ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ : బీజేపీలో ఈటల ఒంటరి అయిపోయారా ?
ఈటల(Eatala Rajendar) మాటలు కేసీఆర్ కు మద్దతుగా ఉండగా మిగిలిన ఎంపీలు, ఎంఎల్ఏలు మాత్రం కేసీఆర్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.;
తెలంగాణ బీజేపీలో జరుగుతున్న పరిణామాలు చూసిన తర్వాత ఇదే అనుమానం పెరిగిపోతోంది. మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ తో పార్టీలోని చాలామంది సీనియర్ నేతలకు ఏమాత్రం పడటంలేదన్న ప్రచారం అందరికీ తెలిసిందే. ఈటల పార్టీ అధ్యక్షపదవి కోసం ప్రయత్నిస్తుంటే సీనియర్లలో కొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని బాగా ప్రచారం జరుగుతోంది. ఈకారణంగానే కొత్త అధ్యక్షుడి ప్రకటన ఎప్పటికప్పుడు వాయిదాపడుతోందని పార్టీతో పాటు బయటకూడా టాక్ నడుస్తోంది. ఇలాంటి నేపధ్యంలోనే తాజాగా పార్టీలో ఈటల విషయంలో ఒక డెవలప్మెంట్ స్పష్టంగా కనబడుతోంది. అదేమిటంటే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో నేతల స్టాండ్. ఈటల(Eatala Rajendar) మాటలు కేసీఆర్ కు మద్దతుగా ఉండగా మిగిలిన ఎంపీలు, ఎంఎల్ఏలు మాత్రం కేసీఆర్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
బీఆర్ఎస్ నుండి బహిష్కరణకు గురైన కొత్తల్లో కేసీఆర్(KCR) ను టార్గెట్ చేసుకుని ఈటల చాలా ఆరోపణలు చేశారు. ఆరోపణల్లో కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఒకటి. ఈప్రాజెక్టులో కేసీఆర్ బాగా అవినీతికి పాల్పడ్డారని, అవినీతి కారణంగానే ప్రాజెక్టు నిర్మాణం నాసిరకంగా తయారైందని, అందుకనే మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయాయని చాలా చాలా ఆరోపణలతో విరుచుకుపడిన విషయం అందరికీ తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం మొత్తం కేసీఆర్ ఆలోచన ప్రకారమే జరిగిందని కూడా అప్పట్లో చెప్పారు. తర్వాత కొంతకాలానికి బీజేపీలో చేరిన ఈటల మొదటి హుజూరాబాద్ ఉపఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత జరిగిన 2019 ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుండి ఎంపీగా పోటీచేసి గెలిచారు. తర్వాత ఈటల వైఖరిలో ఏమి మార్పు జరిగిందో అర్ధంకావటంలేదు.
ఇపుడు విషయం ఏమిటంటే కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారించింది. విచారణలో ఈటల కూడా పాల్గొన్నారు. తర్వాత మీడియాతో మాట్లాడుతు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అప్పటి క్యాబినెట్ నిర్ణయంతోనే జరిగిందన్నారు. సబ్ కమిటిలో సభ్యులైన తనతో పాటు హరీష్ రావు(Harish Rao), తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswar Rao) నివేదిక రూపంలో ఆమోదం తెలిపినట్లు చెప్పారు. దీనిపై తుమ్మల వెంటనే రియాక్టయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అసలు క్యాబినెట్ సమావేశంలోనే చర్చించలేదని, సబ్ కమిటి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై చర్చించలేదని స్పష్టంగా ప్రకటించారు.
తుమ్మల విషయాన్ని పక్కనపెట్టేస్తే కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్రమంత్రులు జీ కిషన్ రెడ్డి(Kishan Reddy), బండి సంజయ్(Bandi Sanjay) మాట్లాడుతు కేసీఆర్ పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. కాళేశ్వరం అవినీతి, అవకతవకల్లో కేసీఆర్ పాత్ర కీలకమని మండిపడ్డారు. ఈసమయంలోనే ఒక టీవీ చర్చలో పాల్గొన్న ఈటల కాళేశ్వరం ప్రాజెక్టుపై తన స్టాండును మళ్ళీ వినిపించారు. ఈటల మాటలు విన్నవాళ్ళకు కేసీఆర్ కు మద్దతుగా మాట్లాడుతున్నట్లే అనిపించింది. ఇపుడు తాజా డెవలప్మెంట్ ఏమిటంటే బీజేపీ ఎంపీలు, ఎంఎల్ఏలు స్పందించారు. కాళేశ్వరం ముమ్మాటికి అవినీతి ప్రాజెక్టే అని మండిపోయారు. గతంలో నరేంద్రమోది(Narendra Modi), అమిత్ షా(Amitshah) తెలంగాణ పర్యటనల్లో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్(KCR) కుటుంబం ఏటీఎంలాగ వాడుకున్నట్లు తీవ్రమైన ఆరోపణలు చేశారు. అప్పట్లో మోదీ, షా ఆరోపణలకు తాము కట్టుబడినట్లు చెప్పారు. మోదీ, షా ఆరోపణలకు భిన్నంగా మాట్లాడేవాళ్ళ సంగతిని పార్టీ హైకమాండే చూసుకుంటుదని చెప్పారు.
మోదీ, షా ఆరోపణలకు భిన్నంగా మాట్లాడేవాళ్ళ సంగతి అంటే ఎవరు మాట్లాడుతున్నట్లు ? ఈటల తప్ప ఇంకెవరూ మాట్లాడటంలేదు. బీఆర్ఎస్ నుండి బయటకు వచ్చిన కొత్తల్లో కేసీఆర్ పై ఈటల చేసిన ఆరోపణలకు ఇప్పటి మాటలకు చాలా తేడా ఉంది. ఎందుకిలా మాటలు మార్చారన్న విషయన్ని ఈటెలే చెప్పాలి. మాటలు ఎందుకు మార్చారని మీడియా అడిగినా ఈటల అంగీకరించటంలేదు. ఈనేపధ్యంలోనే బీజేపీ ప్రజా ప్రతినిధుల మీడియా సమవేశాలు హాట్ టాపిక్ గా నిలిచాయి. ఒకపుడు కాళేశ్వరంను అవినీతి ప్రాజెక్టుగా ఆరోపించిన ఈటల ఇపుడు మాత్రం అద్భుతమైన ప్రాజెక్టు అని అంటున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై అవినీతి ఆరోపణలతో కిషన్ రెడ్డి, బండి, ధర్మపురి అర్వింద్, రఘునందనరావు, డీకే అరుణతో పాటు ఎంఎల్ఏలు రాజాసింగ్, పాల్వాయి హరీష్ బాబు, రామారావు పటేల్, ఎంఎల్సీ అంజిరెడ్డి, మాజీ ఎంఎల్ఏ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ రెచ్చిపోయారు. వీళ్ళ మాటలు, ఆరోపణలన్నీ కేసీఆర్ అవినీతిపరుడన్నట్లుగానే ఉన్నాయి. అవినీతి, అవకతవకలకు పాల్పడిన కేసీఆర్ కుటుంబాన్ని కఠినంగా శిక్షించాలనే డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో పార్టీలో ఈటలది ఒకదారి అయితే మిగిలిన ప్రజాప్రతినిదులందరిదీ మరో దారయ్యింది. ఈ డెవలప్మెంట్ చూసిన తర్వాత పార్టీలోని కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎంఎల్ఏల నుండి ఈటల ఒంటరిఅయిపోయినట్లు అర్ధమైపోతోంది.