ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులకు
196 దేశాల ప్రతినిధులను అప్రమత్తం చేయనున్న ఇంటర్పోల్.;
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అధికారం పొందడానికి గత ప్రభుత్వం ప్రత్యర్థులు, ప్రముఖుల ఫోన్లను ట్యాపింగ్ చేశారన్న అంశాలు తీవ్ర చర్చలకు దారితీశాయి. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అధికారులు నిర్ధారించారు. ఈ కేసులో భాగంగానే నలుగురు పోలీసు అధికారులను అదుపులోకి తీసుకున్నారు. దాదాపు పది నెలలు జైలులో ఉన్న వారు.. ఇటీవల బెయిల్పై విడుదలయ్యారు. కాగా ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న కొందరు విదేశాలకు వెళ్లిపోయారు. దీంతో వారిని తిరిగి భారత్కు తీసుకురావడం అతిపెద్ద సవాల్గా మారింది. వారిని ఎలాగైనా తిరిగి తీసుకురావాలని అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈకేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. విదేశాలలో ఉన్న ఇద్దరు నిందితులకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడానికి అధికారులు చేస్తున్న ప్రయత్నాలకు మార్గం సుగమం అయింది. నిందితుల్లో అత్యంత కీలకంగా ఉన్న ప్రభాకర్రావు.. కెనడాకు వెళ్లి ఉన్నారు. మరో నిందితుడు శ్రవణ్ రావు.. బెల్జియంలో ఉన్నారు. వారిని అరెస్ట్ చేసి హైదరాబాద్కు తీసుకురావడానికే ఈ రెడ్ కార్నర్ నోటీసులు ఇవ్వాలని అధికారులు నిశ్చయించుకున్నారు.
ఈ నోటీసులు సీబీఐ ద్వారా ఇంటర్పోల్కు చేరుకున్నాయి. విదేశాల్లోని నిందితులకు నోటీసులు జారీ చేయాలని సీబీఐ కోరింది. నోటీసులు అందుకున్న ఇంటర్పోల్ 196 దేశాల ప్రతినిధులను అప్రమత్తం చేయనుంది. తొలుత అమెరికాకు వెళ్లిన నిందితులిద్దరూ ఇటీవల అమెరికా నుంచి కెనడా, బెల్జియంలకు వెళ్లారు. ఈ క్రమంలోనే వారిద్దరికీ రెడ్ కార్నర్ నోటీసు జారీ అయితే ఇద్దరిని ఇండియాకి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు.