ఆర్భాటం అధికం...ఆదుకునేది శూన్యం, ఇదీ పసుపుబోర్డు తీరు

జాతీయ పసుపుబోర్డు తాత్కాలిక కార్యాలయాలకు రెండు సార్లు ఇద్దరు కేంద్రమంత్రులు ప్రారంభం...;

Update: 2025-06-29 06:56 GMT
పసుపుబోర్డు ఏర్పాటైనా పసుపునకు గిట్టుబాటు ధర ఏది?

నాలుగు దశాబ్దాల పసుపు రైతుల పోరాటం ఫలించిందని, జాతీయ పసుపు బోర్డు నిజామాబాద్ కు వచ్చిందని సంతోషపడిన రైతులకు ఇంకా కేంద్ర సాయం అందనేలేదు. పసుపుబోర్డును ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2023 అక్టోబరులో ప్రకటించగా, దీనిపై కేంద్రవాణిజ్య మంత్రిత్వ శాఖ 14 నెలల తర్వాత ఉత్తర్వులు జారీ చేసింది. బోర్డు అంటూ ఏర్పాటు చేసినా పసుపు రైతులకు నయాపైసా లాభం జరగలేదు.


పసుపుబోర్డుపై ప్రధాని ప్రకటన
2023వ సంవత్సరం అక్టోబరు 1వతేదీన మహబూబ్ నగర్ జిల్లా పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిజామాబాద్ కేంద్రంగా జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ప్రధానమంత్రి ప్రకటించిన 14 నెలల తర్వాత జాతీయ పసుపుబోర్డును ఏర్పాటు చేస్తూ కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పసుపు రైతు అయిన పల్లెపు గంగారెడ్డిని జాతీయ పసుపుబోర్డు ఛైర్మన్ గా నియమించినా ఇంకా బోర్డు డైరెక్టర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులను ప్రకటించలేదు. దీంతో బోర్డు పూర్తి స్థాయిలో ఏర్పాటు కాలేదు.బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా మేఘాలయ కేడరుకు చెందిన ఓ ఐఎఎస్ అధికారిణిని నియమించినా ఎలాంటి బడ్జెట్ కేటాయించలేదు.

తాత్కాలిక కార్యాలయాలకు రెండు సార్లు ఇద్దరు కేంద్రమంత్రుల ప్రారంభోత్సవం
2025 జనవరి 14వతేదీన నిజామాబాద్ నగరంలోని స్పైసెస్ బోర్డులో తాత్కాలిక పసుపు బోర్డు కార్యాలయాన్ని ఢిల్లీ నుంచి కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ వర్చువల్ గా ప్రారంభించారు.ఈ ఏడాది జనవరి 31వతేదీన పల్లె గంగారెడ్డి జాతీయ పసుపు బోర్డు మొదటి చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించారు.అయితే నిధులు లేక ఎలాంటి పనులు చేయలేదు. పసుపుబోర్డు తాత్కాలిక కార్యాలయం ఏర్పాటై అయిదు నెలలు దాటినా పసుపు రైతులకు ఏమీ మేలు జరగలేదని, కానీ పసుపుబోర్డుకు రెండు సార్లు ఇద్దరు కేంద్రమంత్రులు తాత్కాలిక భవనాల్లోనే ప్రారంభోత్సవాలు చేసి ఆర్భాటం చేశారు తప్ప రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదని పసుపు రైతుల సంఘం నాయకుడు చెన్నమనేని శ్రీనివాసరావు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

మళ్లీ తాత్కాలికమే...
2025వ సంవత్సరం జూన్ 29 వతేదీన ఆదివారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసును రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ నుంచి మళ్లీ తాత్కాలిక ప్రాతిపదికన అద్దెకు తీసుకొని జాతీయ పసుపుబోర్డు కార్యాలయాన్ని హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రారంభించారు. ఒకే పసుపుబోర్డుకు రెండూ తాత్కాలిక కార్యాలయాలను ఇద్దరు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అమిత్ షాలతో ప్రారంభోత్సవాలు చేయించడంపై పసుపు రైతు సమాఖ్య అధ్యక్షుడు పన్నాల తిరుపతిరెడ్డి ఆరోపించారు.

పసుపునకు అందని గిట్టుబాటు ధర
ప్రపంచంలోనే పసుపు ఉత్పత్తిలో 75శాతం వాటా భారతదేశంలో ఉంది. దేశంలోనే గత ఏడాది 3.05 లక్షల హెక్టార్లలో పసుపు సాగు చేసి 10.74 లక్షల టన్నుల దిగుబడి సాధించింది.ఇందులో 1.62 లక్షల టన్నుల పసుపు ఎగువమతి అవుతోంది. దేశంలో తెలంగాణతోపాటు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్,మధ్యప్రదేశ్, మేఘాలయ, తమిళనాడుతో సహా 20 రాష్ట్రాల్లో పసుపు పండిస్తున్నారు.బంగ్లాదేశ్, మలేషియా, అమెరికా, యూఏఈ దేశాలకు పసుపు ఎగుమతి అవుతోంది. పసుపు ఎగుమతులను రూ.1620 కోట్ల నుంచి 8,400 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.



 పసుపు రైతులకు ఆసరా ఏది?

తెలంగాణలోని గోదావరి నదీ తీర ప్రాంతాలైన ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, నిజామాబాద్,కామారెడ్డి, వరంగల్, ములుగు, హన్మకొండ జిల్లాల్లో 2.5 లక్షల ఎకరాల్లో పసుపు పంట సాగుచేస్తున్నారు. పసుపుబోర్డు ప్రకటించాక రైతులు పసుపు సాగు పట్ల మొగ్గు చూసుతున్నారని పసుపుబోర్డు సాధన సమితి నాయకుడు కోటపాటి నరసింహనాయడు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. కానీ పసుపు సాగుకు మేలైన రకం అందించడం లేదన్నారు. పసుపు స్టోరోజీ కోసం కోల్డ్ స్టోరేజీలు, రీసెర్చ్, వాల్యూయాడెడ్ ప్రోడక్టులు కల్పించక పోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని కోటపాటి ఆవేదన వ్యక్తం చేశారు.పసుపు దిగుబడులు పెంచే వంగడాలను కనుగొనేందుకు పరిశోధనలు చేయడంతోపాటు రైతులకు యంత్రపరికరాలు సరఫరా చేయడం, పసుపు ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రచారం చేయడానికి జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు చేసిన బడ్జెట్ కేటాయింపులు లేక కేవలం బోర్డుకే పరిమితం అయింద. కేంద్రానికి రూ.40 కోట్లు కేటాయించాలని ప్రతిపాదనలు పంపించినా కేంద్రం నుంచి స్పందన లేదు.

పసుపు బోర్డుకు బడ్జెట్ లో గుండు సున్నా
ప్రపంచంలోని పసుపులో 75శాతం భారతదేశం పండిస్తుంది. అయినప్పటికీ పసుపు రైతులకు దశాబ్దాలుగా సరైన మద్దతు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. 40 సంవత్సరాల డిమాండ్ తర్వాత జాతీయ పసుపు బోర్డు ఏర్పాటైనా నిధులు కేటాయించలేదు.కేంద్రప్రభుత్వం జాతీయ పసుపుబోర్డును ఏర్పాటు చేసినా అది తాత్కాలిక కార్యాలయం, కాగితాలకే పరిమితమైంది.2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్రబడ్జెట్ లో పసుపు బోర్డుకు నయాపైసా కూడా విదల్చలేదు. టీ, కాఫీ, రబ్బరు, స్పైసెస్ బోర్డులకు కోట్లాది రూపాయల నిధులు కేటాయించిన కేంద్రం పసుపు బోర్డుకు మాత్రం గుండు సున్నా చూపించిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు.అన్నిబోర్డులకు నిధులు కేటాయించి పసుపు బోర్డుకు మాత్రం గుండు సున్నా చూపించిందని ఆమె విమర్శించారు.



 పసుపు రైతులకు బోర్డు రిక్తహస్తం

నిజామాబాద్ జిల్లాలో ఈ నెల 29వతేదీన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేతుల మీదుగా జాతీయ పసుపుబోర్డు కార్యాలయం ప్రారంభం కానుంది. జనవరి 14వతేదీన నిజామాబాద్ లోని స్పైసెస్ బోర్డు కార్యాలయంలోనే తాత్కాలికంగా పసుపు బోర్డు కార్యాలయాన్ని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ వర్చువల్ గా ప్రారంభించారు. మళ్లీ రెండో సారి అమిత్ షా ఈ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. పసుపుబోర్డు ఏర్పాటై ఆరునెలలు గడుస్తున్నా ఇప్పటికీ పసుపు రైతులకు ఎలాంటి మేలు జరగలేదు.జాతీయ పసుపు బోర్డు నిజామాబాద్ ఎంపీ సాధించిన ఘనత అంటూ నిజామాబాద్ వీధుల్లో ప్రచార హోర్డింగులు పెట్టుకోవడం తప్పితే నిధులు తీసుకువచ్చి పసుపురైతులను ఆదుకోలేదని రైతు సంఘం నాయకుడు చెన్నమనేని శ్రీనివాసరావు చెప్పారు.



 ప్రణాళిక రూపొందిస్తాం : పల్లెపు గంగారెడ్డి

నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటై అయిదు నెలలు గడచినా రైతులకు ఎలాంటి మేలు జరగలేదు. జాతీయ పసుపు బోర్డు గడచిన ఆరు నెలలుగా బోర్డుకే పరిమితం కాగా రైతుల సంక్షేమానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీనిపై పసుపు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. బోర్డు ఏర్పాటైందని ప్రచారం తప్ప రైతులకు ఒరిగిందేమి లేదని పసుపురైతుల సమాఖ్య అధ్యక్షుడు పన్నాల తిరుపతి రెడ్డి చెప్పారు. కాగా తాము నిజామాబాద్ లో అమిత్ షాతో కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించాక పసుపు రైతుల అభ్యున్నతి కోసం ప్రణాళిక గురించి ఆలోచిస్తామని జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్, పసుపు రైతు గంగారెడ్డి చెబుతున్నారు.

పాత వంగడాలే దిక్కు
పసుపు రైతులు తాత ముత్తాల కాలం నాటి నుంచి వస్తున్న ఆర్మూర్, దుగ్గిరాల, తెల్ల గుంటూరు, ఎర్ర గుంటూరు పసుపు వంగడాలనే వేస్తున్నారు. పసుపు బోర్డు ఏర్పాటైన మేలైన అధిక దిగుబడి, అధిక కుర్కుమిన్ అందించే పసుపు వంగడాలను రైతులకు అందుబాటులోకి తీసుకురాలేక పోయారు. పసుపు కొత్త వంగడాల కోసం బోర్డు పరిశోధనలు చేయడం లేదు. పసుపు బోర్డు వచ్చిందని నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో రైతులు ఆశతో పసుపు సాగు చేస్తున్నారు.పసుపు హార్వెస్ట్ మేనేజ్ మెంట్, మార్కెటింగ్ సదుపాయాలు సజావుగా లేదు. దీంతో పసుపు సాగు విస్తీర్ణం పది శాతం పెరిగింది.పసుపులో అధిక కుర్కుమిన్, అధిక దిగుబడి ఇచ్చే కొత్త రకం వంగడాలను కనుగొనేందుకు పసుపు పరిశోధనా కేంద్రాన్ని పసుపుబోర్డుకు అనుబంధంగా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు ఆచరణ రూపం దాల్చలేదు. పసుపు శుద్ధి కర్మాగారాలు, ప్రాసెసింగ్ యూనిట్లు, కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేయాలనేది ఇంకా కాగితాల్లోనే ఉంది.

పెరిగిన పెట్టుబడి
పసుపు కూలీలకు అధికంగా కూలీడబ్బు చెల్లించాల్సి వస్తోంది. పసుపు రైతులకు అధునాతన యంత్ర పరికరాలను అందుబాటులోకి తీసుకువచ్చి పసుపు సాగు వ్యయం తగ్గించాలని రైతులు కోరుతున్నా బోర్డు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. దీంతో పెట్టుబడి వ్యయం పెరుగుతోంది.పసుపును భూమిలో నుంచి తీయడం, ఆరబెట్టడం, ఉడక బెట్టడం, ఎండు పసుపును శుభ్రం చేసి పాలిష్ చేయడానికి కావాల్సిన యంత్రపరికరాలు, బాయిలర్లను సబ్సిడీపై రైతులకు అందించాల్సి ఉండగా పసుపు బోర్డు ఎలాంటి చర్యలు చేపట్టలేదు.

పసుపు రైతుల డిమాండ్లు ఎన్నో...
రైతులు పండించి పసుపు పంటకు కేంద్రం గిట్టుబాటు ధర ప్రకటించలేదు. ప్రస్థుతం పసుపు క్వింటాల్ ధర రూ.12వేలే ఉంది. కనీసం రైతుకు క్వింటాల్ కు రూ.15వేలు ఇవ్వాలని పసుపురైతుల సమాఖ్య అధ్యక్షుడు పన్నాల తిరుపతి రెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. రైతులకు యంత్రపరికరాలు ఇచ్చి, కొత్త వంగడాలను అందుబాటులోకి తీసుకొని రావాలని పన్నాల తిరుపతిరెడ్డి డిమాండ్ చేశారు. నిజామాబాద్ కేంద్రంగా జాతీయ పసుపు బోర్డు ఏర్పాటైనా, ఇక్కడి మార్కెట్ లో పసుపునకు గిట్టుబాటు ధర లభించడం లేదు. మార్కెట్ లో కమీషన్ ఏజెంట్లు, దళారులు కుమ్మక్కై పసుపు క్వింటాలుకు రూ.9వేల నుంచి 11వేల రూపాయల ధరకే కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆరోపించారు. 9 నెలల పాటు ఆరుగాలం కష్టించి పండించిన పసుపు పంటను దళారీ ఎంత ధర అడిగితే అంతకే విక్రయించాల్సి వస్తుందని పసుపు రైతు సి లింబాద్రి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. తాను పసుపు క్వింటాల్ రేటు 8,790 రూపాయలకు విక్రయించినట్లు మరో రైతు పేర్కొన్నారు.




Tags:    

Similar News