‘తెలంగాణకు మరణశాసనం రాసిందే కేసీఆర్’

వ్యవసాయాన్ని దండగ అనే స్థాయి నుంచి పండగ చేసుకునే స్థాయికి తీసుకొచ్చింది తామేనని అన్నారు.;

Update: 2025-06-24 13:22 GMT

రాష్ట్రం దివాలా తీస్తే కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్‌లు సంపన్నులుగా ఎలా ఎదిగారని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ మరణశాసనాన్ని రాసిందే కేసీఆర్ అంటూ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రైతు భరోసా కార్యక్రమం విజయవంతం అయిన సందర్భంగా కాంగ్రెస్ భారీ సభ ఏర్పాటు చేసింది. అందులో మాట్లాడుతూ గత ప్రభుత్వం, పాలకులపై రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక బాగుపడింది ఎవరైనా ఉన్నారంటే అది కల్వకుంట్ల కుటుంబం మాత్రమేనన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తోందని చెప్పారు. వరి వేస్తే ఉరి అని ముఖ్యమంత్రి అనే స్థాయి నుంచి వరి వేస్తే సిరి అనే స్థాయికి రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని తీసుకొచ్చామని చెప్పారు. వ్యవసాయాన్ని దండగ అనే స్థాయి నుంచి పండగ చేసుకునే స్థాయికి తీసుకొచ్చింది తామేనని అన్నారు. రైతుల ఆశీర్వాదం వల్లే చిన్న వయసులోనే సీఎం అయ్యానని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా పంపిణీ కార్యక్రమం మంగళవారంతో ముగిసిందని, పెట్టుకున్న లక్ష్యం ప్రకారం తొమ్మిది రోజుల్లో రూ.9వేల కోట్ల నిధులను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని ఆయన వెల్లడించారు.

వారు సంపన్నులు ఎలా అయ్యారు..?

‘‘గత ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూ.8 లక్షల కోట్లకుపైగా అప్పులు మా నెత్తిన పెట్టి వెళ్లారు. రూ.లక్ష కోట్లతో కాళేశ్వరం కట్టడం.. కూలడం కూడా జరిగిపోయింది. కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావుకు ఫామ్‌హౌస్‌లు ఎలా వచ్చాయి? రాష్ట్రం దివాలా తీస్తే వాళ్లంతా ఎలా సంపన్నులయ్యారు? కేసీఆర్‌ వేలాది ప్రభుత్వ పాఠశాలలు మూత వేయించారు. కానీ, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత 60 వేల ఉద్యోగాలు ఇచ్చాం. గ్రామాల్లో అమ్మ ఆదర్శ పాఠశాలలు తీసుకువచ్చాం’’ అని చెప్పారు.

48 గంటల్లో డబ్బులు జమ

‘‘సచివాలయం సాక్షిగా రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులు ఇవాళ పండుగ చేసుకుంటున్నారు ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణ రైతాంగం అండతో చిన్న వయసులో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టా. తెలంగాణ చరిత్ర భూమి చుట్టూనే మన పోరాటాలు, త్యాగాలు. ఉన్న ఊరిని, సొంత భూమిని తల్లిదండ్రులతో సమానంగా చూసుకుంటాం. ప్రజా ప్రభుత్వంలో మా మొదటి ప్రాధాన్యత రైతులు… ఆ తరువాత మా ఆడబిడ్డలు, ఉద్యమకారులు, విద్యార్థులు. ఆనాడు కెసీఆర్ రైతు బందు ఎగ్గొడితే మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రూ.7625 కోట్ల నిధులను విడుదల చేశాం. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం అప్పుల్లో కూరుకుపోయిన రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి ఆత్మగౌరవాన్ని నిలబెట్టాం. 25 లక్షల 35 వేల 964 మంది రైతులకు రూ. 20 వేల 617 కోట్లు వారి ఖాతాల్లో వేసి రుణవిముక్తులను చేశాం’’ అని చెప్పారు.


‘‘ఆగస్టు 15, 2024 న రైతులను రుణ విముక్తులను చేశాం. ఆనాడు వరి వేసుకుంటే ఉరి వేసుకున్నట్టే అని కేసీఆర్ చెప్పిండు. ప్రభుత్వం వ్యాపారం చేయదు.. వడ్లు కొనం అని మాట్లాడిండు. కానీ ప్రజా ప్రభుత్వంలో వరి పండించండి.. చివరి గింజ వరకు కొనడమే కాదు, మద్దతు ధరతో పాటు బోనస్ ఇస్తామని మాట ఇచ్చాం. మా మాటపై నమ్మకంతో రైతులు దేశంలోనే అత్యధికంగా వరిపండించే రాష్ట్రంగా నిలబెట్టారు. రూ.2 కోట్ల 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించి దేశంలోనే తెలంగాణను మొదటి స్థానంలో నిలిపారు. దళారుల దోపిడీని నిలువరించి రైతును ఆదుకున్న చరిత్ర ప్రజా ప్రభుత్వానిది. సంబ వడ్లకు మద్దతు ధరతో పాటు రూ. 500 బోనస్ అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ’’ అని అన్నారు.

మహిళా సాధికారత మా ధ్యేయం

‘‘కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ ధ్యేయం. మహిళలు సౌర విద్యుత్‌ ఉత్పత్తి చేసేలా చర్యలు చేపట్టాం. వెయ్యి మెగావాట్ల సౌర విద్యుత్‌పై విద్యుత్‌శాఖతో ఒప్పందం కుదుర్చుకున్నాం. మహిళలకు రూ.21వేల కోట్ల వడ్డీలేని రుణాలు ఇచ్చి ఆదుకున్నాం. మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల విక్రయానికి చర్యలు చేపట్టాం. శిల్పారామంలో 150 షాపుల ఏర్పాటుకు స్థలం కేటాయించాం. వెయ్యి బస్సులు కొని ఆర్టీసీకి మహిళలు అద్దెకు ఇచ్చేలా చర్యలు చేపట్టాం. 8 వేల ఐకేపీ కేంద్రాలను మహిళల చేతుల్లో పెట్టాం. పాఠశాలల్లో ఆహార పదార్థాల సరఫరా బాధ్యతను స్వయం సహాయక సంఘాలకు అప్పగించాం. పదేళ్ల భారాస పాలన, 18 నెలల కాంగ్రెస్‌ పాలనపై చర్చ పెట్టాలి’’ అని తెలిపారు.

మామ శకుని, అల్లుడు శని

‘‘కేసీఆర్ రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను క్యాన్సర్ బారిన పడేసి మాకు అప్పగించారు. మామ శకుని అయితే అల్లుడు శనీశ్వరుడు.. శకుని మామకు తగ్గట్టు శనీశ్వర అల్లుడు జమై రైతులకు మీరేం చేశారని మాట్లాడతుండ్రు… ఆనాడు రైతు భరోసా ఇవ్వాలంటే కోకాపేటలో భూములు అమ్మిండ్రు… రైతు రుణమాఫీ చేయాలంటే ఔటర్ రింగ్ రోడ్డును తెగనమ్మిండు.. రైతుల పేరుతో అప్పులు చేసిండు.. దోపిడీ చేసిండు’’ అని విమర్శించారు. ‘‘రైతులకు నీళ్లిస్తామని కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు కొల్లగొట్టిండు. రైతుల ముసుగులో, రైతు సెంటిమెంట్ ను ఆదాయ వనరుగా మార్చుకున్నారు.. వేల కోట్లు సంపాదించుకున్నారు. ఈ వేదిక నుంచి సూటిగా అడుగుతున్నా.. తెలంగాణ రాష్ట్రం రాకముందు మీ ఆర్ధిక పరిస్థితి ఏంటి? మొయినాబాద్ లో హరీష్ రావుకు ఫామ్ హౌస్ ఎట్లా వచ్చింది? జన్వాడలో కేటీఆర్ కు, గజ్వేల్ లో కేసీఆర్ కు ఫామ్ హౌస్ లు ఎట్లా వచ్చినయ్. మీరు వేల కోట్ల అధిపతులయ్యారు? రాష్ట్రానికి 8 లక్షల కోట్ల అప్పు ఎలా వచ్చింది? పదేళ్లలో నిజాం నవాబుల కంటే ఫణవంతులయ్యారు.. కానీ ధనిక రాష్ట్రమైన తెలంగాణ ఇవాళ దివాళా తీసింది. పదేళ్లు వాళ్లు చేయలేనిది మేం మొదటి ఏడాదిలోనే 60 వేల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేశాం. లెక్కబెట్టుకుంటమంటే ఎల్బీ స్టేడియంలో తలలు లెక్కగట్టి అప్పచెప్పి నిరూపిస్తా… పదేళ్లలో మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ప్రజలకు సమాధానం చెప్పు కేసీఆర్. 18 నెలల్లో 1 లక్షా 4 వేల కోట్లు కేవలం రైతుల కోసం ఖర్చు చేసిన రైతు ప్రభుత్వం మాది. రైతును రాజుగా చేసి వ్యవసాయాన్ని పండుగ చేసిన ప్రజా పాలన మాది’’ అని అన్నారు.

‘‘దీనిపై చర్చకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నారా అని ఈ వేదిక నుంచి అడుగుతున్నా. కాళేశ్వరం పేరుతో మీరు లక్ష కోట్లు కొల్లగొడితే.. 18 నెలల్లో రైతుల కోసం 1 లక్షా 4 వేల కోట్లు ఖర్చు చేసి రైతులను ఆదుకున్న చరిత్ర మాది.. వ్యవసాయాన్ని పండుగ చేయాలన్న ఉక్కు సంకల్పంతో ప్రజా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా వారిని ప్రోత్సహిస్తున్నాం. ప్రజలారా ఈ వేదికగా విజ్ఞప్తి చేస్తున్నా..ఆలోచన చేయండి… అంచనా కట్టండి… బేరీజు వేయండి. పదేళ్లవాళ్ల పాలన ఎలా ఉందో.. 18 నెలల మా పాలన ఎలా ఉందో చర్చ పెట్టండి. కెసీఆర్.. కుట్రలు కుతంత్రాలతో కాంగ్రెస్ హయాంలో మొదలుపెట్టిన సాగునీటి ప్రాజెక్టులను ఒక్కటి కూడా పూర్తి చేయలేదు.. కాళేశ్వరం కూలేశ్వరమై లక్ష కోట్లు గోదావరిలో కలిసిపోయినయ్. ప్రాజెక్టు కూలిపోయినందుకు నిన్ను కాళేశ్వరంలోనే ఉరి తీసినా తప్పు లేదని అక్కడి రైతాంగం అంటున్నది నిజం కాదా? కెసీఆర్ కాంట్రాక్టర్లకు 2 లక్షల కోట్లు చెల్లించిండు.. మరి వెయ్యి కోట్లతో పూర్తి కావాల్సిన కల్వకుర్తి ఎందుకు ఆగిపోయింది?’’ అని ప్రశ్నించారు.

‘‘300 కోట్లతో పూర్తి కావాల్సిన బీమా, 200 కోట్లతో పూర్తి కావాల్సిన నెట్టెంపాడు ఎందుకు పూర్తి కాలేదు? 6 వేల కోట్లతో పూర్తి కావాల్సిన సీతారామ ప్రాజెక్టు ఎందుకు ఆగిపోయింది. దేవాదుల పూర్తి చేస్తే 4 వేల ఎకరాలు సాగయ్యేవి.. ఎందుకు పూర్తి చేయలేదు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులపై సీమాంధ్రులు నిర్లక్ష్యం వహించారన్న నువ్వు.. పదేళ్లలో ఇంకొక్క ప్రాజెక్టునైనా పూర్తి చేశావా? ఈ దుర్మార్గానికి నువ్వు, నీ కుటుంబం కారణం కాదా? లక్ష కోట్లు దోచుకుని, వేల ఎకరాలు ఆక్రమించుకుని ఇవాళ బనకచర్ల విషయంలో నాపై దుర్మార్గపు ప్రచారం చేస్తున్నారు. నేను చంద్రబాబుతో అంటకాగాలనుకుంటే అక్కడే ఉండేవాణ్ణి కదా? రాజీవ్ గాంధీ ఆశీర్వాదం తీసుకునేందుకు ఇక్కడికి ఎందుకు వచ్చేవాడిని కేసీఆర్. సోనియమ్మను నమ్మకద్రోహం చేసిన చరిత్ర నీదైతే… తెలంగాణలో ప్రజా ప్రభుత్వం తేవాలని చంద్రబాబును కాదని కాంగ్రెస్ లో చేరి ప్రజల్తో కదం కదం కలిపా. నీకు చిత్తశుద్ధి ఉంటే.. గోదావరి బనకచర్లపై శాసనసభలో చర్చ పెడదాం.. స్పీకర్ కు లేఖ రాయి. నువ్వు చెప్పిన తారీకున అసెంబ్లీ పెట్టించే బాధ్యత మా మంత్రి శ్రీధర్ బాబు తీసుకుంటారు. గోదావరి జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసిందెవరో నువ్వు నేను చర్చ చేద్దాం. మొత్తం వివరాలతో నేను వస్తా’’ అని వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News