కాళేశ్వరం ప్రాజెక్టులో ఇంజనీరే రు. 200 కోట్లు సంపాదిస్తే ఇక...
పిల్లర్లు కుంగిపోయాయన్నా, డ్యాం ప్లాట్ ఫారమ్ పగుళ్ళిచ్చేసిందంటేనే నిర్మాణం నాసిరకంగా జరిగిందని అందరికీ అర్ధమైపోయింది;
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అవకతవకలు ఇపుడు తెలంగాణ అంతటా హాట్ టాపిక్ అయిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు దానికి అనుబందంగా మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం బ్యారేజీలను బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ దగ్గరుండి మరీ కట్టించారు. ఈప్రాజెక్టుల నిర్మాణాలను ఇరిగేషన్ శాఖ మంత్రిగా హరీష్ రావు(Harish Rao), కేసీఆర్(KCR) నమ్మిన సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ దగ్గరుండి మరీ పర్యవేక్షించారు. ఇంతమంది దగ్గరుండి పర్యవేక్షించి నిర్మించిన కాళేశ్వరం ఇపుడు ఎందుకూ పనికిరాకుండాపోయింది. ఎందుకంటే మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాకులో మూడు పిల్లర్లు భూమిలోకి కుంగిపోయాయి. పిల్లర్లు కుంగిపోవటంతో పిల్లర్లపైన కట్టిన ప్లాట్ ఫారమ్ కూడా పగుళ్ళిచ్చేసింది. ఫలితంగా బ్యారేజి నీటినిల్వకు పనికిరాకుండా పోయింది. నీటి నిల్వకు పనికిరాకుండాపోయిన తర్వత ఇక బ్యారేజీల వల్ల ఉపయోగం ఏమిటి ?
తెలంగాణ(Telangana)లో సామాన్య జనాల నుండి ఇంజనీరింగ్, ఇరిగేషన్ నిపుణుల వరకు అందరిలోను తొలిచేస్తున్న పై ప్రశ్నకు సమాధానం చెప్పేదెవరు ? కేసీఆర్, హరీష్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), కల్వకుంట్ల కవిత(Kavitha) మాత్రం ప్రాజెక్టుల్లో ఎలాంటి అవకతవకలు, అవినీతి జరగలేదని పదేపదే వాదిస్తున్నారు. పిల్లర్లు కుంగిపోయాయన్నా, డ్యాం ప్లాట్ ఫారమ్ పగుళ్ళిచ్చేసిందంటేనే నిర్మాణం నాసిరకంగా జరిగిందని అందరికీ అర్ధమైపోయింది. నిర్మాణాలు నాసిరకంగా జరిగాయంటేనే ఏస్ధాయిలో అవినీతి జరిగిందో తెలిసిపోతోంది. అవినీతి జరిగిందనేందుకు తాజాగా ఉదాహరణ బయటపడింది. అదేమిటంటే కాళేశ్వరం ప్రాజెక్టులో ఒకపుడు పనిచేసిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఇఇ)నూనె శ్రీధర్ ఏసీబీకి పట్టుబడటమే.
ఇరిగేషన్ శాఖ, కాళేశ్వరం కార్పొరేషన్ లో అధికారుల వ్యవస్ధను(హైరార్కి) తీసుకుంటే ఇఇ స్ధాయి చాలా చిన్నదనే చెప్పాలి. ఇఇపైన డిప్యూటి సూపరెండెంట్ ఇంజనీర్లు, సూపరెండెంట్ ఇంజనీర్లు, డిప్యుటి చీఫ్ ఇంజనీర్లు, చీఫ్ ఇంజనీర్లు, ఇంజనీర్ ఇన్ చీఫ్ లు చాలామంది ఉంటారు. వీళ్ళతో పోల్చితే ఇఇ స్ధాయి ఏమిటో ఎవరికైనా అర్ధమైపోతుంది. అలాంటి ఇఇ శ్రీధర్ దగ్గర పట్టుబడిన ఆస్తులే సుమారు రు. 200 కోట్లు. తెల్లాపూర్ లో విల్లా, షేక్ పేటలోని స్కైహై గేటెడ్ కమ్యూనిటిలో 4500 చదరపు అడుగుల ఫ్లాట్, అమీర్ పేటలో కమర్షియల్ కాంప్లెక్స్, కరీంనగర్లో మూడు ఫ్లాట్లు, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్లో తలా మూడు విశాలమైన భవనాలు, 16 ఎకరాల వ్యవసాయ భూమి, 19 ఇళ్ళ స్ధలాలు, రెండు ఖరీదైన కార్లు, బంగారు ఆభరణాలు, ఇంట్లో, బ్యాంకు లాకర్లలో సుమారు 30 లక్షల హార్డ్ క్యాష్, బ్యాంకుల్లో ఫిక్సుడు డిపాజిట్లు ఇప్పటికి ఏసీబీ అధికారులు గుర్తించినవి మాత్రమే. తవ్వేకొద్దీ ఇంకా ఎన్ని బయటపడతాయో చూడాలి. ఏసీబీ అధికారులు అంచనా వేసిన విలువే సుమారు రు. 200 కోట్లుంటాయి.
కళ్ళుచెదిరే ఆస్తులు
ఒక ఇఇ స్ధాయి అధికారి అక్రమసంపాదనే వందల కోట్ల రూపాయల్లో ఉంటే ఇక అంతకన్నా పై స్ధాయిలో పనిచేసిన, చేస్తున్న ఉన్నతాధికారుల సంపాదన ఇంకెంత ఉంటుంది ? అందరు అధికారులు ఇలాగే అడ్డదిడ్డంగా సంపాదిస్తారని చెప్పేందుకు లేదు. అయితే ఎక్కువమంది అక్రమసంపాదనకు అలవాటు పడినవారే అని ఇప్పటికే చాలాసార్లు బయటపడింది. కాళేశ్వరం ప్రాజెక్టులోనే ఇంజనీర్ ఇన్ చీఫ్ గా పనిచేస్తున్న హరిరామ్ ను ఏసీబీ అధికారులు ఆమధ్య పట్టుకున్నారు. సోదాల్లో వందల కోట్లరూపాయల విలువైన ఆస్తులు, బంగారు ఆభరణలు, లక్షల రూపాయలు, బ్యాంకుల్లో ఫిక్సుడు డిపాజిట్లు బయటపడిన విషయం గుర్తుండే ఉంటుంది. ఒక ఇఇ, మరో ఈఎన్సీ అక్రమసంపాదనే ఈ స్ధాయిలో ఉంటే ఇక పాలకుల సంపాదన ఏ స్ధాయిలో ఉంటుందనే చర్చ జనాల్లో బాగా పెరిగిపోతోంది. నిజంగానే పాలకుల ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించి ప్రకటిస్తే జనాలకు షాక్ కొడుతుందేమో.
థాయ్ ల్యాండ్ కు ప్రత్యేక విమానం
ఇపుడు పట్టుబడిన శ్రీధర్ పర్యవేక్షణలోనే కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంతో కీలకమైన 6,7,8 ప్యాకేజీల పనులు జరిగాయి. ఈ పనులన్నింటికీ కలిపి ప్రభుత్వం అప్పట్లో రు. 15 వేల కోట్లు ఖర్చుపెట్టింది. ప్రాజెక్టులో కీలకమైన లక్ష్మీ పంప్ హౌస్ ల నిర్మాణాలు, నిర్వహణను శ్రీధర్ చూసుకున్నట్లు సమాచారం. ఈమధ్యనే కొడుకు పెళ్ళి థాయ్ ల్యాండ్ లో జరిగింది. ఆ వివాహానికి అతిధులను శ్రీధర్ ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశారు.
హరిలాల్, శ్రీధర్ దగ్గర పట్టుబడిన ఆస్తులను చూసిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి, అవకతవకలు జరగలేదన్న కేసీఆర్, కేటీఆర్, హరీష్ వాదన ఉత్త డొల్లే అని అర్ధమైపోతోంది. ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి జరగకపోతే ఇంజనీర్ల సంపాదన వందల కోట్ల రూపాయల్లో ఎలాగుంటుంది ? నిర్మాణాలు నాసిరకంగా ఎందుకు ఉంటుంది ? నిర్మాణాలు నాసిరకంగా ఉండబట్టే కదా లక్ష కోట్లరూపాయల ప్రజాధనంతో నిర్మించిన మూడేళ్ళల్లోనే ప్రాజెక్టు వాడకానికి పనికిరాకుండా పోయింది. క్షేత్రస్ధాయిలో జరిగింది చూస్తుంటే కాళేశ్వరంలో ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగింది, అవకతవకలు జరిగింది వాస్తవమే అన్నది అర్ధమైపోతోంది. కాకపోతే జరిగిన అవినీతి, అవకతవకల్లో ఎవరి వాటా ఎంతన్న విషయమే తేలాల్సుంది ? ఆ విషయాన్ని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టులో బయటపడుతుందా ?