వందసార్లు పిలిచినా విచారణకు వస్తా: కేటీఆర్
ఒకసారి కాదు.. వంద సార్లయినా జైలుకు వెళ్తాం. కేసీఆర్ లక్షల సైన్యాన్ని టచ్ చేసే ధైర్యం మీకు లేదు.;
ఫార్ములా ఈ-కార్ రేసు కేసు విచారణకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. విచారణకు హాజరుకావడానికి ముందు ఆయన మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న తమ గొంతులను నొక్కడానికే కాంగ్రెస్ సర్కార్ ఈ నోటీసుల నాటకాలు ఆడుతుందన్నారు. తప్పు చేయనప్పుడు తాము ఎవరికీ భయపడమని అన్నారు. రెండోసారి కాదు వందసార్లు రమ్మన్నా విచారణకు వస్తానని అన్నారు. ‘‘చట్టాలు, న్యాయస్థానాలు అంటే ఎనలేని గౌరవం, నమ్మకం ఉంది. నిజం అనేది ఎవరో అనే మాటలపై కాదు నిలకడమైన తెలుస్తుంది. ఇప్పటికే నన్ను మూడుసార్లు పిలిచారు. మరో 30 సార్లు.. వందసార్లు పిలిచినా వస్తాను. కేసీఆర్, హరీష్ రావును కాళేశ్వరం కమిషన్ ఎదుట కూర్చోబెట్టి పైశాచిక ఆనందం పొందారు. ఇవాళ నన్ను ఏసీబీ విచారణకు పిలిచి మానసిక ఆనందం పొందుతున్నారు. అరెస్టు కూడా చేయొచ్చు. తెలంగాణ కోసం గతంలో జైలుకు వెళ్లొచ్చాం. మళ్లీ జైలుకు వెళ్లాల్సి వచ్చినా భయపడేది లేదు. ఒకసారి కాదు.. వంద సార్లయినా జైలుకు వెళ్తాం. కేసీఆర్ లక్షల సైన్యాన్ని టచ్ చేసే ధైర్యం మీకు లేదు. మన ఇద్దరిపైనా ఏసీబీ కేసులు ఉన్నాయి. లైడిటెక్టర్ పరీక్షకు సిద్ధంగా ఉన్నారా?ఫార్ములా ఈ-రేసు వల్ల తెలంగాణ ఖ్యాతి పెరిగింది. మీ చర్యలతో రాష్ట్రం పరువు పోతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయండి. రైతుబంధు ఎలక్షన్ బంధుగా మార్చారు. కాంగ్రెస్, భాజపా తోడు దొంగలే’’ అని అన్నారు.