‘వికసిత్ భారత్ ఇలా సాధ్యమా?’.. కేంద్ర బడ్జెట్పై హరీష్ రావు
కేంద్రం బడ్జెట్పై తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం మరోసారి తెలంగాణ ప్రజలను మోసం చేసిందన్నారు.;
కేంద్రం బడ్జెట్పై తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం మరోసారి తెలంగాణ ప్రజలను మోసం చేసిందన్నారు. చీటికి మాటికి ఢిల్లీ వెళ్లిన సీఎం అక్కడ సాధించింది ఇదేనా? అని ప్రశ్నించారు. ఈ ఏడాది కూడా బడ్జెట్ను బీజేపీ తన రాజకీయ అవసరాలకే వినియోగించుకుంది తప్ప.. దేశ వృద్ధిని పట్టించుకోలేదంటూ హరీష్ రావు విమర్శించారు. తెలంగాణకు మొండి చేయి చూపించినా.. తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం కేంద్ర బడ్జెట్ను అద్భుతమని అభివర్ణించడం విడ్డూరంగా ఉందన్నారు. వారికి రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కన్నా పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని వారి వ్యాఖ్యలతో తేటతెల్లమైందన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్(ట్విట్టర్) వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. అందులో కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై కూడా ప్రశ్నల వర్షం కురిపించారు.
‘‘2025-26 బడ్జెట్ తన రాజకీయ అవసరాలే ఉపయోగించుకున్నది తప్ప, దేశ సమ్మిళిత వృద్ధిని ఏమాత్రం పట్టించుకున్నట్లు లేదు. కేంద్ర ప్రభుత్వం పదే పదే వల్లెవేస్తున్న వికసిత్ భారత్ ఇలాంటి వైఖరితో సాధ్యమవుతుందా అని పునర్ సమీక్షించుకోవాలని కోరుతున్నాం. ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు పెద్ద మొత్తంలో వరాలు ప్రకటించి, ఎన్నికలు లేని రాష్ట్రాల పట్ల వివక్ష చూపడం సరికాదు. దేశమంటే మట్టి కాదోయో దేశమంటే మనుషులోయ్ అంటూ ప్రసంగించిన నిర్మల సీతారామన్ గారూ, దేశమంటే కొన్ని రాష్ట్రాలే అన్నట్లు బడ్జెట్ ప్రవేశ పెట్టడం బాధాకరం. మొదటి నుంచి ఇదే దోరణిని ప్రదర్శిస్తూ రాజకీయ అవసరాలు తీర్చుకుంటున్నది కేంద్ర ప్రభుత్వం
2024 ఆంధ్రప్రదేశ్ కోసం, 2025 ఢిల్లీ, బిహార్ రాష్ట్రాల కోసం బడ్జెట్ పెట్టారు. 2026 యూపీ బడ్జెట్, 2027 గుజరాత్ కోసం బడ్జెట్ పెడుతారా? యావత్ దేశానికి సరిపోయే బడ్జెట్ ఎప్పుడు పెడతారు?
బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి చోటు లేదా? తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు విలువ లేదా? ఇది కేంద్ర బడ్జెట్ లా లేదు, కేవలం మూడు, నాలుగు రాష్ట్రాల బడ్జెట్ లాగా ఉంది. తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు, 8 మంది ఎంపీలు ఉండి తెలంగాణ రాష్ట్రానికి ఏం సాధించినట్లు? తెలంగాణతో తమకు బంధం లేదని బడ్జెట్ ద్వారా మరోసారి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరూపించింది.
కేంద్ర జీడీపీకి 5.1శాతం కాంట్రిబ్యూట్ చేస్తున్న తెలంగాణ మరోసారి మోస పోయింది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ట్రైబల్ యూనివర్సిటీకి ఇవ్వాల్సిన నిధులు కూడా ఇవ్వకపోవడం బాధాకరం. తెలంగాణకు నిధులు రాబట్టుకోవడంలో రేవంత్ సర్కారు పూర్తిగా విఫలమైంది. తీరిగ్గా తేరుకొని, బడ్జెట్ కు పది రోజుల ముందు 40వేల కోట్లు కావాలని తూతూ మంత్రంగా లేఖ రాయడం తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేం లేదు. కేంద్రం బడ్జెట్ ద్వారా నిధులు రాబట్టుకోవడంలో సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు పూర్తిగా విఫలమయ్యారు.
ఏడాది కాలంలో 30 సార్లకు పైగా ఢిల్లీకి వెళ్లారు. ఏం సాధించారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల తీరు వల్ల తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది. నిధుల కేటాయింపు సంగతి దేవుడెరుగు, విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను కూడా కేంద్రం నెరవేర్చలేకపోయింది. సంకీర్ణ యుగంలో, కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు స్థానిక పార్టీల మద్ధతు కీలకం అయ్యే రోజొకటి వస్తుందని కేసీఆర్ గారు ఎప్పుడూ చెప్పేవారు.
కేంద్రానికి మద్ధతు పలికిన జనతాదళ్ (యూ) బీహార్లో వివిధ అభివృద్ధి పనులకు గతేడాది రూ. 26,000 కోట్ల సాయం, 2,400 మెగావాట్ల పవర్ ప్లాంట్, గయాలో పారిశ్రామిక కారిడార్, నూతన విమానాశ్రయాలు, మెడికల్ కాలేజీలకు సాయం తదితరాలు పొందింది.
ఎన్నికలు దగ్గర ఉన్నాయని ఇప్పటి బడ్జెట్ లో బిహార్ కు మరిన్ని వరాల జల్లు కురిపించారు. బిహార్ లో మఖాన బోర్డు ఏర్పాటు, మిథిలాంచల్ లో వెస్టర్న్ కోసి కెనాల్, ఐఐటీ పాట్నా విస్తరణ, బిహార్ లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు, ఫడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
కానీ, నమ్మి 16 సీట్లలో కాంగ్రెస్, బీజేపీలను గెలిపిస్తే, ఇద్దరూ కలిసి తెలంగాణకు మొండి చెయ్యి ఇచ్చారు. 8 మంది బిజేపీ, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, రాష్ట్రానికి ప్రత్యేకంగా 8 రూపాయలు కూడా అధికంగా సాధించిన దాఖలాలు లేవు. కేంద్రం ఇతర రాష్ట్రాలకు కేటాయింపులు చేయడం సంతోషం, ఇందులో మాకు ఎలాంటి బాధ లేదు. కానీ తెలంగాణ పరిస్థితి ఏమిటో కాంగ్రెస్, బిజేపీ ఎంపీలు చెప్పాలి. తెలంగాణలో ప్రాజెక్టుల సంగతి ఏమిటి? పునర్విభజన చట్టం హామీల పరిస్థితి ఏమిటి?
ప్రశ్నించాల్సిన కాంగ్రెస్, బిజేపీ ఎంపీలు మౌనం దాల్చారు. కేంద్రం మెప్పు కోసం తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు. తెలంగాణకు ప్రయోజనాల కోసం, తెలంగాణ ప్రజల కోసం ఎప్పటికైనా పోరాడేది బిఆర్ఎస్ పార్టీయేనని మరోసారి రుజువైంది. తెలంగాణ ప్రయోజనాలు కాపాడటంలో బిజేపీ, కాంగ్రెస్ పార్టీలు వైఫల్యం చెందుతున్నాయన్న విషయాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు’’ అని అన్నారు హరీష్ రావు.