రచయిత్రి అనిశెట్టి రజిత కన్నుమూత

తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్న రచయిత్రి అనిశెట్టి రజిత గుండెపోటుతో వరంగల్ లో తుదిశ్వాస విడిచారు.;

Update: 2025-08-12 00:02 GMT
ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక జాతీయ అధ్యక్షురాలు అనిశెట్టి రజిత : ఇక లేరు

తెలంగాణ సాహితీ లోకం మరో రచయిత్రిని కోల్పోయి శోకసముద్రంలో మునిగింది. ప్రముఖ రచయిత్రి , ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక జాతీయ అధ్యక్షురాలు అనిశెట్టి రజిత వరంగల్ నగరంలో సోమవారం రాత్రి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. సోమవారం సాయంత్రం రజితకు గుండెపోటు రాగా, ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.  హన్మకొండలోని కుమార్పల్లి ఆమె వూరు. 14, ఏప్రిల్, 1958 రోజున జన్మించారు. అనిశెట్టి బాలరాజు, అమ్మ జయలక్ష్మి తల్లితండ్రులు. 


తెలంగాణ ఉద్యమంలో...
1958 ఏప్రిల్ 14వతేదీన వరంగల్ నగరంలో జన్మించిన రజిత ఆకాశవాణిలో ప్రసారమైన తెలంగాణ ఉద్యమ సంఘర్షణలు, కవి సమ్మేళనాలు, దాశరథి, ఆరుద్ర ఉపాన్యాసాలకు ఆకర్షితురాలై 1969 లో జరిగిన తెలంగాణ తొలి దశ ఉద్యమంలో పాలుపంచుకున్నారు. అనంతరం మలి దశ తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ ప్రోత్సాహంతో బహిరంగ సభల్లో మాట్లాడారు.


రచయిత్రిగా ప్రశంసలు
అనిశెట్టి రజిత 1973వ సంవత్సరంలో చైతన్యం పడగెత్తింది పేరిట తొలి రచనతోనే ప్రశంసలు అందుకున్నారు.1980వ సంవత్సరంలో గులాబీలు జ్వలిస్తున్నాయి, నేనొక నల్లమబ్బునవుతా, చెమట చెట్టు, ఓ లచ్చవ్వ, ఉసురు, గోరంత దీపాలు, దస్తఖత్, అనగనగా కాలం, మట్టిబంధం, నన్హే ఓ నన్హే, మార్కెట్ స్మార్ట్ శ్రీమతి, నిర్భయాకాశం కింద పేరిట 500 కు పైగా కవితలు, వందకు పైగా వ్యాసాలు, 30కి పైగా పాటలు రాశారు.

1977లో వరంగల్‍లో ‘చైతన్య సాహితి’ లో వ్యవస్థాపనతో ఆమె సాహిత్యప్రస్థానం ఒక మలుపు తిరిగింది. “అప్పటి నుండీ ఎన్నో సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొన్నాను. ఆనాటి సుప్రసిద్ధ కవులు, రచయితలు పరిచయం, వారి ప్రసంగాలు వినడం, తరవాత సాంస్కృతిక సమాఖ్య, శ్రీలేఖ సాహితి.. ఉమ్మడి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో సాహిత్య సదస్సులూ, ఉత్సవాల్లో పాల్గొనడం ఈ విధంగా సాహిత్యాభిరుచి పెరుగుతూపోయింది. ఒకవైపు చైనా, రష్యా, లాటిన్‍ అమెరికాల అనువాద సాహిత్యం, అభ్యుదయ, హేతువాద, విప్లవ సాహిత్యం చదవడం, మన తెలుగు కవుల కవితా సంపుటాలు చదవడం నాలో కవిత్వ, సాహిత్య పిపాస ఎక్కువవుతూపోయింది. నిజానికి పుస్తకాలే నాకు మంచి నేస్తాలుగా మారాయి. సాహిత్యంలోని సృజనశక్తి విలువ తెలుసొచ్చింది. సామాజిక ఉద్యమ సాంగత్యం సాహిత్యానికి మరింత చేరువ చేసింది. నా కలం పాళి ‘అగ్నిపాళి’గా మారిపోయింది. అప్పట్లోనే మా కుటుంబంలో ఒక పాపకు ‘సృజన’ అని పేరు పెట్టుకున్నాము. మన సమాజంలో ఆస్తులకు ఉన్నట్లే కళలకూ, వ్యాపారాలకూ, జ్ఞానానికీ వారసులుంటారు, వారసత్వ సమాజం కదా. నిజానికి శ్రామిక కులం, వర్గంలో పుట్టిన నాకు సాహిత్యానికి సంబంధించి ఎలాంటి శిక్షణ, మార్గదర్శకత్వం గానీ, వారసత్వం గానీ లేదు,”అని ‘కొలిమి’కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తెలిపారు.

ఎన్నెన్నో అవార్డులు
ఆమె రచనల్లో కవిత్వం, వ్యాసాలు ఎక్కువ. "1980ల నాటి ఉద్యమాల అనుభవంతో ‘‘గులాబీలు జ్వలిస్తున్నాయి’’ చిన్న కవితా సంపుటి. స్త్రీవాద ఉద్యమ ప్రభావంతో ‘‘నేనొక నల్లమబ్బునవుతా’’(1997) కవితా సంపుటి, ‘‘చెమట చెట్టు’’(1999), ‘‘ఓ లచ్చవ్వ’’ దీర్ఘకవిత(2005) (దళిత బహుజన స్త్రీ, రాజ్యాధికారం) ‘‘ఉసురు’’(2002) తెలంగాణ కవిత్వం, ‘‘గోరంత దీపాలు’’(2005) నానీల కవిత్వం, హైకూల సంపుటి, ‘‘దస్తఖత్‍’’, వచన కవిత ‘‘అనగనగా కాలం‘‘ , ‘‘మట్టిబంధం’’(2006) కవితా సంపుటి, ‘‘నన్హే ఓ నన్హే’’(2007) నానీల కవిత్వం, ‘‘మార్కెట్‍ స్మార్ట్ శ్రీమతి’’ దీర్ఘ కవిత(2010), ‘‘నిర్భయాకాశం కింద’’ (2016), ఆచార్య పాకాల యశోదారెడ్డి(2017)పై మోనోగ్రాఫ్‍. సాహిత్య, సామాజిక వ్యాసాల సంపుటాలు రావాల్సి ఉంది," అని ఆమె ఆ ఇంటర్వ్యూలో చెప్పారు.
అనిశెట్టి రజిత సాహిత్యంతో సామాజిక అంశాలను స్పృశించారు. ఈమె రచనలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అవార్డులు లభించాయి. 2014వ సంవత్సరంలో తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఈమెకు ప్రతిభా పురస్కారం లభించింది. 2016వ సంవత్సరంలో తెలుగు రచయితల వేదిక అలిశెట్టి ప్రభాకర్ పురస్కారంతో రజితను సత్కరించారు.


Tags:    

Similar News