాల‌మూరు-రంగారెడ్డి, స‌మ్మ‌క్క‌-సారక్క‌, తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుల‌కు నీటి కేటాయింపుల‌తో పాటు అన్ని ర‌కాల అనుమ‌తులు వెంట‌నే మంజూరు చేయాల‌ని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞ‌ప్తి చేశారు.

* గంగా, య‌మునా న‌దుల ప్ర‌క్షాళ‌న‌కు నిధులిచ్చిన‌ట్లే మూసీ పున‌రుజ్జీవ‌నానికి నిధులు కేటాయించాల‌ని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రితో స‌మావేశం అనంత‌రం రాష్ట్ర మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి విలేక‌రుల‌తో మాట్లాడారు. సుదీర్ఘంగా సాగిన స‌మావేశంలో త‌మ విజ్ఞ‌ప్తుల‌కు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించార‌ని వెల్ల‌డించారు. బ‌న‌క‌చ‌ర్ల‌కు సంబంధించిన డీపీఆర్ త‌మ‌కు అంద‌లేద‌ని కేంద్ర మంత్రి తెలిపార‌ని... త్వ‌ర‌లోనే ఎపెక్స్ కౌన్సిల్ స‌మావేశం నిర్వ‌హిస్తామ‌ని హామీ ఇచ్చార‌ని రాష్ట్ర మంత్రి ఉత్త‌మ్ తెలిపారు. స‌మావేశంలో రాష్ట్ర ప్ర‌భుత్వ నీటి పారుద‌ల శాఖ స‌ల‌హాదారు ఆదిత్య‌నాధ్ దాస్‌, ముఖ్య‌మంత్రి కార్య‌ద‌ర్శి మాణిక్ రాజ్‌, రాష్ట్ర నీటి పారుద‌ల శాఖ ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి ప్ర‌శాంత్ జీవ‌న్ పాటిల్‌, కేంద్ర ప్రాయోజిత ప్రాజెక్టుల స‌మ‌న్వ‌య కార్య‌ద‌ర్శి డాక్ట‌ర్ గౌర‌వ్ ఉప్ప‌ల్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Tags:    

Similar News