రేవంత్ చేయలేని పని కవిత చేసిందా ?

2023 ఎన్నికల్లో ఓడిపోయి ప్రతిపక్షంలో రాగానే అధికార కాంగ్రెస్ పార్టీని ప్రత్యేకించి రేవంత్ రెడ్డి(Revanth)ని గుక్కతిప్పుకోనీయకుండా కేటీఆర్, హరీష్ ప్రతిరోజు నానా రచ్చచేస్తున్నారు.;

Update: 2025-05-29 10:42 GMT
Revanth and Kavitha

బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావుకు ఒక అలవాటుంది. అదేమిటంటే అధికారంలో ఉంటే ప్రతిపక్షాలను నోరిప్పనీయరు. ప్రతిపక్షంలో ఉంటే అధికారపార్టీని గుక్కతిప్పుకోనీయరు. అధికారంలో ఉన్న పదేళ్ళు ప్రతిపక్షాల విషయంలో కేసీఆర్, కేటీఆర్, హరీషరావులు ఏ విధంగా వ్యవహరించారో అందరు చూసిందే. 2023 ఎన్నికల్లో ఓడిపోయి ప్రతిపక్షంలో రాగానే అధికార కాంగ్రెస్ పార్టీని ప్రత్యేకించి రేవంత్ రెడ్డి(Revanth)ని గుక్కతిప్పుకోనీయకుండా కేటీఆర్, హరీష్ ప్రతిరోజు నానా రచ్చచేస్తున్నారు. టైంటేబుల్ వేసుకున్నట్లుగా ప్రతిరోజు రేవంత్ టార్గెట్ గా ఇద్దరు నేతలు ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోతున్న విషయం అందరుచూస్తున్నదే. ఉన్నది, లేనిది అన్నింటినీ కలిపేసి తమచేతిలో ఉన్న మీడియా, సోషల్ మీడియా ద్వారా రేవంత్, ప్రభుత్వంపై టన్నుల కొద్ది బురదను చల్లేస్తున్నారు. ‘మేము బురదచల్లేస్తాం మీరు కడుక్కోండి’ అన్నట్లుగా ఇద్దరూ వ్యవహరిస్తున్నారు. కేటీఆర్, హరీష్ ను ఎలాగ నియంత్రించాలో రేవంత్ అండ్ కోకు అర్ధంకాక, చేతకాక చోద్యం చూస్తున్నారు.

కేటీఆర్, హరీష్ పోసే బురదకు రెండు తాజా ఉదాహరణలున్నాయి. అవేమిటంటే మొదటిది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటి(HCU)లో 400 ఎకరాల వివాదాన్ని బీఆర్ఎస్ జాతీయస్ధాయి వివాదంగా ఏ విధంగా మార్చిందో అందరికీ తెలిసిందే. ఏఐ టెక్నాలజీని ఉపయోగించి బుల్డోజర్ల ముందు లేళ్ళు, నెమళ్ళు ప్రాణభయంతో పరిగెడుతున్నట్లుగా వీడియోలు, ఫొటోలు పెట్టి జాతీయస్ధాయిలో రేవంత్ ప్రభుత్వాన్ని బాగా ఇబ్బంది పెట్టేసింది. ఇక రెండో ఉదాహరణ ఏమిటంటే అందాలపోటీలు మిస్ వరల్డ్-2025లో మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ అర్ధాంతరంగా తనదేశానికి వెళ్ళిపోయింది. ఇంగ్లాండుకు తిరిగి వెళ్ళటానికి తన వ్యక్తిగత కారణాలు తనకున్నాయి.

అయితే బీఆర్ఎస్(BRS) మీడియాలో ఏమొచ్చిందంటే ఒక మంత్రి తనకు రు. 5 వేల కోట్లున్నాయి తనను ఒంటరిగా కలుస్తావా ? అని ఆమె చెప్పినట్లు వచ్చింది. కాంగ్రెస్ నేతలు చాలా సందర్భాల్లో తనను తాకారని, గుచ్చిగుచ్చి చూశారని ఆరోపించినట్లుగా వచ్చింది. తనను తాకేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారని, తనను వేశ్యలా ట్రీట్ చేయటాన్ని భరించలేకే తాను పోటీల నుండి అర్ధాంతరంగా బయటకు వచ్చేసినట్లు మ్యాగీ చెప్పిందని బీఆర్ఎస్ మీడియాలో వచ్చింది. నిజానికి ఈ మీడియాలో వచ్చిన వార్తలో ఏమాత్రం నిజంలేదు. ఎందుకంటే మ్యాగీకి రేవంత్ రెడ్డంటేనే ఎవరో తెలీనపుడు ఇక మంత్రులు, కాంగ్రెస్ నేతలు ఎవరో ఎలాగ తెలుస్తుంది ?

మ్యాగీ చెప్పిందని తప్పుడు స్టోరీలు రాసిన మీడియానే రేవంత్ ప్రభుత్వం కంట్రోల్ చేయలేక చేతులెత్తేసింది. ఇలాంటిది కేటీఆర్(KTR), హరీష్ ను కంట్రోల్ చేయగలదని ఎవరు అనుకోవటంలేదు. ఇలాంటి పరిస్ధితుల్లోనే ఊహించని విధంగా కల్వకుంట్ల కవిత(Kavitha) రూపంలో కాంగ్రెస్ పార్టీ, రేవంత్ అండ్ కోకు ‘ఆపన్నహస్తం’ ఆదుకున్నదనే చెప్పాలి. ఎలాగంటే గడచిన వారంరోజులుగా రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్, హరీష్ ఆరోపణలను తగ్గించేశారు. హరీష్ అసలు మీడియాతోనే మాట్లాడటంలేదు. ఇక కేటీఆర్ అయితే చెల్లెలు కవిత విషయాన్ని ఎక్కడ అడుగుతారో అన్న భయంతో మీడియాకు దొరకటంలేదు. తాను ప్రభుత్వంపై చేయదలచుకున్న ఆరోపణలను ట్విట్టర్లో పోస్టుచేసి చేతులు దులుపుకుంటున్నరు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్ సోదరి చేస్తున్న ఆరోపణలు, విమర్శలకు సమాధానాలు చెప్పుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు.

విషయం ఏదన్నాసరే కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్, హరీష్ దూకుడు బాగా తగ్గిపోయిందనే చెప్పాలి. అంటే కేటీఆర్, హరీష్(Harish) ను కంట్రోల్ చేయటంలో రేవంత్ అండ్ కో చేతులెత్తేస్తే ఆపనిని కవిత చాలా తేలికగా చేసేసింది. కవిత కారణంగా బీఆర్ఎస్ లో కల్వకుంట్ల కుటుంబంలోని అంతర్గత విభేదాలు బయటపడటంతో మిగిలిన నేతలకు ఏమిచేయాలో దిక్కుతోచక నోళ్ళు మెదపటంలేదు. ఎందుకంటే నేతలు మీడియతో మాట్లాడుదామని అనుకోగానే కేటీఆర్-కవిత వివాదంపై ప్రశ్నలు అడుగుతారన్న ఉద్దేశ్యంతో చాలామంది నేతలు మీడియాకు దూరంగా ఉంటున్నారు. మొత్తానికి సొంతపార్టీ నేతలనే ఆత్మరక్షణలోకి నెట్టేసి రేవంత్ ప్రభుత్వానికి ఊపిరితీసుకునే అవకాశాన్ని కవిత కల్పించారని చెప్పాలి.

R

Tags:    

Similar News